గోవిందరావుపేట, డిసెంబర్ 3: సుదూర ప్రాంతాల నుంచి వచ్చే పర్యాటకులను మంత్రముగ్ధులను చేస్తున్న లక్నవరం సరస్సు వద్ద అటవీ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సైక్లింగ్, ట్రెక్కింగ్ను శనివారం సాయంత్రం ములుగు డీఎఫ్వో కిష్టగౌడ్ ప్రారంభించారు. ఈ సం ద ర్భంగా ఆయన మాట్లాడుతూ వివిధ రాష్ర్టాలు, జిల్లాల నుంచి వచ్చే పర్యాటకులకు మరింత ఆహ్లాదాన్ని కల్పించడంలో భాగంగా లక్నవరం వద్ద సైక్లింగ్, ట్రెక్కింగ్ ఏర్పాటు చేసినట్లు వివరించారు.
మొదటి ఐలాండ్లోని టిక్కెట్ కౌంటర్ నుంచి తూముల వరకు సైకిల్పై షికారు చేసేందుకు ఒక్కొక్కరికి రూ.100 చొప్పున రుసుము వసూలు చేయనున్నట్లు తెలిపారు. లక్నవరం వద్ద మూడు కిలో మీటర్లు ట్రెక్కింగ్ నిర్వహించేందుకు గాను పర్యాటకుల వద్ద రూ.100 తీసుకుంటామని ఆయన వివరించారు. పర్యాటకుల సౌకర్యార్థం లక్నవరం వద్ద మరిన్ని అడ్వెంచర్లు ప్రారంభిస్తామని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో ములుగు, ఏటూరునాగారం ఎఫ్డీవోలు జోగేందర్, ప్రశాంత్ పాటిల్, పస్రా రేంజ్ అధికారి మాధవిసీతల్, ఎఫ్ఎస్వో వేణుగోపాల్, బీట్ ఆఫీసర్ దీప్లాల్తో పాటు ములుగు డివిజన్ అటవీ శాఖ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.