పోచమ్మమైదాన్, జనవరి 5: వరంగల్ 13వ డివిజన్ దేశాయిపేటలోని ఎంహెచ్నగర్ (మోటూరి హనుమంతరావు నగర్) స్లమ్ ఏరియాకు వెళ్లాలంటే ఒకప్పుడు తంటాలు పడేవారు. అసలే మురికివాడ.. ఆపై వరదనీటితో నిండిపోయి అందరూ బురద నీటిలో ఇబ్బందులు పడేవారు. ఈ ప్రాంతానికి ప్రజాప్రతినిధులు, అధికారులు రావాలంటే వెనుకడుగు వేసేవారు. ఇప్పుడు ఎంహెచ్నగర్ రూపురేఖలు మారిపోయాయి. ఇక్కడ ఏళ్ల తరబడి నివసిస్తున్న గుడిసెవాసులకు ప్రభుత్వం సకల సదుపాయాలు కల్పించింది. కోట్లాది రూపాయలతో అభివృద్ధి పనులు చకచకా పూర్తి చేసింది. తెలంగాణ ప్రభుత్వం స్లమ్ ఏరియాల అభివృద్ధితోపాటు సంక్షేమ పథకాలను పేదలకు అందిస్తున్నది. ప్రస్తుతం స్లమ్ ఏరియా నగరంలోని బస్తీల మాదిరిగా మారడంతో తూర్పు నియోజకవర్గంలో ఆదర్శంగా మారింది. విదేశీయులు సైతం ఈ ప్రాంతాన్ని తరచూ సందర్శిస్తూ ప్రశంసలు అందజేస్తున్నారు. ఎంహెచ్నగర్ స్లమ్ ఏరియాకు జాతీయస్థాయిలోనూ మంచి గుర్తింపు పొందింది.
నగర సమీనంలోని ఎంహెచ్నగర్ స్లమ్ ఏరియాలో దాదాపు 700 గుడిసెల్లో 2,500 మంది జీవనం సాగిస్తున్నారు. గతంలో వీరికి ఎలాంటి సదుపాయాలు అందుబాటులో లేవు. ఇక వర్షాకాలంలో నరకం అనుభవించే వారు. దీంతో ప్రభుత్వం స్లమ్ ఏరియాను శాశ్వతంగా అభివృద్ధి చేయాలని నిర్ణయించింది. ఇందుకోసం అవసరమైన నిధులు, వసతుల విషయంలో పూర్తిస్థాయిలో వెసులుబాటు కల్పించింది. కార్పొరేటర్ సురేష్కుమార్ జోషి సైతం కాలనీవాసులతో కలిసి అభివృద్ధి పనులను త్వరగా పూర్తి చేయించారు.
ఎంహెచ్నగర్ అభివృద్ధి కోసం ప్రభుత్వం పూర్తిస్థాయిలో నిధులు మంజూరు చేసింది. శాశ్వత అభివృద్ధి పనులు చేపట్టాలని ఆదేశించడంతో సీసీరోడ్లు, డ్రైనేజీలు ఏర్పాటు చేశారు. ఇంటింటికీ మిషన్ భగీరథ తాగునీటి సదుపాయం కల్పించారు. అలాగే, కాలనీల్లో దాదాపు వెయ్యి మరుగుదొడ్లు నిర్మించారు. అడ్డుగా ఉన్న 33 కేవీ విద్యుత్ లైన్లను తొలగించి, వీధిలైట్లు బిగించారు. అదనంగా రెండు విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లు ఏర్పాటు చేయించి, రెండు చోట్ల హైమాస్ట్ లైట్లు బిగించారు. ఇక చిన్నారులకు ఆహ్లాదకరమైన వాతావరణం అందించేం దుకు చిట్టిపార్కు ఏర్పాటు చేసి, నగరంలో ప్రత్యేకతను చాటారు. ప్రత్యేకంగా శ్మశాన వాటిక కోసం మూడు బర్నింగ్ ప్లాట్ఫాంలు ఏర్పాటు చేశారు. రానున్న కాలంలో డ్రైనేజీ వాటర్ను ఫిల్టర్ చేసి మొక్కలకు నీరందించే ప్రాజెక్టు కూడా మంజూరైంది. అలాగే, రూ. 25 లక్షలతో కమ్యూనిటీ హాల్ నిర్మాణం కోసం నిధుల మంజూరయ్యాయి. కాగా, స్లమ్ ఏరియాలో అభివృద్ధి కోసం దాదాపు రూ. 10 కోట్లు వెచ్చించినట్లు తెలుస్తున్నది. ఈ ప్రాంతాన్ని స్మార్ట్ స్లమ్ ఏరియాగా తీర్చిదిద్దటానికి ఇంకా ప్రయత్నాలు కొనసాగుతున్నాయి.
వరంగల్ తూర్పు నియోజకవర్గంలో ఆదర్శంగా నిలుస్తున్న ఎంహెచ్నగర్కు సందర్శించడానికి విదేశీయులు సైతం ఆసక్తి చూపుతున్నారు. ఆయా దేశాల మేయర్లు, డిప్యూటీ మేయర్లు, అధికారులు ఈ ప్రాంతాన్ని సందర్శించి ఫిదా అయ్యాయి. ఇలాంటి అభివృద్ధి పనులు మా ప్రాంతాల్లో కూడా అమలు చేస్తామంటూ ప్రభుత్వానికి ప్రశంసలు అందజేశారు. నవంబర్, డిసెంబర్ నెలల్లో బంగ్లాదేశ్ మేయర్లు, అధికారులు సందర్శించారు. అలాగే, గత నెలలో నేపాల్ మేయర్లు సైతం సందర్శించినప్పుడు అభివృద్ధి పనులను చూసి ఆకర్షితులయ్యారు. అలాగే, గత సంవత్సరం ఆస్ట్రేలియా, అమెరికాకు చెందిన ప్రతినిధులు కూడా ఈ స్లమ్ ఏరియాను చూసి సంతోషం వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రభుత్వం ప్రజలకు ఉపయోగపడే అభివృద్ధి పనులను చక్కగా చేస్తుందంటూ కితాబిచ్చారు.
ఎంతో వెనుకబడి ఉన్న ఎంహెచ్ నగర్లో కోట్లాది రూపాయల అభివృద్ధి పనులు జరిగాయి. ఇప్పుడు అభివృద్ధిలో నగరంలోని ఇతర ప్రాంతాలతో పోటీ పడుతున్నది. ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్, మేయర్ గుండు సుధారాణి, కార్పొరేషన్ అధికారుల సహకారంతో అభివృద్ధి పనులు వేగంగా జరిగాయి. ప్రభుత్వం అందిస్తున్న సహాయ, సహకారాలు కాలనీవాసులకు అండగా నిలిచాయి. భవిష్యత్లో స్మార్ట్ స్లమ్ ఏరియాగా తీర్చిదిద్దడమే లక్ష్యం.
– సురేష్కుమార్ జోషి, స్థానిక కార్పొరేటర్