తాడ్వాయి, ఫిబ్రవరి 29 : తాడ్వాయి మండలం కన్నెపల్లిలోని సారలమ్మ దేవత పూజా మందిరంలో కాక వంశీయులు గురువారం తిరుగువారం పూజలు నిర్వహించారు. గత శనివారం గద్దెలను విడిచి గుడికి చేరుకున్న అమ్మవారి గుడిని నీటితో శుభ్రం చేసి, అడెరాలను శుద్ధి చేశారు. అనంతరం పూజారులు, గ్రామస్తులు ప్రత్యేక పూజలు చేశారు. ప్రధాన పూజారి కాక సారయ్య అడెరాలపైనున్న గంటలను కొడుతూ తల్లిని స్మరిస్తూ గంటపాటు ప్రత్యేక పూజలు చేశారు.
అనంతరం తల్లికి యాటపోతును సమర్పించి, యాట ప్రసాదాన్ని కుల పెద్దలకు పంచిపెట్టారు. తిరుగువారం మొక్కుల సందర్భంగా ఛత్తీస్గఢ్ రాష్ర్టానికి చెందిన భక్తులు సారలమ్మ గుడిలో పూజలు చేశారు. దీంతో మహాజాతర సమాప్తమవుతుందని, గుడికి తాళాలు వేసి మూసివేస్తామని ప్రధాన పూజారి కాక సారయ్య తెలిపారు. తిరిగి వచ్చే ఉగాది పండుగ రోజున తాళాలు తీసి దేవతకు ప్రత్యేక పూజలు చేసి, యాటలను సమర్పిస్తామని చెప్పారు. మళ్లీ వచ్చే ఏడాది ఫిబ్రవరిలో జరిగే మండెమెలిగే పండుగ(మినీ జాతర)కు గుడి తాళాలు తీసి పూజలు చేస్తామన్నారు.