వర్ధన్నపేట, డిసెంబర్ 7: ఓటరు నమోదుపై గ్రామాల్లో విస్తృత ప్రచారం నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వికాస్రాజ్ సూచించారు. వర్ధన్నపేట తహసీల్ కార్యాలయాన్ని రాష్ట్ర ఎన్నికల అదనపు అధికారి రవికిరణ్, కలెక్టర్ గోపితో కలిసి బుధవారం ఆయన ఓటరు జాబితాను పరిశీలించారు. ఈ సందర్భంగా వికాస్రాజ్ మాట్లాడుతూ 18 ఏళ్లు నిండిన ప్రతి యువతీ యువకుడు రాజ్యాంగం కల్పించిన ఓటుహక్కు పొందేలా చూడాల్సిన బాధ్యత అధికారులు, సిబ్బందిపై ఉందన్నారు.
గ్రామాల్లో ప్రత్యేక ప్రచార కార్యక్రమాలను చేపట్టి అర్హులైన వారికి ఓటుహక్కు కల్పించేలా వారితో దరఖాస్తు చేయించాలన్నారు. అలాగే, ఇంటింటా సర్వే నిర్వహించి, గృహాల వారీగా పరిశీలన చేయాలన్నారు. వివాహాలు జరిగి వెళ్లిపోయిన యువతులు, బతుకుదెరువు కోసం ఇతర ప్రాంతాలకు వెళ్లి అక్కడే స్థిరపడిన వారు, చనిపోయిన వ్యక్తులు, వృద్ధుల వివరాలను సమగ్రంగా సేకరించి, జాబితాను సవరించాలని ఆదేశించారు. వచ్చే ఎన్నికల వరకు అర్హులందరికీ ఓటు ఉండడంతోపాటు అనర్హుల తొలగించే చర్యలు చేపట్టాలని సూచించారు. అంతేకాకుండా తప్పుల సవరణను కూడా పూర్తి చేసి తుది జాబితాను సిద్ధం చేయాలని ఆదేశించారు.
ప్రధానంగా 18 ఏళ్లు నిండిన యువతీ యువకులకు అవగాహన కల్పించి, వారితో ఓటరు నమోదు కోసం దరఖాస్తు చేయించేందుకు చర్యలు తీసుకోవాలని వికాస్రాజ్ అధికారులను ఆదేశించారు. ఓటర్ల జాబితాలో తప్పులు లేకుండా సమగ్రంగా ఉన్నప్పుడే ఎన్నికల సమయంలో ఓటింగ్ శాతం ఎక్కువగా నమోదవుతుందని వివరించారు. అందుకోసం గ్రామాలు, వార్డుల వారీగా అవసరమైతే సిబ్బందితో సమగ్రంగా పరిశీలన చేయించాలన్నారు.
ఇందుకోసం ఎన్నికల విభాగానికి సంబంధించిన అధికారులతో రెవెన్యూ అధికారులు సమీక్షించి మెరుగైన తుది జాబితాను సిద్ధం చేసి కలెక్టర్ కార్యాలయాలకు అందజేయాలని సూచించారు. ఓటర్ల నమోదు, సవరణ, తొలగింపుల విషయంలో ఎవరైనా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. ముందుగా తహసీల్ కార్యాలయానికి వచ్చిన ప్రధాన అధికారి వికాస్రాజ్, అదనపు అధికారి రవికరణ్కు స్థానిక అధికారులు ఘన స్వాగతం పలికి వారు అడిగిన వివరాలు అందించారు. కార్యక్రమంలో వరంగల్ ఆర్డీవో మహేందర్జీ, స్థానిక తహసీల్దార్ రవిచంద్రారెడ్డి, రాయపర్తి తహసీల్దార్ సత్యనారాయణ, నయాబ్ తహసీల్దార్ పవన్కుమార్, హారతి, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.