నేతల పర్యటనలతో కోలాహలంగా నగరం
ఐదు రోజుల పాటు సాగిన క్యాంపెయిన్
30న పోలింగ్, మే 3న ఓట్ల లెక్కింపు
ఏర్పాట్లు చేస్తున్న అధికారులు
వరంగల్,ఏప్రిల్ 27: మహానగర పాలకవర్గ ఎన్నికల ఘట్టంలో ప్రచా ర పర్వం ముగిసింది. ఇక పోలింగ్, ఓట్ల లెక్కింపే మిగిలింది. ప్రచార పర్వం పూర్తికావడంతో అధికార యంత్రాంగం ఎన్నికల నిర్వహణకు సిద్ధమవుతోంది. ఈ నెల 15 రాష్ట్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసిన రోజు నుంచి గ్రేటర్లో ఎన్నికల సందడి మొదలైంది. నామినేషన్లు, ఉపసంహరణ ప్రక్రియ అనంతరం 23వ తేదీ నుంచి 27 సాయం త్రం వరకు అన్ని రాజకీయ పార్టీలు జోరుగా ప్రచారం చేశాయి. గ్రేటర్ కార్పొరేషన్ పరిధిలోని 66 డివిజన్లలో బరిలో నిలిచిన 500 మంది అభ్యర్థులు ఐదు రోజు పాటు ప్రచారాన్ని హోరెత్తించారు. డప్పుచప్పుళ్లు, మైక్ ల హోరుతో ప్రచారం సాగింది. ఎన్నికలకు తక్కువ సమయం కేటాయించడంతో అన్ని పార్టీలు ప్రచారాన్ని దుమ్ములేపాయి. స్వతంత్ర అభ్యర్థులు సైతం ప్రచారంలో తామేమి తక్కువ కాదన్నట్లు దూసుకపోయాయి.
గత రెండు రోజులుగా నగరంలో రాజకీయ పార్టీల ఆగ్రనేతలు గ్రేటర్లో సుడిగాలి ప్రచారం చేశారు. టీఆర్ఎస్ పార్టీ నుంచి జిల్లా మంత్రులు ఎర్రబెల్లి దయాకర్రావు, సత్యవతి రాథోడ్లతో పాటు డిప్యూటి సీఎం మహమూద్ అలీ, మంత్రి కొప్పల ఈశ్వర్లతో పాటు స్థానిక ఎమ్మెల్యేలు ప్రచారంలో పాల్గొన్నారు. రోడ్షోలతో గ్రేటర్ అంతా కలియదిరుగుతూ ప్రచారాన్ని హోరెత్తించారు. బీజేపీ నుంచి కేంద్ర మంత్రి కిషన్రెడ్డి, రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, కాంగ్రెస్ పార్టీ నుంచి ఎంపీ రేంవత్రెడ్డిలు రోడ్ షో చేశా రు. ప్రచారం పర్వం చివరి రోజు మంగళవారం అన్ని పార్టీలు జోరుగా ప్రచారం చేశాయి.
పోలింగ్కు ముమ్మరంగా ఏర్పాట్లు
ఈ నెల 30న జరిగే పోలింగ్కు అధికారులు సర్వం సిద్ధం చేశారు. ఉద యం 7గంటల నుంచి సాయంత్రం 3 గంటల వరకు పోలింగ్ ప్రక్రియ జరుగనుంది 66 డివిజన్ల కోసం 878 పోలింగ్ స్టేషన్లను ఏర్పాటు చేసి మౌలిక వసతులు కల్పించారు. 20మంది సెక్టోరియల్ అధికారులను నియమించారు. 20 పోలింగ్ కేంద్రాలను ఒక సెక్టోరియల్ అధికారికి అప్పగించారు. పోలింగ్ సామగ్రి పంపిణీ కోసం రెండు సెంటర్లలో అధికారులు ఏర్పాట్లు చేశారు. ఆర్ట్స్ కళాశాల, నిట్లలో ఇప్పటికే అన్ని ఏర్పా ట్లు చేసి పంపిణీకి సిద్ధం చేసి ఉంచారు. కొవిడ్ నేపథ్యంలో సిబ్బందికి మాస్కులు, గ్లౌజ్లు, సానిటైజర్లు సిద్ధం చేసి ఉంచారు. ఈ ఎన్నికల్లో 80 సంవత్సరాల వృద్ధులకు పోస్టల్ బ్యాలెట్ అవకాశం కల్పించారు. దీని కోసం అధికారులు ప్రత్యేకంగా అభ్యర్థుల సమక్షంలో పోస్టల్ బ్యాలెట్ బాక్స్లను సీల్ చేశారు. పోస్టల్ బ్యాలెట్ కోసం దరఖాస్తులు చేసుకున్న వారందరికీ పోస్ట్ ద్వారా పంపించే ప్రక్రియను అధికారుల చేపట్టారు.
మే 3న ఓట్ల లెక్కింపు
మే 3తో ఓట్ల లెక్కింపుతో చివరి ఘట్టం ముగియనుంది. రాంపూర్లోని ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో ఉదయం 8 గంటల నుంచి లెక్కింపు ప్రక్రియ ప్రారంభం కానుంది. ఈసారి బ్యాలెట్ పద్ధతిలో ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో లెక్కింపు ఆలస్యం కానుంది. సాయంత్రం వరకు ఫలితాలు వెలువడుతాయని అధికారులు చెబుతున్నారు. ఇప్పటికే ఎన్నికల అధికారి, కలెక్టర్ రాజీవ్గాంధీ హన్మంతు, అదనపు ఎన్నికల అధికారి, కమిషనర్ పమేలా సత్పతి ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. ఎన్నికలు సజావుగా, ప్రశాంతంగా జరిగేలా సిటీ పోలీస్ కమిషనర్ తరుణ్జోషి పర్యవేక్షిస్తున్నారు.