వరంగల్, మే 26 : వరంగల్-ఖమ్మం-నల్లగొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఎన్నికల అధికారి, కలెక్టర్ సిక్తా పట్నాయక్ అన్నారు. ఆదివారం కాకతీయ డిగ్రీ కళాశాలలోని ఎన్నికల సామగ్రి డిస్ట్రిబ్యూషన్ కేంద్రాన్ని ఆమె పరిశీలించారు. బ్యాలెట్ బాక్స్లు, బ్యాలెట్ పేపర్లను పరిశీలించి అధికారులకు సూచనలు ఇచ్చారు. ఎన్నికల సిబ్బందికి పోలింగ్ సామగ్రిని పంపిణీ చేసి, ప్రత్యేక బస్సుల్లో పోలింగ్ కేంద్రాలకు తరలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పీవో, ఏపీవోలు ఎన్నికల సంఘం నిబంధనలు తప్పక పాటించాలన్నారు. ఎన్నికల సంఘం ఇచ్చిన వాయిలెట్ రంగు పెన్నులతోనే బ్యాలెట్ పేపర్పై మార్క్ చేయాలన్నారు. ఏఆర్వోలతో కలిసి బ్యాలెట్ బ్యాక్స్లు, ఇతర సామగ్రిని నల్లగొండలోని స్ట్రాంగ్ రూమ్కు పోలీసు భద్రతా సిబ్బంది మధ్య చేరవేస్తామని చెప్పారు. పోలింగ్లో పొరపాట్లు జరుగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
హనుమకొండ జిల్లాలో 67 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు సిక్తా పట్నాయక్ తెలిపారు. జిల్లాలో 43,729 మంది పట్టభద్రుల ఓటర్లు ఉన్నారని, వీరిలో 25,739 మంది పురుషులు, 17,990 మంది మహిళా ఓటర్లని తెలిపారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ వెంకట్రెడ్డి, ఆర్డీవోలు నారాయణ, వెంకటేశ్, డీఈవో అబ్దుల్ హై పాల్గొన్నారు.
వరంగల్(నమస్తేతెలంగాణ): ఎమ్మెల్సీ ఉప ఎన్నికల పోలింగ్ నిర్వహణకు అధికారులు వరంగల్ జిల్లాలో సకల ఏర్పాట్లు చేశారు. పోలింగ్ అధికారులు, సిబ్బంది బ్యాలెట్ బాక్సులు, సామగ్రితో పో లింగ్ కేంద్రాలకు చేరుకున్నారు. జిల్లాలో 59 పోలిం గ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. 23 లొకేషన్లలో ఉన్న ఈ పోలింగ్ కేంద్రాలను 11 రూట్లుగా విభజించారు. ఈ ఎన్నిక కోసం పీవోలు 71, ఏపీవోలు 71, ఓపీవోలు 142, మైక్రో అబ్జర్వర్లు 71, సెక్టోరల్ అధికారులు 11 మందిని నియమించారు. బ్యాలెట్ పద్ధతిన పోలింగ్ జరుగనుంది. ఉదయం 8 నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ కొనసాగనుంది. కలెక్టరేట్లో 8 డిస్ట్రిబ్యూషన్, రిసెప్షన్ కౌంటర్లను ఏర్పాటు చేశారు. ఆదివారం పోలింగ్ అధికారులు, సిబ్బందికి ఎన్నికల సామగ్రిని పంపిణీ చేయ గా వారు జిల్లాలోని 59 పోలింగ్ కేంద్రాలకు చేరుకున్నారు. కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన డిస్ట్రిబ్యూషన్, రిసెప్షన్ సెంటర్లను జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ప్రావీణ్య, అదనపు కలెక్టర్ సంధ్యారాణి, డీఆర్వో శ్రీనివాస్తో కలిసి పరిశీలించారు. 52 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారని, పేపర్ బ్యాలెట్ ఓటింగ్ విధానం అర్థమయ్యే రీతిలో ఓటర్లకు వివ రించాలని ఆమె పోలింగ్ సిబ్బందికి చెప్పారు. ప్రతి పోలింగ్ కేంద్రంలో వెబ్కాస్టింగ్, సీసీ కెమెరాలు ఏర్పాటు చేశామని, వీల్చైర్లను అందుబాటులో ఉంచామని కలెక్టర్ తెలిపారు. పోలింగ్ ముగిసిన తర్వాత మెటీరియల్ కలెక్టర్ కార్యాలయంలో చెక్లిస్ట్ ప్రకారం అందజేయాలని సూచించారు. పశుసంవర్ధక శాఖ అధికారి బాలకృష్ణ, జడ్పీ సీఈవో రామిరెడ్డి, కలెక్టరేట్ ఏవో శ్రీకాంత్, తహసీల్దార్లు విశ్వనారాయణ, రమేశ్, మంజుల, ఇక్బాల్, విజయసాగర్, రియజొద్దీన్ పాల్గొన్నారు.
నమస్తే తెలంగాణ నెట్వర్క్ : పర్వతగిరిలోని ప్రభుత్వ పాఠశాలలో ఏర్పాటు చేసిన పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ కేంద్రాన్ని ఆదివారం ఈస్ట్జోన్ డీసీపీ రవీందర్ సందర్శించారు. పోలింగ్ కేంద్రాల వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. చెన్నారావుపేటలోని ప్రభుత్వ పాఠశాలలో రెండు పోలింగ్ బూత్లు ఏర్పాటు చేశారు. మండలవ్యాప్తంగా 1697 మంది ఓటర్లు తమ ఓటుహక్కు వినియోగించుకోనున్నట్లు అధికారులు తెలిపారు. నెక్కొండలో 2146 మంది ఓటుహక్కు వినియోగించుకోనున్నారని తహసీల్దార్ రాజ్కుమార్, సెక్టార్ అధికారి ఎంపీడీవో ప్రవీణ్కుమార్ తెలిపారు. సంగెం మండలంలో 2,576 మంది ఓటు హక్కును వినియోగించుకోనుండగా ఏర్పాట్లను తహసీల్దార్ రాజ్కుమార్, ఎంపీడీవో రవీందర్, ఎస్సై నరేశ్ పర్యవేక్షించారు. అలాగే, గీసుగొండ మండలంలో 865 మంది ఓటు హక్కు వినియోగించుకోనున్నట్లు తహసీల్దార్ రియాజుద్దీన్ తెలిపారు. దామెర ప్రభుత్వ పాఠశాలలో 1,331 మంది పట్టభద్రులు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నట్లు తహసీల్దార్ జ్యోతి వరలక్ష్మీదేవి తెలిపారు.
హనుమకొండ చౌరస్తా, మే 26 : జూన్ 4న పార్లమెంట్ ఎన్నికల ఓట్ల లెకింపు నేపథ్యంలో కౌంటింగ్ కేంద్రాల వద్ద అన్ని ఏర్పాట్లు చేయాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ సిక్తా పట్నాయక్ అన్నారు. ఆదివారం సాయంత్రం వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మారెట్ యార్డులోని పరకాల, వరంగల్ పశ్చిమ నియోజకవర్గాలకు సంబంధించిన కౌంటింగ్ కేంద్రాల వద్ద ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. కౌంటింగ్ హాల్, టేబుళ్లు తదితర కౌంటింగ్ ప్రక్రియకు సంబంధించిన ఏర్పాట్లు చేయాలన్నారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు రాధికాగుప్తా, వెంకట్రెడ్డి, పరకాల, వరంగల్ పశ్చిమ నియోజకవర్గాల ఏఆర్వోలు నారాయణ, వెంకటేశ్ పాల్గొన్నారు.