పాలకుర్తి రూరల్, సెప్టెంబర్ 21: అయినోడే కాల యముడయ్యాడు.. మేన బావమరిదిని పాతకక్షలు, అనుమానంతో హత్య చేశాడు. ఆభం శుభం తెలియని బాలుడిని బావిలోకి తోసేసి ప్రాణాలు బలిగొన్నాడు. దీనికి సంబంధించిన వివరాలను వర్థన్నపేట ఏసీపీ సుందరగిరి శ్రీనివాస్రావు బుధవారం స్థానిక పోలీస్స్టేషన్లో విలేకరులకు వెల్లడించారు. ఏసీపీ తెలిపిన వివరాల ప్రకారం.. యాదాద్రి భువనగిరి జిల్లాలోని సం చార జాతులకు చెందిన కుటుంబాలు కొడకండ్ల మండల కేంద్రంలో రెండేళ్లుగా నివాసముంటున్నాయి. జమీల్-జరీనా, మహబూబా కుటుంబాలతో పాటు మరికొన్ని కుటుంబాలు గూడారాలు వేసుకుని ఉంటున్నాయి. వీరు అల్యూమినియం పాత్రలు చేస్తుంటారు. జమీల్ తన సోదరి కుమారుడైన మహబూబాతో కలిసి వరి కోతమిషన్లో పనిచేస్తుంటారు.
జమీల్-జరినా దంపతులకు ఇద్దరు కుమారులు, కుమార్తె ఉన్నారు. వీరి రెండో కుమారుడు సాబీర్(5). కొంతకాలంగా జరీనాతో మహబూబా సఖ్యతగా ఉండడం చూసిన సాబీర్ తన తండ్రి జమీల్కు చెప్పాడు. దీంతో జమీల్ ఆగ్రహంగా ఉన్నాడు. మరోవైపు ఇరువురి కుటుంబాల మధ్య కొంతకాలంగా పాతకక్షలున్నాయి. ఈ క్రమంలో సాబీర్ను చంపాలని మహబూబా నిర్ణయించుకున్నాడు. ఈ నెల 18వ తేదీ ఆదివారం ఉదయం 8.30 గంటల ప్రాంతంలో సాబీర్ను మహబూబా కిడ్నాప్ చేసి ఊరి చివరనగల వ్యవసాయ బావిలోకి తోసి హత్య చేసి ఎవరికీ అనుమానం కలుగకుండా తిరిగి వచ్చాడు. మధ్యాహ్నం వరకూ సాబీర్ కనిపించకపోవడంతో తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో పోలీసులు సీసీ కెమెరాల పుటేజీలను పరిశీలించగా సాబీర్ను మహబూబా తీసుకెళ్లినట్లు రికార్డు అయింది. తిరిగి ఒక్కడే వచ్చినట్లు గమనించారు. దీంతో పోలీసులు అతడిని విచారించగా బాధితుడి కటుంబ సభ్యులు, బంధువులు సైతం మహబూబాపై అనుమానం వ్యక్తం చే శారు. ఈ క్రమంలో మహబూబా 19వ తేదీన ఇంటి నుంచి పారిపోయాడు.
నిందితుడి కోసం పోలీసుల గాలింపు
పాలకుర్తి సీఐ వట్టే చేరాలు నేతృత్వంలో మూడు బృందాలుగా ఏర్పడి నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. సూర్యాపేట జిల్లా తిరుమలగిరిలోని హోటల్లో మహబూబా ఉన్నట్లు అక్కడి సీసీ కెమెరాలో రికార్డయింది. పోలీసులు దర్యాప్తు చేపట్టగా మహబూబా తిరుమలగిరి మండలం మామిడాల గ్రామంలోని వ్యవసాయ పంట పొలాల్లో మంగళవారం చిక్కాడు. దీంతో నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారించగా నేరాన్ని ఒప్పుకున్నాడని ఏసీపీ శ్రీనివాస్రావు తెలిపారు. సాబీర్ను బావిలోకి హత్య చేసినట్లు చెప్పాడని ఆయన వివరించారు. మహబూబాను అరెస్టు చేసి బుధవారం రిమాండ్కు తరలించినట్లు వెల్లడించారు. కేసును దర్యాప్తు చేసి నిందితుడిని అదుపులోకి తీసుకున్న సీఐ చేరాలు, ఎస్సైలు ఎన్ కొమురెల్లి, తాళ్ల శ్రీకాంత్, మూనవత్ రమేశ్ను ఏసీపీ అభినందించారు. విలేకరుల సమావేశంలో సీఐ వట్టే చేరాలు, ఎస్సైలు తాళ్ల శ్రీకాంత్, ఎన్ కొంరెల్లి, మూనవత్ రమేశ్, యాకూబ్ హూస్సేన్ పాల్గొన్నారు.