భూపాలపల్లి, నవంబర్ 11 : మత్స్యకార్మికులను ఆదుకున్న ఘనత సీఎం కేసీఆర్దేనని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి అన్నారు. శుక్రవారం భూపాలపల్లి మండలం పంబాపూర్ శివారు భీంఘన్పూర్ ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి, అదనపు కలెక్టర్ దివాకరతో కలిసి ఉచిత చేప, రొయ్య పిల్లలను వదిలారు. అనంతరం సర్పంచ్ బంటు అనూష అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం వంద శాతం రాయితీతో అందించిన రూ.3.40లక్షల విలువైన 11లక్షల చేప పిల్లలను, సుమారు రూ.21.38లక్షల విలువైన రొయ్యపిల్లలను భీంఘన్పూర్ రిజర్వాయర్లో వదిలినట్లు తెలిపారు. ఉచిత చేపపిల్లల పంపిణీతో మత్స్యకారుల జీవితాల్లో సీఎం కేసీఆర్ కొత్త వెలుగులు నింపారని పేర్కొన్నారు.
కేసీఆర్ ప్రత్యేక చొరవతోనే తెలంగాణలో నీలివిప్లవం వచ్చిందన్నారు. మత్స్య సంపద పెంపుతో మత్స్యకారులు ఆదాయం పొందుతుండగా, ప్రజల ఆరోగ్యానికి ఉపయోగపడుతోందన్నారు. ప్రస్తుతం రాష్ట్రం నుంచి ఇతర దేశాలకు ఎగుమతి చేసే స్థాయికి చేరుకున్నామని తెలిపారు. గోదావరి, కృష్ణా నదీజలాల్లో పెరిగే తెలంగాణ చేపలకు మంచి డిమాండ్ ఉందన్నారు. స్థానిక మత్స్యకారుల సమస్యపై మత్స్యశాఖ అధికారులు కలెక్టర్తో సమావేశమై త్వరితగతిన వలలు సమకూర్చాలని ఎమ్మెల్యే ఆదేశించారు. జంగేడు పీఏసీఎస్ చైర్మన్ మేకల సంపత్కుమార్, టీఆర్ఎస్ (బీఆర్ఎస్) పార్టీ భూపాలపల్లి మండల అధ్యక్షుడు పిన్రెడ్డి రాజిరెడ్డి, మాజీ ఎంపీపీ కళ్లెపు రఘుపతిరావు, పీఏసీఎస్ మాజీ చైర్మన్ మందల విద్యాసాగర్రెడ్డి, ఎంపీటీసీ ప్రశాంతి పాల్గొన్నారు.
పోడుభూముల సర్వే పరిశీలన
భూపాలపల్లి మండ లం కమలాపూర్ గ్రామంలో కొనసాగుతున్న పోడు భూముల శుక్రవారం ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి పరిశీలించారు. రైతులతో ఆయన మాట్లాడుతూ పోడు భూముల సర్వే కొనసాగుతున్నందున అధికారులకు సహకరించాలని సూచించారు. అధికారులు విడుతల వారీగా సర్వే పూర్తిచేస్తారని, ఈ ప్రక్రియను రైతులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఎమ్మెల్యే వెంట అదనపు కలెక్టర్ దివాకర, ప్రజాప్రతినిధులు ఉన్నారు.