వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేశ్
వర్ధన్నపేట, జూన్ 9 : ఎస్సీ కార్పొరేషన్ ద్వారా మంజూరు చేసే రుణాల కోసం ప్రత్యేక కార్యాచరణ రూపొందించాలని వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేశ్ అధికారులను ఆదేశించారు. బుధవారం ప్రశాంతినగర్లోని ఆయన నివాసంలో బుధవారం ఉదయం ఎస్సీ కార్పొరేషన్ అధికారులతో రుణాల కార్యాచరణపై ప్రత్యేక సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎస్సీ కార్పోరేషన్ నుంచి నిరుద్యోగులు, చిరు వ్యాపారులకు ఉపాధి కల్పించేందుకు త్వరలో సబ్సిడీ రుణాలను మంజూరు చేస్తారని అన్నారు. నియోజకవర్గ పరిధిలోని నాలుగు మండలాలు పైలట్ ప్రాజెక్టుగా ఎంపికవడంతో రుణాలు మంజూరుపై ప్రణాళికలను తయారు చేయాలని ఆయన కోరారు. నిరుద్యోగులకు ఉపయోగపడేలా యూనిట్లు మంజూరు చేయిస్తామన్నారు. దరఖాస్తు చేసుకునే చిరువ్యాపారులందరికీ రుణాలు అందేలా చూడాలని అధికారులకు ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో ఎస్సీ కార్పొరేషన్ వరంగ్ ఆర్బన్, రూరల్ జిల్లాల ఈడీలు మాధవి, సురేశ్ పాల్గొన్నారు.