వరంగల్, ఫిబ్రవరి 7: వరంగల్ నగరాన్ని కాలుష్య రహితంగా తీర్చిదిద్దేందుకు సంఘటితంగా కృషి చేయాలని మేయర్ గుండు సుధారాణి సూచించారు. కార్పొరేషన్ కౌన్సిల్ హాల్లో బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫీషియెన్సీ, మినిస్ట్రీ అఫ్ పవర్ గోల్, తెలంగాణ స్టేట్ రెన్యూవల్ ఎనర్జీ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ సంస్థలు సంయుక్తంగా మంగళవారం వర్క్షాపు ఏర్పాటు చేశాయి. ముఖ్య అతిథిగా ఆమె హాజరై మాట్లాడుతూ దేశంలోనే మొట్ట మొదటిసారిగా రాష్ట్రంలో ఎనర్జీ బిల్డింగ్ కోడ్ అమలు చేస్తున్నామన్నారు. ఎనర్జీ కన్జూమర్ బిల్డిండ్ కోడ్ పర్యావరణ, నివాస్ సంహిత, స్మార్ట్సిటీలు, స్మార్ట్ భవనాలు, వీధి దీపాల్లో శక్తి సామర్థ్యం, వ్యర్థ పదార్థాల నిర్వహణ అంశాలను గ్రేటర్ కార్పొరేషన్లో అమలుకు చర్యలు తీసుకుంటామన్నారు.
సీఎం కేసీఆర్ చేపట్టిన సోలార్ ప్రాజెక్ట్లు, గ్రీన్ ఎనర్జీ కోసం చేపట్టిన విన్నూత కార్యక్రమాలతో జాతీయ ఇంధన సంరక్షణ వారోత్సవాల్లో తెలంగాణ రాష్ట్రానికి అవార్డు దక్కిందన్నారు. కమర్షియల్, రెసిడెన్షియల్ భవన నిర్మాణాల్లో ఈసీబీసీ నిబంధనలు పాటించేలా ప్రజల్లో అవగాహన కల్పిస్తామన్నారు. గ్రేటర్లో సరఫరా, శానిటేషన్, టౌన్ ప్లానింగ్, ఎలక్ట్రిసిటీ విభాగాల్లో లీకేజీలు గుర్తించడం, ఇంధన పొదుపు, వర్మీకంపోస్ట్ అంశాల్లో ఆధునిక సాంకేతికతను వినియోగించాలన్నారు. ఈసీబీసీ నిఫుణులు సయ్యద్ ముజామిల్ అలీ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. వర్క్షాపులో పలువురు వ్యక్తం చేసిన సందేహాలను నివృత్తి చేశారు. కార్యక్రమంలో డిప్యూటీ కమిషనర్ అనీసుర్ రషీద్, సీఎంహెచ్వో జ్ఞానేశ్వర్, ఎంహెచ్వో రాజేశ్, ఈఈలు సంజయ్కుమార్, ఏసీపీలు శ్రీనివాస్రెడ్డి, బషీర్, శ్రీనివాస్, ఎలగ్రీన్ బిల్డింగ్ కన్సల్టెంట్ ఆదిత్య, టీఎస్ రెడ్కో సిబ్బంది శ్రీవర్ధన్ సతీశ్ పాల్గొన్నారు.
శివరాత్రికి ఏర్పాట్లు చేయాలి
మహా శివరాత్రి, ఉర్సు ఉత్సవాలకు పకడ్బందీగా ఏర్పాటు చేయాలని మేయర్ సుధారాణి అధికారులను ఆదేశించారు. కార్పొరేషన్ కార్యాలయంలో మహా శివరాత్రి, దర్గా ఉత్సవాల ఏర్పాట్లపై అధికారులతో సమీక్షించారు. ఈ నెల 12 నుంచి 15 వరకు నిర్వహించే ఉర్సుతోపాటు ఈ నెల 18న జరిగే శివరాత్రి సందర్భంగా ఆలయాలను ముస్తాబు చేయాలన్నారు. వేయిస్తంభాల, మెట్టురామలింగేశ్వరస్వామి ఆలయాలు, పబ్లిక్ గార్డెన్తోపాటు కాశీబుగ్గలోని కాశీవిశ్వేరాలయం, కరీమాబాద్లోని దర్గా ప్రాంతంలో ఏర్పాట్లు చేయాలన్నారు. సమావేశంలో ఎలక్ట్రికల్ ఈఈ సంజయ్కుమార్, డీఈ రవికుమార్, ఏఈ సంతోష్ పాల్గొన్నారు.