సుబేదారి, ఏప్రిల్ 30: పోలీసు కానిస్టేబుళ్ల నియమాక పరీక్ష ఆదివారం ప్రశాంతగా ముగిసింది. వరంగల్ , హనుమకొండ ప్రాంతాల్లో మొత్తం 16 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. ప్రతి సెంటర్ వద్ద పకడ్బందీగా పోలీసు బందోబస్త్ నిర్వహించారు. అభ్యర్థులను తనిఖీ చేసిన తర్వాతే పరీక్ష హాల్లోకి పంపించారు. ఎక్కడా ఇబ్బందులు తలెత్తకుండా వరంగల్ పోమిసు కమిషనరేట్ పోలీసులు కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నారు. పోలీసు కమిషనరేట్ పరిధిలో మొత్తం 12,029 మంది అభ్యర్థులకుగాను 11,910 మంది పరీక్షలకు హాజరయ్యారు.119 మంది అభ్యర్థులు పరీక్షకు గైర్హాజరైనట్లు పోలీసు కమిషనర్ ఏవీ రంగనాథ్ తెలిపారు. ఉదయం 10 గంటలనుంచి మద్యాహ్నం ఒంటి గంట వరకు పరీక్ష కొనసాగింది. ప్రతి పరీక్ష కేంద్రం వద్ద ఏసీపీ, ఇన్స్పెక్టర్ స్థాయి అధికారి బందోబస్తు నిర్వహించి పర్యవేక్షించారు. ప్రతి సెంటర్ వద్ద వైద్య సిబ్బందిని ఏర్పాటు చేయడంతో ఎలాంటి సమస్యలు లేకుండా పరీక్ష ప్రశాంతంగా జరిగింది.
పరీక్ష రాసిన హిజ్రాలు
పోలీసు కానిస్టేబుల్ ఉద్యోగ నియమాకాలకు ఆదివారం నిర్వహించిన పరీక్షకు హిజ్రాలు హాజరయ్యారు. పలు జిల్లాల నుంచి హాజరైన హిజ్రాలు నిర్ణీత సమయానికి పరీక్షా కేంద్రాలకు వచ్చారు. వరంగల్ ఎల్బీ కళాశాల కేంద్రంలో కరీంనగర్ జిల్లాకు చెందిన తనుశ్రీ, సావ్య, నల్లగొండ జిల్లాకు చెందిన నందిని, మంచిర్యాల జిల్లాకు చెం దిన లవ్లీ పరీక్ష రాశారు. ఈసందర్భంగా వారిని ‘నమస్తే తె లంగాణ’ కలువగా వారి మనోభావాలు వెల్లడించారు.
అవకాశాలు కల్పిస్తే నిరూపించుకుంటాం..
నేను ఎంకాం చదుకున్నా. ప్రభుత్వ ఉద్యోగం సాధించాలన్నదే నా లక్ష్యం. హిజ్రాలను బెగ్గింగ్ వృత్తి అనుకుంటారు. మాలో చాలా మంది ఉన్నత విద్యావంతులున్నారు. ప్రభుత్వ రంగంలో అవకాశాలు కల్పిస్తే ఉద్యోగం సాధిస్తాం. పోలీసు ఉద్యోగాల ప్రిలిమరీ పరీక్షకు నాతోపాటు ట్రాన్స్జెండర్స్ అర్హత సాధించారు. మేము మెన్ నుంచి ఉమెన్గా మారినం. మాకు పురుష అభ్యర్థుల మాదిరిగానే ఫిజికల్ ఈవెంట్స్ పెట్టారు. అర్హత సాధించలేకపోయాం, హైకోర్టుకు వెళ్లాం. పైనల్ పరీక్ష రాయడానికి హైకోర్టు మాకు తీర్పునిచ్చింది. కోర్టు ఆర్డర్స్తో తుదిరాత పరీక్ష రాశా. అవకాశాలు కల్పిస్తే నిరూపించుకుంటాం .
-తనుశ్రీ, కరీంనగర్
ఆత్మగౌరవంతో జీవించాలన్నదే మా లక్ష్యం..
ట్రాన్స్జెండర్లలో చాలా మందికి తెలివితేటలు ఉన్నయి. ప్రభుత్వ ఉద్యోగాలు సాధించి ఆత్మగౌరవంతో జీవించాలన్నది మా ఉద్దేశం. కానీ సమాజం మమ్ములను చిన్నచూపు చూస్తున్నది. మాలో డాక్టర్స్, లాయర్లు ఉన్నారు. చెన్నైలో ఒకామె ఎస్సై ఉద్యోగం చేస్తున్నది. ప్రభుత్వం రంగంలో మాకు కోటా కల్పించాలి. తెలంగాణ హైకోర్టు మాకు పోలీసు ఉద్యోగాల పరీక్ష రాయడానికి అనుమతి ఇచ్చింది. ఇది మాకు చాలా ధైర్యాన్నిచ్చింది. ఉన్నత ఉద్యోగాలు సాధించడానికి ప్రీపేర్ అవుతాం. సమాజం టాన్స్జెండర్లను సాధారణ మనుషులుగా చూడాలని కోరుకుంటున్నాం.
-నందిని, నల్లగొండ