వర్ధన్నపేట, జనవరి 22: దేశానికి అన్నం పెట్టే రైతన్నలకు అన్ని రకాల సౌకర్యాలు కల్పించి, రైతు రాజ్యాన్ని తీసుకురావడమే భారత రాష్ట్ర సమితి(బీఆర్ఎస్) ప్రధాన లక్ష్యమని పార్టీ జిల్లా అధ్యక్షుడు, వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేశ్ అన్నారు. మండలంలోని దమ్మన్నపేట గ్రామానికి చెందిన 50 మంది వివిధ పార్టీల కార్యకర్తలు ఆదివారం బీఆర్ఎస్లో చేరారు. ఈ సందర్భంగా క్యాంపు కార్యాలయంలో అరూరి వారికి గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
అనంతరం జరిగిన సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ పోరాటాల ద్వారా సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో కేవలం ఎనిమిదేళ్లలోనే ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనా దక్షతతో రైతులకు సాగునీరు, 24 గంటల విద్యుత్ను అందిస్తున్నట్లు వెల్లడించారు. పదేళ్ల క్రితం వరకు ఎడారిగా ఉండే భూములకు సాగునీరు అందించి సేద్యానికి అనుకూలంగా మార్చిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్కే దక్కిందన్నారు. మిషన్ భగీరథ పథకం ద్వారా దేశంలో ఏ రాష్ట్రంలో లేనివిధంగా ప్రతి ఇంటికీ శుద్ధి చేసిన తాగునీరు అందిస్తున్నట్లు వెల్లడించారు.
రైతులు ఆర్థికంగా ప్రగతి సాధించేలా పరిపాలన ఉన్నట్లయితే దేశం అన్ని రంగాల్లో ప్రగతి సాధిస్తుందని సీఎం భావిస్తున్నారని వివరించారు. అందుకోసమే ముఖ్యమంత్రి కేసీఆర్ టీఆర్ఎస్ను బీఆర్ఎస్గా మార్చి దేశ రాజకీయాల్లో ప్రధానపాత్ర పోషించేందుకు ముందుకొచ్చారని గుర్తుచేశారు. దేశంలోని అన్ని వర్గాల ప్రజలు, మేధావులు, రైతు సంఘాల నేతలు కేసీఆర్కు మద్దతుగా నిలుస్తున్నారన్నారు. అలాగే, తెలంగాణలో చేపట్టిన అభివృద్ధి, అమలు చేస్తున్న సంక్షేమ పథకాలకు ఆకర్షితులై ఇతర పార్టీల్లో ఉన్న కార్యకర్తలు, నాయకులు బీఆర్ఎస్లో చేరేందుకు ఉత్సాహం చూపిస్తున్నారని చెప్పారు.
రాష్ట్రంలో ఎలాంటి ఎన్నికలు వచ్చినా ప్రజలంతా సీఎం కేసీఆర్ వెంటే ఉన్నారని ఎమ్మెల్యే అరూరి గుర్తుచేశారు. రానున్న రోజుల్లో కూడా ప్రజలంతా బీఆర్ఎస్కు అండగా ఉండేలా అర్హులకు సంక్షేమ పథకాలు అందేలా చూడాల్సిన బాధ్యత పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజాప్రతినిధులపై ఉందన్నారు. అలాగే, పార్టీలో చేరిన వారికి సముచిత స్థానం కల్పిస్తామన్నారు. పార్టీ ఆవిర్భావం నుంచి పనిచేస్తున్న నాయకులు, కార్యకర్తలు కొత్త వారిని కలుపుకొని పార్టీ ప్రగతి కోసం పని చేయాలని ఎమ్మెల్యే రమేశ్ కోరారు. కార్యక్రమంలో ఎంపీపీ అన్నమనేని అప్పారావు, జడ్పీటీసీ మార్గం భిక్షపతి, వైస్ ఎంపీపీ చొప్పరి సోమలక్ష్మి, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు తూళ్ల కుమారస్వామి, మాజీ ఎంపీపీ నూనె భిక్షపతి, పార్టీ నాయకులు చొప్పరి సోమయ్య, తిరుపతిరెడ్డి, నర్సయ్య, అశోక్, సమ్మయ్య, సోములు, రాజ్కుమార్, చందు, కుమార్, కొమురయ్య పాల్గొన్నారు.
పర్వతగిరి: అన్నారం షరీఫ్ గ్రామంలోని శ్రీరామలింగేశ్వరస్వామి ఆలయంలో ఆదివారం ధ్వజస్తంభ ప్రతిష్ఠాపనోత్సవం కనులపండువగా జరిగింది. ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే అరూరి రమేశ్ హాజరై ప్రత్యేక పూజలు చేశారు. కార్యక్రమంలో జడ్పీటీసీ సింగ్లాల్, పీఏసీఎస్ చైర్మన్ మనోజ్కుమార్, ఎంపీపీ కమల, మాజీ జడ్పీటీసీ మేడిశెట్టి రాములు, సర్పంచ్ మునుకుంట్ల యశోద, వైస్ ఎంపీపీ ఎర్రబెల్లి రాజేశ్వర్రావు, రంగు కుమార్గౌడ్, రామసాని కృష్ణ, జడల కృష్ణ పాల్గొన్నారు. అరూరి గట్టుమల్లు ఫౌండేషన్ ఆధ్వర్యంలో పర్వతగిరిలో ఈ నెల 26న నిర్వహించనున్న క్రికెట్ టోర్నమెంట్ ఏర్పాట్లను అరూరి పరిశీలించి సూచనలు చేశారు.