హనుమకొండ, డిసెంబర్ 15: ప్రజలకు ఆయురారోగ్యాలు, అష్ట ఐశ్వర్యాలు కలగాలని జగద్గురువు శ్రీశ్రీశ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీ సంకల్పంతో మాఘ శుద్ధ అష్టమి శుక్రవారం రోజున 10 వేల మంది దంపతులతో సామూహిక అనఘాష్టమి వ్రతాలు నిర్వహిస్తున్నారు. హనుమకొండలోని ఆర్ట్స్ కళాశాల మైదానంలో ఉదయం 9 గంటల నుంచి ఈ కార్యక్రమం జరుగనుంది. అనఘాష్టమి వ్రతాల నిర్వహణ ఏర్పాట్లను అవధూత దత్తపీఠం ఉత్తరాధికారి విజయానంద తీర్థ స్వామి గురువారం పర్యవేక్షించారు. ప్రపంచవ్యాప్తంగా శాంతి నెలకొనాలనే సంకల్పంతోనే అయుతా ప్రధాన శ్రీ అనఘాష్టమీ వ్రతాలను నిర్వహిస్తున్నట్లు చెప్పారు. సాయంత్రం దాదాపు 5 వేల మందితో సామూహిక సంపూర్ణ భగవద్గీత పారాయణం జరుగుతుందని, ఇందులో ప్రతి ఒకరూ పాల్గొనాలని కోరారు.
సంపూర్ణ ఆరోగ్యం కలగాలనే 17వ తేదీ ఉదయం 6 గంటలకు క్రియ యోగ తరగతులు జరుగుతాయని స్వామీజీ తెలిపారు. కృత యుగంలో దత్త స్వామి వీరార్జునుడితో ఈ వ్రతాన్ని చేయించారని, త్రేతాయుగంలో శ్రీరాముడు, ద్వాపర యుగంలో శ్రీకృష్ణుడు ధర్మరాజుతో ఆచరింప చేశాడని, కలియుగంలో జగద్గురు గణపతి సచ్చిదానంద స్వామీజీ బహుళ వ్యాప్తిలోకి తీసుకొచ్చారని తెలిపారు. ఈ వ్రతంలో కుల, మత భేదాలు లేవని ఎవరైనా (భర్త, భార్య చనిపోయినవారు కూడా) పాల్గొనవచ్చన్నారు. ఎంతో విశిష్టత ఉన్న వరంగల్ నగరంలో నిర్వహించే ఇలాంటి గొప్ప కార్యక్రమాల్లో ప్రజలు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొనాలన్నారు.
ఈ సందర్భంగా ముద్రించిన అనఘష్టమి దత్త వస్త్రాలను, అయుతా అనఘాష్టమి పూజ చార్ట్ను స్వామీజీ ఆవిషరించారు. కార్యక్రమంలో ట్రస్ట్ సభ్యులు స్థానిక కార్పొరేటర్లు, అధికారులు, భక్తులు తదితరులు పాల్గొన్నారు.