కాశీబుగ్గ, జూలై 13 : బీఆర్ఎస్ పార్టీ బూత్ లెవల్ ఏజెంట్ (బీఎల్ఏ)లు బాధ్యతగా వ్యవహరించాలని, అర్హులైన ప్రతి ఒక్కరికి ఓటు హక్కు కల్పించేందుకు కృషి చేయాలని వర్ధన్నపేట మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేశ్ అన్నారు. సోమవారం గ్రేటర్ వరంగల్ 3వ డివిజన్ ఆరెపల్లిలో బీఆర్ఎస్ డివిజన్ మాజీ అధ్యక్షుడు నేరెళ్ల రాజు నివాసంలో సర్, పార్టీ సభ్యత్వ నమోదుపై బీఎల్ఏలు, కార్యకర్తలు, సోషల్ మీడియా ఇన్చార్జిలతో సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సర్ ప్రక్రియ సందర్భంగా ఓటర్లకు అందుబాటులో ఉంటూ ఎన్యుమరేషన్ ఫామ్స్ (ఈఎఫ్)పూర్తి చేయడంలో సహకరించాలని సూచించారు. క్షేత్రస్థాయిలో ఉంటూ ఓటర్ల సందేహాలను నివృత్తి చేస్తూ వారికి సహాయం అందించాలన్నారు. వీలైనంత త్వరగా ఈఎఫ్ల డిజిటలైజేషన్ పూర్తిచేసేందుకు కృషి చేయాలన్నారు. డివిజన్ పరిధిలో ఇప్పటి వరకు జరిగిన సర్ ప్రక్రియకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని బీఎల్ఏలను అడిగి తెలుసుకున్నారు. సమావేశంలో నియోజకవర్గ సర్, సభ్యత్వ ఇన్చార్జి మసూద్, రైతు బంధు సమితి జిల్లా మాజీ అధ్యక్షురాలు ఎల్లావుల లలితాయాదవ్, వరంగల్ పీఏసీఎస్ చైర్మన్ ఇట్యాల హరికృష్ణ, డివిజన్ నాయకులు పాల్గొన్నారు.