కవిసమ్మేళనంలో కలెక్టర్ కృష్ణ ఆదిత్య, జడ్పీ చైర్పర్సన్ జక్కు శ్రీహర్షిణి
భూపాలపల్లి రూరల్/కాటారం, ఏప్రిల్4: సమాజాన్ని జాగృత పరిచేవి కళలని కలెక్టర్ కృష్ణ ఆదిత్య అన్నారు. స్వాతంత్య్ర భారత్ అమృత మహోత్సవాల్లో భాగంగా శనివారం రాత్రి సింగరేణి ఇల్లందు క్లబ్హౌస్లో అధికారికంగా నిర్వహించిన కవి సమ్మేళనం కార్యక్రమానికి జడ్పీ చైర్పర్సన్ జక్కు శ్రీహర్షిణితో కలిసి ముఖ్య అతిథిగా పాల్గొన్న కలెక్టర్ జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా 24 మంది కవులు కవితాగానం చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ సమాజాన్ని చైతన్యం చేసే శక్తి కళలకే ఉందని అన్నారు. నైపుణ్యం ఉన్న కవులు, కళాకారులు జిల్లాలో అనేక మంది ఉన్నారని, కవి సమ్మేళనం లాంటి కార్యక్రమాల ద్వారా వారిలోని ప్రతిభాపాటవాలు సమాజానికి అవగతమవుతాయని ఆయన అన్నారు.
ఈ సందర్భంగా జడ్పీ చైర్పర్సన్ మాట్లాడుతూ మొదటి సారి ప్రత్యక్షంగా కవి సమ్మేళనం కార్యక్రమాన్ని చూస్తున్నానని, పాటల ద్వారానే తెలంగాణ ఉద్యమం ప్రజల్లోకి బలంగా వెళ్లి తెలంగాణ రాష్ట్రం సిద్ధించినదని అన్నారు. రాష్ట్రంలో కవులు, కళాకారులకు ప్రభుత్వం విశేష ఆదరణ కల్పిస్తున్నదని అన్నారు. ఈ సందర్భంగా జేసీ స్వర్ణలత మాట్లాడుతూ తెలుగు గొప్పదనాన్ని చాటేలా కవి సమ్మేళనాన్ని నిర్వహించారని అధికారులను అభినందించారు. అనంతరం కవులకు నగదు పురస్కారంతోపాటు జ్ఞాపికలను అందజేశారు. కార్యక్రమంలో ఆర్డీవో శ్రీనివాస్, మహదేవపూర్ ఎంపీపీ రాణీబాయి, టేకుమట్ల జడ్పీటీసీ పులి తిరుపతిరెడ్డి, డీపీఆర్వో రవికుమార్, డీబీసీడీవో శైలజ, జిల్లా యువజన సర్వీసులు, క్రీడల అభివృద్ధి అధికారి సునీత, తహసీల్దార్ ఇక్బాల్, కలెక్టర్ కార్యాలయ సూపరింటెండెంట్ రవికుమార్, కవులు, కళాకారులు పాల్గొన్నారు.
ప్రభుత్వ ఉపాధ్యాయుడి సత్తా
భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని పరిపాలన కార్యాలయంలో కలెక్టర్ కృష్ణ ఆదిత్య ఆధ్వర్యంలో 75వ స్వాతంత్య్ర భారత అమృత మహోత్సవాలను పురస్కరించుకొని నిర్వహించిన కవి సమ్మేళనంలో కాటారం మండలంలోని బయ్యారం గ్రామానికి చెందిన ఉపాధ్యాయుడు పసుల శంకర్ సత్తా చాటారు. స్వాతంత్య్ర స్ఫూర్తిని చాటేలా కవితా పఠనంతో ప్రశంసలు అందుకున్నారు.
ఇవి కూడా చూడండి..