Fish Food Festival | రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహంతో గ్రామాల్లో మత్స్యసిరులు ఏటేటా పెరుగుతున్నాయి. చెరువులను బలోపేతం చేసి ఉచితంగా చేపపిల్లలను పోయడంతో ఊరూరా మీనరాశులు మత్స్యకారుల ఆర్థికాభివృద్ధికి దోహదపడుతున్నాయి. గతం కంటే అధిక ఉత్పత్తులు వస్తుండడంతో అమ్మగా మిగిలిన చేపలను ఇలా పలు గ్రామాల్లో ఎండ బెట్టి అమ్ముతూ ఉపాధి పొందుతున్నారు. ములుగు జిల్లా జాకారం గ్రామ శివారులో చేపలను తోరణాలుగా కట్టి ఎండబెట్టిన దృశ్యాన్ని ‘నమస్తే’ బంధించింది.
-ఫొటోగ్రాఫర్, ములుగు
చాపల పులుసు, రొయ్యల ఫ్రై, ఫిష్ బిర్యానీ, పీతల ఫ్రై, ఫిష్ప్రై, ఫిష్ రోల్, ఫిష్ సమోసా, ఫిష్ కట్లెట్, ఫిష్ అప్పడాలు.. ఇలా చెబుతుంటేనే నోరూరుతోంది కదూ..! మృగశిర కార్తె సందర్భంగా ఒకటి కాదు.. రెండు కాదు.. పది రకాల నోరూరించే వంటకాలతో జనగామలో ఫిష్ ఫుడ్ ఫెస్టివల్ రాబోతోంది. చేపలు తినడం వల్ల ప్రయోజనాలు, వంటకాలపై అవగాహన కల్పించేందుకు మత్స్యశాఖ ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వం వచ్చే నెల 7నుంచి రెండు రోజుల పాటు ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నది. మహిళా మత్స్యకార సొసైటీల సభ్యులే స్వయంగా వెరైటీలు తయారుచేయనుండగా ఎప్పుడెప్పుడా అని ప్రజలు ఎదురుచూస్తున్నారు.
ఒకటి కాదు, రెండు కాదు ఏకంగా 10రకాల చేపల వంటకాలకు జనగామ వేదిక కాబోతోంది. మృగశిర కార్తె సందర్భంగా వచ్చే నెల 7, 8, 9 తేదీల్లో ఈ ఫెస్టివల్ను నిర్వహించనున్నారు. మహిళా మత్స్యపారిశ్రామిక సహకార సంఘాల ఆధ్వర్యంలో ఫిష్ ఫుడ్ ఫెస్టివల్ను నిర్వహించనున్నారు. మొత్తం 10 స్టాల్స్ను ఏర్పాటు చేయనున్నారు. చేపలు తింటే కలిగే ప్రయోజనాలు, వం టకాలపై ప్రజలకు అవగాహన కల్పించే లక్ష్యంతో మత్స్యశాఖ ఫిష్ ఫెస్టివల్ను ఏర్పాటుచేస్తోంది. ఈ కార్యక్రమాన్ని ఎన్ఎంఆర్ గార్డెన్లో నిర్వహించాలని జిల్లా మత్స్యశాఖ నిర్ణయించింది.
చేపల ఉత్పత్తులపై అవగాహన
చేపలు మంచి ఆరోగ్యకరమైన ఆహారం. మంచి పోషకాహారం ఉన్న ఫుడ్. ఏ రూపంలో తీసుకున్నా ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. అయితే చాలామందికి చేపల గురించి అవగాహన ఉండదు. అబ్బో ముళ్లు ఉంటాయి, వాసన వస్తుందని సరిగ్గా తీసుకోరు. ఇతర దేశాలతో పోలిస్తే మన దగ్గర చేపల వినియోగం చాలా తక్కువ అని అధికారుల నివేదికలు చెబుతున్నాయి. ఈ క్రమంలో చేపలపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ప్రభుత్వం ప్రత్యేక కార్యక్రమాన్ని తీసుకువచ్చింది. చేపల వినియోగాన్ని భారీగా పెంచడం, చేపలతో వివిధ రకాల వంటకాలపై ఆవగాహన కల్పించడమే కార్యక్రమ ఉద్దేశమని అధికారులు చెబుతున్నారు.
మహిళా మత్స్యకార సొసైటీల ఆధ్వర్యంలో..
జిల్లావ్యాప్తంగా 167 సొసైటీలు ఉండగా అందులో 29 మహిళా సొసైటీలు ఉన్నాయి. వీటిలో మొత్తం 16,769మంది సభ్యులుగా ఉన్నారు. దీంతో ఫిష్ ఫుడ్ ఫెస్టివల్ నిర్వహణను మహిళా సొసైటీల సభ్యులే చూసుకోనున్నారు. వివిధ రకాల వంటకాలను వీరే స్వయంగా తయారు చేస్తారు. స్టాల్స్లో కూడా వీరే విక్రయాలు జరుపనున్నారు. ఫుడ్ ఫెస్టివల్ ప్రారంభమైనప్పటి నుంచి పూర్తయ్యే వరకు మహిళలే భాగస్వామ్యం అవుతారు.
పుడ్ ఫెస్టివల్ను విజయవంతం చేయాలి
చేపలపై అనేక మందికి అవగాహన లేకపోవడంతో ప్రభుత్వం ఫిష్ ఫెస్టివల్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నది. ప్రజలకు అవగాహన కల్పించడం, వివిధ రకాల వంటకాలను పరిచయం చేయడమే ఈ కార్యక్రమ ఉద్దేశం. 10 రకాల స్టాల్స్ను ఏర్పాటు చేస్తున్నాం. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి మహిళా మత్స్యకార సహకార సొసైటీలను భాగస్వామ్యం చేస్తున్నాం.
– బానోత్ నాగులు, జిల్లా మత్స్యశాఖ అధికారి, జనగామ.
మహిళా సొసైటీలను భాగస్వామ్యం చేస్తాం
చేపల వినియోగం కోసం రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న కృషి బాగుంది. ఇప్పటికే మత్స్యకారులకు ఉచితంగా చేపలు, రొయ్యలను పంపిణీ చేస్తూ ఆర్థికంగా అభివృద్ధి కావడానికి తోడ్పాటు అందిస్తున్నది. అలాగే త్వరలో నిర్వహించబోయే ఫిష్ ఫెస్టివల్ను మహిళా మత్స్యకార సొసైటీ సభ్యులు సద్వినియోగం చేసుకుంటాం. స్టాల్స్ ఏర్పాటుకు కృషి చేస్తాం. ప్రభుత్వం ఇలాంటి అవకాశం మాకు కల్పించడం సంతోషం.
– చినబోయిన రేఖ, ముదిరాజ్ మహాసభ జిల్లా మహిళా అధ్యక్షురాలు