వరంగల్ జిల్లాకు మిర్చి పరిశోధనా కేంద్రం మంజూరైంది. నల్లబెల్లి మండలంలోని కన్నారావుపేటలో నెలకొల్పేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. సర్కారు ఆదేశాలతో అధికార యంత్రాంగం ఇక్కడ 30 ఎకరాల స్థలాన్ని గుర్తించింది. హైదరాబాద్లోని ఉద్యాన విశ్వ విద్యాలయం పరిధిలో ఈ కేంద్రం పని చేయనున్నది. రాష్ట్రంలోనే తొలి మిర్చి పరిశోధనా కేంద్రం నర్సంపేట నియోజకవర్గంలో ఏర్పాటు కానుండగా, ఈ ప్రాంత మిర్చి రైతులు అనేక ప్రయోజనాలు పొందనున్నారు.
వరంగల్, జూన్ 25(నమస్తేతెలంగాణ) : మిర్చి రైతుల చిరకాల కోరిక తీరబోతున్నది. జిల్లాలో మిర్చి పరిశోధనా కేంద్రం ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అవసరమైన స్థలాన్ని గుర్తించాలని అధికార యంత్రాంగాన్ని ఆదేశించింది. అధికారులు నల్లబెల్లి మండలంలోని కన్నారావుపేట గ్రామం వద్ద స్థలాన్ని పరిశీలిస్తున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గుంటూరు జిల్లాలో మాత్రమే మిర్చి పరిశోధనా కేంద్రం ఉండేది. తెలంగాణ ఏర్పాటు తర్వాత రాష్ట్రంలో కూడా మిర్చి పరిశోధనా కేంద్రం ఏర్పాటు చేయాలనే ప్రతిపాదన తెరపైకి వచ్చింది. కాగా, మిర్చి ఎక్కువగా సాగు చేసే ఉమ్మడి వరంగల్ జిల్లాలో దీన్ని నెలకొల్పాలని రైతులు కొన్నేళ్ల క్రితం ప్రభుత్వాన్ని కోరారు. వరంగల్తో పాటు మహబూబాబాద్, ములుగు, భూపాలపల్లి, హనుమకొండ, జనగామ, ఖమ్మం తదితర జిల్లాల్లో ఎక్కువగా మిర్చి సాగు చేస్తున్నారు.
వరంగల్ జిల్లాలో విదేశాలకు ఎగుమతి అవుతున్న చపాటా రకం మిర్చిని పండిస్తున్నారు. బాడిగ, ఎల్సీఏ, తేజ, సింగిల్పట్టి తదితర రకాలూ సాగవుతున్నాయి. మిర్చి అమ్మకాల్లో వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్ది రాష్ట్రంలో నంబర్వన్ స్థానం. ఈ విషయాన్ని నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి పలుమార్లు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. చపాటా మిర్చి అధికంగా సాగవుతున్న ప్రాంతాల్లో నర్సంపేట మొదటిదని, ఇక్కడే మిర్చి పరిశోధనా కేంద్రం నెలకొల్పాలని ప్రతిపాదించారు. పలు సందర్భాల్లో ఈ ప్రతిపాదనపై చర్చ జరిగింది. జిల్లాలో మిర్చి పంటకు చీడ పీడలు ఆశించి రైతులకు తీవ్ర నష్టాలు వాటిల్లిన సమయంలో ఇక్కడ కేంద్రం ఏర్పాటు చేయాల్సిన ఆవశ్యకతను రైతులు ప్రభుత్వం దృష్టికి తెచ్చారు. మిర్చి పంట సాగులో మెలకువలను తెలియజేసేందుకు, కొత్త వంగడాలను కనుగొనేందుకు, శాస్త్రవేత్తలు అందుబాటులో ఉండేందుకు దోహద పడగలదని పేర్కొన్నారు. ఈ తరుణంలో హైదరాబాద్లోని ఉద్యాన విశ్వ విద్యాలయం నుంచి మిర్చి పరిశోధనా కేంద్రం ఏర్పాటుపై ప్రభుత్వానికి ప్రతిపాదన అందింది.
ఎమ్మెల్యే పెద్ది పట్టుదల కూడా తోడు కావడంతో రాష్ట్ర ప్రభుత్వం తాజాగా వరంగల్ జిల్లాలో మిర్చి పరిశోధనా కేంద్రం ఏర్పాటు ప్రతిపాదనకు ఆమోదముద్ర వేసింది. ఈ నెల 17న జిల్లాలో పర్యటించిన మంత్రి కేటీ రామారావు కేంద్రం ఏర్పాటుకు అవసరమైన స్థలాన్ని గుర్తించాలని అధికారులను ఆదేశించారు. దీంతో నల్లబెల్లి మండలంలోని కన్నారావుపేట గ్రామం వద్ద 30 ఎకరాల స్థలాన్ని అధికారులు గుర్తించి ప్రభుత్వానికి సమాచారం ఇచ్చినట్లు తెలిసింది. కేంద్రం ఏర్పాటుపై నేడో రేపో ప్రభుత్వ ఉత్తర్వులు వెలువడనున్నట్లు సమాచారం.
రాష్ట్రంలో మిర్చి పరిశోధనా కేంద్రం ఇదే మొదటిది కానుండడం విశేషం. హైదరాబాద్లోని ఉద్యాన విశ్వ విద్యాలయం పరిధిలో ఇది పనిచేయనుంది. జిల్లాలో మిర్చి పరిశోధనా కేంద్రం ఏర్పాటుతో రైతులు అనేక ప్రయోజనాలు పొందే అవకాశం ఉంది. మిర్చి పంట సాగులో కొత్త రకాలను కనుగొనటం, పండించే విధానాలపై రైతులకు అవగాహన కల్పించడం, శిక్షణ ఇవ్వడంతో పాటు ఏ రకం మిర్చిని పండించడానికి స్థానిక నేలలు అనుకూలం అనే సమాచారం అందనుంది. ప్రధానంగా మిర్చి రైతులకు శాస్త్రవేత్తలు అందుబాటులో ఉంటారు. మిర్చి పంటకు చీడ పీడలు ఆశించిన సమయంలో వెంటనే రైతులు శాస్త్రవేత్తలను సంప్రదించే అవకాశం కలుగనుంది. మిర్చి సాగులో ఎదురయ్యే సమస్యలను పరిష్కరించుకోవచ్చు. కన్నారావుపేట వద్ద కేంద్రం నెలకొల్పడంపై ఎమ్మెల్యే పెద్ది ఉన్నత స్థాయి అధికారులతో చర్చించి సూచనలు చేసినట్లు తెలిసింది.