గత తప్పిదాలు పునరావృతం కావొద్దు
అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలి
కలెక్టర్ కృష్ణ ఆదిత్య
కలెక్టరేట్లో జిల్లా స్థాయి అధికారులతో సమీక్ష
ములుగుటౌన్, అక్టోబర్ 29 : ఆసియా ఖండంలోనే అతిపెద్ద గిరిజన జాతరగా పేరుగాంచిన సమ్మక్క-సారలమ్మ జాతరను పటిష్టంగా నిర్వహించాలని కలెక్టర్ కృష్ణ ఆదిత్య అన్నారు. ప్రతి రెండేళ్లకోసారి జరిగే మేడారం మహా జాతర ఏర్పాట్లపై కలెక్టరేట్ ఆడిటోరియంలో శుక్రవారం జిల్లా స్థాయి అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ నార్లాపూర్, వెంగళాపూర్, కన్నెపల్లి, డొడ్ల గ్రామాల్లో కమ్యూనిటీ టాయిలెట్స్కు అనుమతి ఇచ్చి నిర్మాణానికి సంబంధిత తహసీల్దార్లు ఏర్పాట్లు చూడాలన్నారు. మేడారంలో వాహన పార్కింగ్ స్థల విషయంలో గతంలో జరిగిన తప్పిదాలు పునావృతం కాకుండా చూడాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. కారు పార్కింగ్ వద్ద నైపుణ్యం కలిగిన వ్యక్తికి యూనిఫాం అందజేసి రుసుము వసూలు చేయాలన్నారు. కల్యాణ మండపంలో మరమ్మత్తులు, గుడి ప్రాంగణంలో 24 గంటలు లైట్స్ వెలిగేలా చూడాలన్నారు. బోర్వెల్స్ మంజూరు చేశామని, హ్యాండ్ పంపులు మరమ్మత్తులు చేయాలని ఆర్డబ్ల్యూఎస్ అధికారులను ఆదేశించారు. డీఆర్వో రమాదేవి మాట్లాడుతూ అమ్మవార్ల కృపా కటాక్షాలతో ఎలాంటి ఇబ్బందులు లేకుండా జాతర సజావుగా జరుతుందని అన్నారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ త్రిపాఠి, ఐటీడీఏ పీవో వసంతరావు, జడ్పీ వైస్ చైర్మన్ బడే నాగ జ్యోతి, కలెక్టరేట్ ఏవో శ్యామ్, డీఎంహెచ్వో అప్పయ్య, డీపీవో వెంకయ్య, తాడ్వాయి ఎంపీపీ వాణిశ్రీ, ఎంపీడీవో సత్యాంజనేయ ప్రసాద్, సర్పంచ్ బాబురావు, ప్రధాన పూజారి జగ్గారావు, ట్రైబల్ వెల్ఫేర్ ఈఈ ప్రేమలత, తదితరులు పాల్గొన్నారు.