కాజీపేట, జూన్ 19 : కాజీపేటకు మంజూరైన రైల్వే వ్యాగన్ రిపేరింగ్ వర్క్ షాప్ (పీవోహెచ్) షెడ్ల నిర్మాణానికి రైల్వే శాఖ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో నిర్మాణ పనులు మొదలయ్యాయి. కేంద్రంలో యూపీఏ సర్కారు ఉన్న సమయంలో ఇక్కడ రైల్వే వ్యాగన్ మ్యాన్యుఫ్యాక్చరింగ్ యూనిట్ ఏర్పాటు కోసం 55 ఎకరాలు కావాలని రైల్వేశాఖ కోరింది. అప్పటి సీమాంధ్ర పాలకులు భూమిని అప్పగించడంలో జాప్యం చేశారు. కాగా, తెలంగాణ ఏర్పడిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వ అయోధ్యపురం గ్రామ శివారులో దేవాదాయ శాఖకు చెందిన భూమిని కొనుగోలు చేసి రైల్వేశాఖకు అప్పగించింది. అయినా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం పట్టించుకోలేదు. రాష్ట్ర ప్రభుత్వ ఒత్తిడితో కేంద్రం 2016-17 రైల్వే బడ్జెట్లో కాజీపేటలో వ్యాగన్ రిపేరింగ్ వర్క్షాప్(పీవోహెచ్), వ్యాగన్ మ్యాన్యుఫ్యాక్చరింగ్ యూనిట్ను నిర్మిస్తామని పేర్కొన్నది. అందుకు160 ఎకరాల భూమి అవసరమని, ఇప్పటికే దాదాపు 54 ఎకరాల 32 గుంటల భూమి ఉన్నదని, మరో 105 ఎకరాల భూమిని రాష్ట్ర ప్రభుత్వం కేటాయించాలని చెప్పిం ది.
ఈ క్రమంలో 150 ఎకరాల భూమిని 2022 సెప్టెంబర్ 23న రైల్వేశాఖకు తెలంగాణ సర్కారు అప్పగించింది. మిగతా 10 ఎకరాల భూమిని తర్వాత అప్పగిస్తామని చెప్పింది. రాష్ట్ర ప్రభుత్వ హామీతో రైల్వేశాఖ ఆర్వీఎన్ఎల్ సంస్థ ఆధ్వర్యంలో 2023 జనవరిలో వ్యాగన్ రిపేరింగ్ వర్క్ షాప్(పీవోహెచ్) ఏర్పాటుకు టెండర్ల ప్రక్రియ పూర్తి చేసింది. పవర్ మేక్ ప్రాజెక్టు కంపెనీ రూ.360 కోట్లతో కోట్ చేసి టెండర్ను దక్కించుకుంది. 2025 ఫిబ్రవరిలోపు పనులను పూర్తి చేయాలని టెండర్ షెడ్యూల్లో రైల్వే శాఖ పేర్కొన్నది. కాగా, కేంద్ర ప్రభుత్వ పట్టింపులేమితో పనుల్లో జాప్యం జరిగింది. దీంతో రాష్ట్ర ప్రభుత్వం రైల్వేశాఖపై ఒత్తిడి పెంచడంతో ఇటీవల పీవోహెచ్ షెడ్డు నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ప్రస్తుతం ఈ భూమిలో జంగిల్ కట్టింగ్, చదును, ప్రహరీ, తాత్కాలిక కార్యాలయాల షెడ్లను నిర్మిస్తున్నారు. శాశ్వత కార్యాలయ భవన నిర్మాణ పనుల్లో వేగం పెంచారు. వర్క్ షాప్లో పది రైల్వే ట్రాక్లను ఏర్పాటు చేసేందుకు అధికారులు సర్వే చేశారు. పీవోహెచ్ అందుబాటులోకి వస్తే దాదాపు 3 వేల మందికి ప్రత్యక్షంగా ఉద్యోగాలు లభించనున్నాయి. పరోక్షంగా మరో 4వేల మంది ఉపాధి పొందనున్నారు.
పనులను త్వరగా చేపట్టాలి..
కాజీపేట : కాజీపేట పీవోహెచ్ షెడ్డు నిర్మాణ పనులను వీలైనంత త్వరగా చేపట్టాలని తెలంగాణ రైల్వే ఎంప్లాయీస్ జాక్ కన్వీనర్ దేవులపల్లి రాఘవేందర్ అన్నారు. జంక్షన్ శివారులో జరుగుతున్న షెడ్డు పనులను ఆదివారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పీవోహెచ్ షెడ్డు పనులను చేపట్టిన పవర్ మెక్ సంస్థ అధికారులు వీలైనంత త్వరగా పూర్తి చేస్తామని హామీ ఇచ్చారని తెలిపారు. చైర్మన్ కొండ్ర నర్సింగరావు, కో కన్వీనర్లు శ్యాం, రమేశ్, సాయి రాజ్, ప్రేమ్కుమార్, వైస్ చైర్మన్లు ఎంకే మూర్తి, భాస్కర్, ప్రదీప్ లోండే ఉన్నారు.