నర్మెట, ఆగస్టు 14: జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో జరిగిన పనులపై గ్రామసభల్లో సమీక్ష నిర్వహించినట్లు ఎంపీడీవో ఖాజానయీమొద్దీన్ తెలిపారు. శనివారం ఆగపేట, ఇప్పలగడ్డ, మాన్సింగ్తండా, ఇసుకబాయితండా గ్రామాల్లో జరిగిన పనులపై సామాజిక తనిఖీ బృందం నిర్వహించిన అడిట్ నివేదికను ఆయా గ్రామసభల్లో చదివి వినిపించారు. ఆగపేటలో మల్టీపర్సస్ వర్కర్ల పేరున రూ.19 వేలు డ్రా చేసినట్లు ఎస్ఆర్పీ గంగరాజు గ్రామసభలో చదివి వినిపించారు. ఇంకుడుగుంతల బిల్లులను లబ్ధిదారులకు అందించడంలో స్థానిక అధికారులు జాప్యం చేయడంతో చెక్కులు అందించారు. ఈ నెల 15న వెల్దండ, హన్మంతాపూర్, మల్కపేట, 16న కన్నెబోయినగూడెం, 19న సూర్యబండతండా, గుంటూరుపల్లి, మచ్చుపహాడ్, లోక్యతండా, నర్మెట, గండిరామవరం, అమ్మాపురం, బొమ్మకూర్, దొంగచెలిమెతండా గ్రామాల్లో ఉదయం 10 గంటలకు గ్రామసభలు నిర్వహిస్తామని ఏపీవో రమాదేవి తెలిపారు. ఈ నెల 20న మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయ ఆవరణలో సామాజిక తనిఖీ మండల సభ నిర్వహించనున్నట్లు ఆమె పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్లు ముప్పిడి లక్ష్మి, నీరేటి రాణి, కున్సోత్ పావని జయరాంనాయక్, బానోత్ అనిత, స్టేట్ రిసోర్స్ పర్సన్ గంగరాజు, డీఆర్పీలు, పంచాయతీ కార్యదర్శులు, వార్డు సభ్యులు పాల్గొన్నారు.