కరువును జయించిన బచ్చన్నపేట
ఏ ఊళ్లో చూసినా గోదావరి జలాలే..
ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభంలో జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్ది యాదగిరిరెడ్డి
బచ్చన్నపేట, నవంబర్ 7 : ‘ఒకప్పుడు ఉద్యమ సమయంలో బచ్చన్నపేటకు వచ్చిన సీఎం కేసీఆర్ ఇక్కడ పరిస్థితులను చూసి చలించిపోయారు. కరువు, దుర్భిక్ష పరిస్థితులు గమనించిన కేసీఆర్ యాదన్న ఈ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేసే బాధ్యత నీదే అని చెప్పారు.. ఆ మాట ప్రకారం గోదావరి జలాలతో జిల్లాను పునీతం చేశారు..’ అని జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి అన్నారు. ఆదివారం మండల కేంద్రంలోని మార్కెట్ గోదాముల వద్ద ఐకేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆయన ప్రారంబించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఉమ్మడి రాష్ట్రంలోనే కాదు, దేశంలోనే కరువుతో కొట్టు మిట్టాడిన బచ్చన్నపేట, జనగామ ప్రాంతాలను ఆనాడు చూసిన కేసీఆర్ అధికారంలోకి రాగానే ఇక్కడి బీడు భూములకు గోదావరి జలాలు తరలించారని ముత్తిరెడ్డి వివరించారు. నాడు చుక్కనీరు దొరకని ప్రాంతంలో నేడు భూగర్భ జలాలు ఉబికి వస్తున్నాయని తెలిపారు. తెలంగాణ యావత్తు పండించిన వరి పంట దేశంలోని 70 శాతం ప్రజలకు అన్నం పెట్టే స్థాయికి ఎదిగిందన్నారు. రైతన్నలు పండించిన పంటలతో గోదాములు సరిపోవడం లేదన్నారు. విద్యుత్తు ఉత్పత్తి కేంద్రాలు ఏర్పాటు చేసి వ్యవసాయానికి నిరంతరం కరంటు ఇస్తున్నామన్నారు. గత సీజన్లో రూ.30 వేల కోట్లు వెచ్చించి రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేశామన్నారు. కానీ కేంద్ర ప్రభుత్వం మాత్రం ధాన్యం కొనే స్థితిలో లేదన్నారు. అందుకే మార్కెట్లో డిమాండ్ ఉన్న పంటలు సాగు చేయాలన్నారు. రైతులంతా సర్కారు సూచించిన పంటలే సాగు చేసి ఆర్థికంగా ఎదగాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ వడ్డేపల్లి మల్లారెడ్డి, రైతుబంధు సమితి జిల్లా అధ్యక్షుడు ఇర్రి రమణారెడ్డి, జడ్పీ వైస్ చైర్పర్సన్ గిరబోయిన భాగ్యలక్ష్మీఅంజయ్య, ఎంపీపీ బావండ్ల నాగజ్యోతీకృష్ణంరాజు, డీఆర్డీవో రాంరెడ్డి, అదనపు డీఆర్డీవో నూరొద్దీన్, సర్పంచ్ల ఫోరం మండల అధ్యక్షుడు గంగం సతీష్రెడ్డి, ఏపీఎం జ్యోతి, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు చంద్రారెడ్డి, పీఏసీఎస్ చైర్మన్ పూర్ణచందర్, రైతబంధు సమితి మండల కన్వీనర్ సంజీవరెడ్డి, నాయకులు అంజయ్య, కృష్ణంరాజు, నరేందర్, షబ్బీర్, వేణుగోపాల్, ఆంజనేయులు, మద్దికుంట రాధ, కరుణాకర్రెడ్డి, మహేందర్రెడ్డి, వినోద్ పాల్గొన్నారు.