మొగుళ్లపల్లి, మార్చి 5 : జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని ఓ ఠాణాలో ఎస్సై ఆధ్వర్యంలో రౌడీ షీటర్ జన్మదిన వేడుకలు నిర్వహించిన ఘటన సోషల్ మీడియాలో వైరల్గా మారింది. విషయం తెలుసుకున్న జిల్లా పోలీస్ ఉన్నతాధికారి సదరు ఎస్సైని మందలించినట్లు తెలిసింది. వివరాల్లోకి వెళ్తే.. చిట్యాల సర్కిల్ పరిధిలోని ఓ పోలీస్ స్టేషన్లో రెండు రోజుల క్రితం రౌడీ షీటర్ తన జన్మదినం సందర్భంగా కొందరితో కలిసి పోలీస్ స్టేషన్కు వెళ్లాడు.
రౌడీ షీటర్ ఎస్సై సామాజిక వర్గానికి చెందినవాడు కావడంతో అందరు కలిసి ఠాణాలో కేక్ కట్ చేసి వేడుకలు జరుపుకొన్నారు. దీనిని కొందరు ఫొటోలు తీసి సోషల్ మీడియాలో వైరల్ చేయడంతో జిల్లా ఉన్నతాధికారి ఎస్సైని పిలిపించి తీవ్రంగా మందలించినట్లు సమాచారం. కాగా అతను రౌడీషీటర్ అనే విషయం తనకు తెలియదని ఎస్సై సంజాయిషీ ఇచ్చుకున్నట్లు తెలిసింది.