హనుమకొండ, ఏప్రిల్ 7: ఉమ్మడి వరంగల్, ఖమ్మం, నల్లగొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గం ఎన్నికలకు ఆయా జిల్లాల అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు ఎమ్మెల్సీ ఎన్నికలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేయడంలో నిమగ్నమయ్యారు. ఏ క్షణంలో ఎన్నికల షెడ్యూల్ విడుదలైనా ఎన్నికలు నిర్వహించేందుకు సర్వం సిద్ధం చేశారు.
ఇందులో భాగంగా ఉమ్మడి వరంగల్, ఖమ్మం, నల్లగొండ పట్టభద్రుల నియోజకవర్గం తుది ఓటర్ల జాబితాను ఈ నెల 4న ఆయా జిల్లాల కలెక్టర్ల ఆధ్వర్యంలో విడుదల చేశారు. ఈ జాబితా ప్రకారం నియోజకవర్గం పరిధిలో మొత్తం 4,61,806 పట్టభద్ర ఓటర్లు ఉన్నారు. జనగామ ఎమ్మెల్యేగా పల్లా రాజేశ్వర్రెడ్డి గెలుపొంది ఎమ్మెల్సీగా రాజీనామా చేయడంతో మళ్లీ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు నిర్వహిస్తున్నారు. కాగా, 2021లో నిర్వహించిన గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా ఓటరు జాబితాలోని ఓటర్ల కంటే తాజాగా విడుదల చేసిన జాబితాలో ఓటర్లు తగ్గినట్లు సమాచారం.
ఉమ్మడి వరంగల్, ఖమ్మం, నల్లగొండ పట్టభద్రుల నియోజకవర్గంలో ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్స్ ఓటర్లు 4,61,806 మంది ఉన్నారు. గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన వారు అర్హులుగా నవంబర్ 1 2023 వరకు కొత్త ఓటరు నమోదు కార్యక్రమం ఆన్లైన్, ఆఫ్లైన్ ద్వారా స్వీకరించి జాబితా రూపొందించారు. ఈ జాబితాపై అభ్యంతరాల స్వీకరణ, పరిష్కారం అనంతరం తుది ఓటరు జాబితాను గత గురువారం విడుదల చేసి రాజకీయ పార్టీల నాయకులకు సీడీలను అందజేశారు. ఈ జాబితా ప్రకా రం నియోజకవర్గంలోని 600 పోలింగ్ స్టేషన్ల పరిధిలో మొత్తం 4,61,806 మంది ఓటర్లు ఉన్నారు. వీరిలో పురుషులు 2,87,007 కాగా, మహిళలు 1,74,794, ట్రాన్స్జెండర్స్(టీజీ) ఐదుగురు ఉన్నారు.