హనుమకొండ, ఆగస్టు 20 : కాజీపేట వైఎస్సార్ నగర్లో 30 ఏళ్లుగా నివసిస్తున్న వారికి ఇంటి పట్టాలు కేటాయించి ప్రభుత్వమే ఇందిరమ్మ ఇండ్లు నిర్మించి ఇవ్వాలని శాసన మండలిలో ప్రతిపక్ష నేత సిరికొండ మధుసూదనాచారి, మాజీ చీఫ్ విప్ దాస్యం వినయ్భాస్కర్ డిమాండ్ చేశారు. గురువారం సాయంత్రం హనుమకొండ కలెక్టర్ చాహత్ బాజ్పాయ్ని కలిసి వినతి పత్రం అందజేశారు. కాలనీ ప్రజల సమస్యను త్వరితగతిన పరిషరించాలని కోరారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బీఆర్ఎస్ ప్రభుత్వంలో వైఎస్సార్ నగర్ ప్రజలకు అండగా నిలుస్తూ ప్రభుత్వ పథకాలను ప్రతి గడపకు అందించామన్నారు. కాంగ్రెస్ సర్కారు రాగానే పేదలను కొట్టి పెద్దలకు పెట్టాలనే నినాదంతో కాలనీని ఖాళీ చేయించి కార్పొరేట్ సంస్థలకు అప్పగించాలని చూస్తున్నదన్నారు.
ఇక్కడ నివసిస్తున్న దాదాపు 100 కుటుంబాలకు ఇంటి నంబర్లు, కరెంటు మీటర్లున్నాయన్నారు. స్థానిక ఎమ్మెల్యే అండదండలతో కాంగ్రెస్ నాయకులు ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నారన్నారు. ఖాళీ చేయకుంటే బుల్డోజర్లతో కూల్చేస్తామంటూ బెదిరింపులకు దిగుతున్నారన్నారు. కాలనీలో దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారు, గర్భిణులు ఉన్నారని, వారిపై కాంగ్రెస్ దుండగులు చేస్తున్న అరాచకాలతో ఆందోళన చెందుతున్నారన్నారు. ప్రభుత్వం వెంటనే ఇళ్ల పట్టాలు కేటాయించి ఇండ్లు నిర్మించాలన్నారు. డబుల్ బెడ్రూం ఇండ్లు ఇప్పిస్తామని కాంగ్రెస్ నాయకులు మాయమాటలు చెబుతూ వారిని బజారు పాలు చేసేందుకు యత్నిస్తున్నారన్నారు. కాలనీ ప్రజలకు న్యాయం చేయకుంటే బీఆర్ఎస్ ఆధ్వర్యంలో నిరసనలు చేపడతామని వారు హెచ్చరించారు.