మంగపేట, సెప్టెంబర్10 : మంగపేట మండలం వాగొడ్డుగూడెం పంచాయతీలోని లక్ష్మీనర్సాపురంలో నాగులమ్మ గుడి వద్ద ఆదివాసీ గిరిజనులు ఆదివారం సామకొత్తల పండుగను ఘనంగా జరుపుకొన్నారు. ఏటా పుబ్బా కార్తెలో ఈ పండుగను జరుపుకోవడం ఆనవాయితీ. పొలాలు, పెరట్లో పండిన వివిధ రకాల తొలి పంటలను నాగులమ్మకు సమర్పించి గద్దెల వద్ద పూజలు చేసిన తర్వాతే తాము తింటామని, అనేక ఏళ్లుగా ఈ సంప్రదాయాన్ని పాటిస్తున్నామని గుడి ప్రధాన పూజారులు బాడిశ రామకృష్ణస్వామి, నాగ రమేశ్, నవీన్, కుల పెద్దలు తెలిపారు. సామకొత్తల పండగ సందర్భంగా తొలుత నాగులమ్మకు గజ్జెలు, మువ్వలు, జెండాలు, అడారాలను ఆదివాసీ పూజారులు, వడ్డెలు ఉదయాన్నే గోదావరి నీటితో శుద్ధిచేసి పసుపు కుంకుమలతో అలంకరించారు.
ఆ తర్వాత చేతికొచ్చిన చిరు పొట్ట దశలో ఉన్న కొర్రలు, సామలు, జొన్నలు వంటి చిరుధాన్యాలు, కంకవడ్లను బెల్లంతో కలిపి పాయసం చేశారు. దీనితో పాటు మక్కజొన్న కంకులు, కొన్ని కూరగాయలను ప్రధాన పూజారి రామకృష్ణ స్వామి ఇంటినుంచి డోలి వాయిద్యాల నడుము తెచ్చి నాగులమ్మకు సమర్పించారు. పొట్ట దశలో ఉన్న చిరుధాన్యాల పైరు(యెన్ను)ను నాగులమ్మ గుడి ఆవరణలోని సమ్మక-సారలమ్మ, పగిడిద్దరాజు, గడికమారాజు, ఎర్రమ్మ, మారెమ్మల గద్దెల వద్ద ప్రత్యేక పూజలు చేసి కట్టారు. ఈ వేడుకల్లో పూజారులు సోడి సత్యం, కుర్సం పుల్లయ్య, మడకం రమేశ్, వడ్డెలు మడకం రాజేశ్వరరావు, మడకం లక్ష్మయ్య, ఈసం సమ్మక, కట్టం సమ్మక, కట్టం నాగరాజు, కారం రాజేశ్, ఆదివాసీ పెద్దలు విష్ణుమూర్తి, బొగ్గుల కృష్ణమూర్తి, బాడిశ శ్రావణ్, కొర్స సమ్మక, పరిసర గ్రామాల ఆదివాసీ గిరిజనులు పాల్గొన్నారు.