సుబేదారి, మే 29 : అక్రమంగా లింగ నిర్ధారణ పరీక్షలు చేసి, అవసరమైన వారికి గర్భస్రావాలు చేయిస్తున్న ముఠాను యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్, టాస్ ఫోర్స్, కేయూసీ పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల్లో 18 మందిని అరెస్టు చేశారు. వీరి నుంచి లింగనిర్ధారణకు వినియోగించిన మూడు సానర్లు, 18 సెల్ఫోన్లు, రూ.73 వేల నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు సోమవారం హనుమకొండలోని వరంగల్ పోలీసు కమిషనరేట్ కార్యాలయంలో పోలీసు కమిషనర్ ఏవీ రంగనాథ్ వివరాలు వెల్లడించారు. వరంగల్ పోలీసు కమిషనరేట్ పరిధిలోని కేయూసీ పోలీసుస్టేషన్ సమీపంలోని వెంకటేశ్వర కాలనీలో వైద్య విద్య అర్హతలు లేకున్న అక్రమంగా లింగ నిర్ధారణ పరీక్షలు చేస్తున్నారు. పుట్టబోయె బిడ్డ గురించి వెల్లడించి ఆడపిల్ల అయితే గర్భస్రావానికి పాల్పడుతున్నట్లు పోలీసులకు ఫిర్యాదులొచ్చాయి. దీంతో ఓ మహిళా కానిస్టేబుల్ను అక్కడికి పంపించి స్టింగ్ ఆపరేషన్తో యాంటి హ్యూమన్ ట్రాఫికింగ్, టాస్క్ఫోర్స్, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు సంయుక్తంగా తనిఖీలు చేశారు. 18 మంది ముఠా సభ్యులను రెడ్హ్యాండెడ్గా పట్టుకున్నారు.
ఈ ముఠాలో ప్రధాన నిందితుడు వేముల ప్రవీణ్. ఇతడు గతంలో స్కానింగ్ సెంటర్లో టెక్నీషియన్గా పనిచేసిన అనుభవంతో సులభంగా డబ్బు సంపాదించాలనే ఆలోచనతో తన భార్య సంధ్యారాణితో కలిసి కేయూసీ పోలీసు స్టేషన్ పరిధిలోని గోపాల్పూర్ వెంకటేశ్వర్ కాలనీలో ఇంటిని అద్దెకు తీసుకున్నాడు. గర్భవతులకు అక్రమంగా లింగనిర్ధారణ పరీక్ష చేయడానికి సిబ్బంది సాయంతో పోర్టబుల్ స్కానర్లతో స్కానింగ్ కేంద్రాన్ని రహస్యంగా నిర్వహిస్తున్నాడు. ప్రధాన నిందితుడు వేముల ప్రవీణ్ ఆర్ఎంపీలు, పీఆర్వోలు , హాస్పిటల్ మేనేజ్మెంట్స్, సిబ్బంది, డాక్టర్లతో కలిసి నెట్వర్క్ను ఏర్పాటు చేసుకొన్నాడు. స్కానింగ్ సెంటర్లో లింగ నిర్ధారణకు వచ్చే గర్భవతులకు పరీక్షలు చేసి పుట్టబోయె బిడ్డ గురించి చెప్పేవాడు. పాప అయితే గర్భస్రావం చేసుకోవడానికి ముఠాకు చెందిన హనుమకొండలోని లోటస్ హాస్పిటల్స్, గాయత్రి హాస్పిటల్ , నెక్కొండ ఉపేందర్(పార్థు) హస్పిటల్, నర్సంపేటలోని బాలాజీ మల్టీ స్పెషాల్టీ హస్పిటల్కు గర్భవతులను పంపించి, అక్కడి డాక్టర్లు, సిబ్బందితో అక్రమంగా గర్భస్రావాలకు పాల్పడేవారు. బాధితుల నుంచి రూ.20 వేల నుంచి రూ.30 వేల చొప్పున తీసుకుని ముఠా సభ్యులు కమిషన్ వాటాలుగా పంచుకునేవారు. ఇప్పటి వరకు 150 పైగా గర్బస్రావాలకు పాల్పడినట్లు సీపీ రంగనాథ్ తెలిపారు.
నిందితుల్లో నలుగురు డాక్టర్లు ..
పోలీసులు అరెస్టు చేసిన వారిలో ప్రధాన నిందితుడు స్కానింగ్ సెంటర్ నిర్వాహకుడు వేముల ప్రవీణ్ ఉన్నాడు. మిగిలిన వారిలో వేముల సంధ్యారాణి, డాక్టర్ బాల్నె పార్ధు, డాక్టర్ మోరం అరవింద, డాక్టర్ మోరం శ్రీనివాస్మూర్తి, డాక్టర్ బాల్నె పూర్ణిమ, బాల్నె ప్రదీప్ రెడ్డి, కైత రాజు, కల్లా అర్జున్, డీ ప్రణయ్బాబు, కీర్తి మోహన్, బాల్నె అశాలత, కొంగర రేణుక, భూక్యా అనిల్, చెంగెల్లి జగన్, గన్నారపు శ్రీలత, బండి నాగరాజు, కాసిరాజు దిలీప్ ఉన్నారు. వీరికి మరికొందరు సహకరించారని సీపీ రంగనాథ్ తెలిపారు. మరో ఇద్దరు నిందితులు పరారీలో ఉన్నారని పేర్కొన్నారు. ముఠాలో కొందరు ప్రభుత్వ, ప్రైవేట్ డాక్టర్లు ఉన్నారని తెలిపారు. దీనిపై పూర్తి స్థాయి విచారణ కొనసాగుతుందని వివరించారు.
నిందితులపై పీడీయాక్ట్
నిందితులపై పీడీ యాక్ట్ నమోదు చేస్తున్నామని సీపీ రంగనాథ్ తెలిపారు. వరంగల్ పోలీసు కమిషనరేట్ పరిధిలో ఎక్కడైనా అక్రమంగా లింగనిర్ధారణ పరీక్షలు చేసినా, గర్బస్రావాలకు పాల్పడినా వెంటనే ప్రజలు పోలీసులకు, వైద్యాధికారులకు సమాచారం అందించాలని ఆయన కోరారు. వైద్యారోగ్య శాఖ వరంగల్ జిల్లా అధికారి వెంకటరమణ మాట్లాడుతూ అక్రమ లింగ నిర్ధారణ, గర్బస్రావాలకు పాల్పడిన నర్సంపేట బాలాజీ హాస్పిటల్, నెక్కొండలోని పార్థు హస్పిటల్కు నోటీస్లు ఇచ్చి స్కానింగ్ మిషన్లు స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. పోలీసుల సాయంతో ఐదు కేసులు నమోదు చేశామని చెప్పారు.
పోలీసులకు సీపీ అభినందన
ఈ ముఠాను పట్టుకోవడంలో ప్రతిభ కనబరిచిన అదనపు డీసీపీ పుష్ప, టాస్ఫోర్స్ ఏసీపీ జితేందర్ రెడ్డి, ఇన్స్పెక్టర్లు సుజాత, శ్రీనివాస్రావు, జనార్ధన్ రెడ్డి, వినయ్కుమార్, ఎస్సై ఫసీయొద్దీన్, మల్లేశం, శరత్కుమార్, సల్మాన్ప, ఏహెచ్టీయూ సిబ్బంది ఏఎస్సై భాగ్యలక్ష్మి, హెడ్ కానిస్టేబుల్ సమీయొద్దీన్, కానిస్టేబుల్స్ శ్రీనివాస్, సైబర్ క్రైం సిబ్బంది కిశోర్కుమార్, రాజు, అంజనేయులు, రజియా సుల్తానా, టాస్క్ ఫోర్స్ సిబ్బంది. శ్యాంసుందర్, సురేశ్, ప్రభాకర్, కమల వనంత, హోంగార్డ్ రవీందర్, చైల్డ్ కోఆర్టినేటర్లు కృష్ణమూర్తి, కృతిని సీపీ ఏవీ రంగనాథ్ అభినందించారు. విలేకరుల సమావేశంలో వరంగల్ జిల్లా వైద్యాధికారి వెంకటరమణ, హనుమకొండ జిల్లా అడిషనల్ వైద్యా అధికారి మదన్మోహన్రావు, అదనపు డీసీపీ పుష్ప పాల్గొన్నారు.
నెక్కొండలో కమలాపూర్ సీఐ విచారణ
నెక్కొండ, మే 30 : అక్రమంగా లింగ నిర్ధారణ పరీక్షలు చేస్తున్న దవాఖానలపై పోలీసులు, వైద్యాధికారులు దృష్టి పెట్టారు. హనుమకొండ జిల్లా కమలాపూర్ సీఐ సంజీవ్కుమార్ నేతృత్వంలో పోలీసులు మండలంలో దర్యాప్తు చేపట్టారు. ఈ వ్యవహారంలో నెక్కొండకు చెందిన పలువురికి ప్రమేయం ఉన్నట్లు గుర్తించిన అధికారులు మరిన్ని ఆధారాలు సేకరిస్తున్నారు. గోపాలపురం కేంద్రంగా లింగ నిర్ధారణ పరీక్షలు జరిపి చట్ట విరుద్ధంగా అబార్షన్లు చేసిన వైద్యులు, వారికి సహకరిస్తున్న ముఠాను గుర్తించిన పోలీసులు ప్రైవేటు వైద్యుడు పార్ధుతోపాటు అతడి కుటుంబ సభ్యులను, వైద్య సిబ్బందిపై కేసు నమోదు చేసి సోమవారం అరెస్ట్ చేశారు. గతంలో శిశువిక్రయ ఘటనలో ఈ వైద్యుడి ప్రమేయంపై ఆరోపణలున్న నేపథ్యంలో అన్నికోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు.