హనుమకొండ చౌరస్తా : పోలీస్ శాఖలో 20 వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ హనుమకొండలో ఏబీఎస్ఎఫ్ ( ABSF) ఆధ్వర్యంలో నిరుద్యోగులు ( Unemployees) ర్యాలీ నిర్వహించి, రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి, సీఎం రేవంత్రెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
ఈ సందర్భంగా ఏబీఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షులు మంద నరేష్ మాట్లాడుతూ నిరుద్యోగుల ద్రోహి సీఎం రేవంత్రెడ్డి ( CM Revanth Reddy ) అని మండిపడ్డారు. కానిస్టేబుల్ అభ్యర్థులకు 36 సంవత్సరాలు, ఎస్సైకి వయోపరిమితి 38 సంవత్సరాలు ఇవ్వాలని కోరారు. యువతకు ఉద్యోగాలు కల్పిస్తామని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చాక ఉద్యోగాలు ఇవ్వకుండా సీఎం మోసం చేస్తున్నారని విమర్శించారు .
హైదరాబాద్లో శాంతియుతంగా ధర్నా చేస్తున్న నిరుద్యోగులపై ప్రభుత్వం కేసులు పెట్టడం సిగ్గు చేటన్నారు. పోలీస్ శాఖలో 5 వేల ఉద్యోగాలకు కాకుండా 20 వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్ను విడుదల చేయకపోతే జిల్లాలో ఉన్న కాంగ్రెస్ మంత్రుల ఇళ్లను ముట్టడిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఏబీఎస్ఎఫ్ నాయకులు భరత్, రణధీర్, వేణు, సూర్య, పవన్, శ్రీనువాస్, ప్రణయ్, పవన్, కార్తీక్, వేణు, సాయికిరణ్, వెంకటేష్, సూర్య, భిక్షపతి, నవ్య, ప్రసన్న, కళ్యాణి, భాగ్య, హిమబిందు, పోలీస్ అభ్యర్థులు పాల్గొన్నారు.