అన్నదాతను అదునుకు ఆదుకొనే ‘రైతుబంధు’వు వచ్చేసింది. వానకాలం సీజన్కు గాను పెట్టుబడి సాయం అందించే ప్రక్రియ సోమవారం ప్రారంభం కాగా తొలిరోజు ఉమ్మడి వరంగల్లో ఎకరం విస్తీర్ణం ఉన్న రూ.2.74లక్షల మంది బ్యాంకు ఖాతాల్లో రూ.99.72కోట్ల నగదు జమైంది. వ్యవసాయానికి ఇబ్బంది లేకుండా ముఖ్యమంత్రి కేసీఆర్ ఏటా రెండు సార్లు సీజన్కు ముందే రూ.5వేల చొప్పున అందిస్తుండగా ప్రస్తుతం 11వ విడుత మొదలైంది. ‘రైతుబంధు’ పడినట్లు మెసేజ్లు వచ్చిన రైతులు వాటిని చూసి మురిసిపోయి బ్యాంకులకు వెళ్లి నగదు చేతికందుకొని సంబురపడ్డారు. ఇవి విత్తనాలు, ఎరువులు, కూలీల ఖర్చులు, ఇతర పనులకు అవసరమవుతాయని సంతో షం వ్యక్తంచేస్తూ ఉత్సాహంగా సాగుపనులకు వెళ్లారు. వాన చినుకులు మొదలైన వెంటనే రైతుబాంధవుడు పెట్టుబడి వేశారని ముఖ్యమంత్రి కేసీఆర్ వల్లే వ్యవసాయం పండుగైందని హర్షం వ్యక్తంచేస్తూ పాలాభిషేకాలు చేశారు.
– నమస్తే తెలంగాణ నెట్వర్క్, జూన్ 26
రైతు కష్టం తెలిసిన నాయకుడు
డోర్నకల్, జూన్ 26 : నాకు మా నాన్న మాన్సింగ్ నుంచి వారస్వతంగా 30గంటల భూమి వచ్చింది. 2018లో సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన ధరణి వల్ల పట్టాదారు పాసు పుస్తకం తీసుకున్నా. అప్పుడు రైతుబంధు కోసం దరఖాస్తు చేసుకున్నా. 2018 నుంచి రెండు విడుతలకు రైతుబంధు సాయం వస్తున్నది. 30 గుంటల భూమికి రూ.3,750 బ్యాంకు ఖాతాల పడుతున్నయ్. ఇవి పెట్టుబడికి అక్కెరకు వస్తయ్. విత్తనాలు కొనుగోలు చేస్తా. ఎన్నో ఏళ్లు పాలించిన కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు చేసిన మేలు ఏమీ లేదు. రైతు కష్టం తెలిసిన నాయకుడు సీఎం కేసీఆర్ వల్లే ఇయ్యాల వ్యవసాయం పండుగల లెక్క అయింది. కేసీఆర్ సార్కు రైతన్నలు రుణపడి ఉంటరు.
– గుగులోత్ కోటేశ్వరావు, చీమ్నాతండా
మెసెజ్ రాంగనే.. పోయి తెచ్చుకున్న
మరిపెడ, జూన్ 26 : వాన చినుకులు పడి పంటల సాగు సమయానికి రైతుబంధు ద్వారా పంట పెట్టుబడులు ఖాతాలో జమైనయ్. అదునుకు చేతికి పైసలు అందడం చాలా సంతోషంగా ఉంది. నాకు ఉన్న ఎకరా పొలానికి రెండు పంటలకు రూ.5వేల చొప్పున ఏడాదికి రూ.10వేలు వస్తున్నయ్. ఇప్పటికే పది సార్లు రైతుబంధు తీసుకున్నా. బ్యాంకులో డబ్బులు పడగానే మెసేజ్ వచ్చింది. పోయి తీసుకున్నా. ఉమ్మడి రాష్ట్రంలో కనీసం సాగునీరు, కరెంట్ కష్టాలు తీర్చినవారు లేరు. సీఎం కేసీఆర్ పాలనలో పుష్కలంగా సాగునీళ్లు, 24 గంటల ఉచిత విద్యుత్ ఇస్తున్నరు. యేటా పంట పెట్టుబడి ఇస్తున్న కేసీఆర్ ప్రభుత్వానికి అన్నదాతలు రుణపడి ఉంటరు.
– ఉప్పల సతీశ్, మరిపెడ
చాలా సంతోషంగా ఉంది
నర్సింహులపేట, జూన్ 26 : సీఎం కేసీఆర్ చెప్పినట్టే వానకాలం పంట పెట్టుబడి ఎకరానికి రూ.5వేలు బ్యాంకు ఖాతాలో జమ చేసిండు. రైతుల కోసం మంచి మంచి పథకాలు పెట్టిన సర్కార్ను ఇంతవరకు చూడలేదు. కానీ తెలంగాణ వచ్చినంక రైతుల బాధలన్నీ తీర్చింది బీఆర్ఎస్ ప్రభుత్వమే. కేసీఆర్ మా రైతుల గురించి ఆలోచించి ఎన్నో పథకాలు అమలుచేస్తాండు. వ్యవసాయం చేసేందుకు అన్ని సౌలత్లు చేయడం వల్లనే రైతుల కష్టాలు తగ్గినయ్. బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తరువాతే చాలా మార్పు వచ్చింది.
– గుగులోత్ వినోద, రూప్లాతండా
పెట్టుబడి తిప్పలు తప్పినయ్..
రఘునాథపల్లి, జూన్ 26 : సీఎం కేసీఆర్ సార్ రైతుబంధు పథకం పెట్టినప్పటి నుంచి పంట పెట్టుబడికి తిప్పలు తిప్పనయ్. ఏడాదికి రెండు సార్లు బ్యాంకుల నగదు వేసి ఆసరా అవుతున్నారు. ఆంధ్ర రాష్ట్రంలో సన్న, చిన్నకారు రైతులు పంటలు పండించాలంటే సావుకారుల దగ్గరికి పోయి పెట్టుబడి తెచ్చేది. పంటలు పండించి పెట్టుబడి లెక్కలు చూస్తే అప్పులే మిగిలేటియి. దీనికి తోడు వ్యవసాయానికి కరంటు లేక, మోటర్లు కాలిపోయి, ఖర్చులు ఇంకింత పెరిగి రైతులు ఆగమై ఆత్మహత్యలు చేసుకునేది. పోరాడి సాధించుకున్న తెలంగాణల సీఎం కేసీఆర్ రైతుబంధుతో పాటు ఉచిత విద్యుత్, పంటలకు గిట్టుబాటు ధర, అందుబాటులో ఎరువులు తీసుకురావడం వల్ల రైతులకు కొండంత భరోసా వచ్చింది. అందరూ సంబురంగా పనులు చేసుకుంటున్నరు. సీఎంగా మళ్లీ కేసీఆర్ సార్ అధికారంల ఉండాలె.
– మేకల అజయ్ , రఘునాథపల్లి
కేసీఆర్ సారు వచ్చినంకనే రైతులకు మేలు
జయశంకర్ భూపాలపల్లి, జూన్ 26 (నమస్తే తెలంగాణ) : తెలంగాణ వచ్చి కేసీఆర్ సారు ముఖ్యమంత్రి అయినంకనే మా రైతులకు ఎంతో మేలు జరుగుతాంది. నాకు 35 గుంటల భూమి ఉంది. నా ఖాతాలో సోమవారం రూ.4,360 పడ్డయ్. పోయి ఇడిపించుకున్న. చాలా సంతోషంగా ఉంది. ఇంతకుముందు రైతులను ఏ సర్కారు కూడా పట్టించుకోలేదు. అప్పుడు చినుకులు పడ్డయంటే పత్తి విత్తనాలు కొనడానికి, కూలోళ్లకు పైసలు ఇయ్యడానికి వడ్డీకి ఇచ్చే ఆసాముల దగ్గరికి పోయి 3 చొప్పున అప్పు తెచ్చేది. ఇప్పుడు కేసీఆర్ సారు పుణ్యమా అని ఆ బాధ తప్పింది. ఇప్పుడు అదునుకు రైతుబంధు పైసలు పడ్డయ్. మందు బస్తాలు కూడా ఎన్నంటే అన్ని దొరుకుతున్నయ్. ఇంతకుముందు లైను కట్టేది. స్టాకు లేదని రోజూ తిప్పేటోళ్లు. ఒకవేళ బస్తాలు వత్తే కొన్నే వచ్చేటియి. అప్పుడు మస్తు గోసపడ్డం. తెలంగాణ అచ్చినంక రైతులు కష్టాలన్నీ తీరినయ్.
– అమరగొండ భిక్షపతి, రైతు, కాశీంపల్లి, భూపాలపల్లి మండలం
సమయానికి పడ్డయ్..
దంతాలపల్లి, జూన్ 26 : వానకాలం వ్యవసాయ పనులు మొదలైన సమయా నికి రైతుబంధు డబ్బులు పడ్డయ్. ఇవి విత్తనాలు కొనేందుకు అయితయ్. రైతులు వ్యవసాయానికి పెట్టుబడి కోసం ఇబ్బందులు పడొద్దనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి కేసీఆర్ సార్ తెచ్చిన రైతుబంధు పథకం కొండంత భరోసా ఇస్తోంది. ప్రతి సంవత్సరం ఎకరాకు రూ.10వేలు ఇయ్యడం వల్ల బయట అప్పులు తెచ్చే బాధ తప్పింది. వానకాలం, యాసంగి కాలం మొదలు కాంగనే రైతుల బ్యాంకు ఖాతాలో డబ్బులు వేస్తున్నారు. రైతుల బాధలు తెలిసిన సీఎం కేసీఆర్ వల్లే వ్యవసాయం పండుగ అయింది.
– గందసిరి లక్ష్మయ్య, కుమ్మరికుంట్ల
అదునుకు ఆసరా అయితానయ్..
టేకుమట్ల, జూన్ 26 : తెలంగాణ అచ్చినంక కేసీఆర్ సార్ వేసే రైతుబంధు పైసలు అదునుకు ఆసరా అయితానయ్. నాడు ఎవుసం చేయాల్నంటే ఎన్ని కష్టాలు పడ్డమో ఆ గోస అంతాఇంత కాదు. కరెంట్ ఉండది, నీళ్లు సక్కగ రావు, పెట్టుబడికి పైసలుండక అప్పులు చేసి పంట వేసేందుకు అరిగోస పడేది. తెలంగాణ వచ్చినంక కేసీఆర్ సార్ అన్ని సౌలతులు మంచిగ చేసిండు. ఇప్పుడు వ్యవసాయం చేయడం జర అలుకగా అయింది. సరిగ్గా పెట్టుబడి సమయానికి సాలుకు రెండు సార్ల పైసలు బ్యాంకుల వేసి ఆదుకుంటున్న బీఆర్ఎర్ సర్కారుకు రుణపడి ఉంటం.
– నేరెళ్ల రాజయ్య, వెంకట్రావ్పల్లి
రైతుబాంధవుడు సీఎం కేసీఆర్
కురవి, జూన్ 26 : రైతాంగాన్ని కంటికిరెప్పలా కాపాడుకుంటున్న సీఎం కేసీఆర్ రైతుబాంధవు డు. అందుకే రైతులందరు సీఎం కేసీఆర్ ఇచ్చిన భరోసాతో వ్యవసాయం చేస్తున్నారు. ఏటా రెండు సార్లు పెట్టుబడి పైకం ఇయ్యడం వల్ల రైతుల కష్టాలు తీరుతున్నయ్. పంటలు పండించా లంటే భయపడే రోజులు పోయినయ్. కరోనా వంటి కష్టసమయంలో కూడా రైతులకు కష్టం రాకుండా చూసుకొని కొండంత ధైర్యం ఇచ్చిండు. ఇదివరకు కాలం వచ్చిందంటే అప్పుల కోసం రైతు వడ్డీలు నడిపేటోళ్ల దగ్గరికి పోయి నిలవడేది. ఇయ్యాల పెట్టుబడి కోసం ఎవరి ఇంటికి పోయే అవసరం లేకుంట చేశిండు. పథకాలను తీసేయాలని ప్రతిపక్షాలు ఎన్ని కుట్రలు చేసినా తాను బతికినన్ని రోజులు రైతులకు రైతుబంధు వస్తదని చెప్పిన దమ్మున్న నాయకుడు కేసీఆర్. అందుకే దేశం యావత్తు ఆయన నాయకత్వం కావాలని కోరుకుంటున్నది.
– బాదె నాగయ్య, కురవి
కేసీఆర్ ఇచ్చిన ధైర్యంతోనూ ఎవుసం
నర్సింహులపేట, జూన్ 26 : నిజంగా చెప్పాలంటే రైతులకు ఏ బాధ లేకుండా అన్ని సౌలతులు చేస్తున్నడు సీఎం కేసీఆర్. ఆ సారు ఇచ్చి న ధైర్యంతోనే మేం సంబురంగా ఎవుసం చేస్తున్నం. పెట్టుబడి కోసం వానకాలం ఎకరానికి రూ.5వేలు ఇస్తున్నడు. మాకు 37గుంటల భూమికి రూ.4625 బ్యాంకు ఖాతాలో వేసిండ్రు. రైతులు కాలం చేస్తే రైతుబీమా కింద రూ.5 లక్షలు ఇచ్చి ఆదుకుంటున్నరు. ఇంకా 24గంటల కరెంటు.. ఇట్ల అన్నితీర్ల రైతులకు సర్కార్ ఆదుకుంటున్నది.
– ధర్మారపు వీరమ్మ, నర్సింహులపేట