రాయపర్తి/చెన్నారావుపేట, డిసెంబర్ 30: విద్యార్థుల సమగ్ర వికాసం కోసం ప్రభుత్వం తొలిమెట్టు కార్యక్రమానికి శ్రీకారం చుట్టిందని డీఈవో వాసంతి అన్నారు. మండలకేంద్రంలోని ఉన్నత పాఠశాల ఆవరణలో ఇన్చార్జి ఎంఈవో నోముల రంగయ్య అధ్యక్షతన ఏర్పాటు చేసిన మండలస్థాయి తొలిమెట్టు కార్యక్రమం-టీఎల్ఎం (టీచింగ్, లర్నింగ్ మెథడ్స్ మేళా)ను శుక్రవారం ఆమె ప్రారంభించి మాట్లాడారు. ప్రతి ఉపాధ్యాయుడు నిత్య విద్యార్థిగా వ్యవహరిస్తూ తాను కొత్త విషయాలు నేర్చుకోవడంతోపాటు నూతన విషయాలను విద్యార్థులకు బోధించాలన్నారు. దీంతో పిల్లల్లో అనుకున్న మార్పులు సాధించొచ్చన్నారు. ప్రతి ఉపాధ్యాయుడు బోధన అభ్యసనా సామగ్రిని ఉపయోగించి పాఠాలు బోధించాలని ఆదేశించారు.
కృత్యాధార బోధనతో విద్యార్థులకు సంపూర్ణ విజ్ఞానం చేకూరడంతోపాటు శాశ్వత జ్ఞానం అలవడుతుందని డీఈవో వివరించారు. అనంతరం ఉపాధ్యాయులు, విద్యార్థులు తయారు చేసిన కృత్యాలు, చార్టులు, బొమ్మలను ఆమె క్షేత్ర స్థాయిలో పరిశీలించారు. కార్యక్రమంలో ఎంపీపీ జినుగు అనిమిరెడ్డి, జడ్పీటీసీ రంగు కుమార్, సర్పంచ్ గారె నర్సయ్య, ఎంపీటీసీ అయిత రాంచందర్, మండల నోడల్ ఆఫీసర్ గారె కృష్ణమూర్తి, ఎస్ఎంసీ చైర్మన్ మామిండ్ల అశోక్కుమార్, ప్రధానోపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.
చెన్నారావుపేటలోని జడ్పీహెచ్ఎస్లో టీఎల్ఎం మేళాను సర్పంచ్ మల్లయ్యతో కలిసి డీఈవో వాసంతి ప్రారంభించారు. అనంతరం ఉపాధ్యాయులు ఏర్పాటు చేసిన ప్రదర్శనలను పరిశీలించారు. కార్యక్రమంలో ఎస్సై మహేందర్, మానిటరింగ్ అధికారి సారయ్య, ఏఈవో రత్నమాల, జడ్పీ కో ఆప్షన్ సభ్యుడు రఫీ, నోడల్ అధికారి ఫ్లోరెన్స్, సరళ, రవీందర్రెడ్డి పాల్గొన్నారు. తర్వాత సర్పంచ్ విద్యార్థులకు సోలార్ లైట్లు పంపిణీ చేశారు.
సృజనాత్మకతను వెలికితీసేందుకు దోహదం
నల్లబెల్లి: విద్యార్థుల్లో దాగి ఉన్న సృజనాత్మకతను వెలికితీసేందుకు కృత్యమేళా ఎంతగానో దోహదం చేస్తుందని తహసీల్దార్ దూలం మంజుల అన్నారు. మండలకేంద్రంలో జరిగిన మండలస్థాయి కృత్యమేళాలో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. మన ఊరు-మన బడి కార్యక్రమం ద్వారా సర్కారు బడుల్లో ప్రభుత్వం మౌలిక వసతులు ఏర్పాటు చేస్తున్నదన్నారు. కార్యక్రమంలో సర్పంచ్ ఎన్ రాజారాం, ఎంఈవో చదువుల సత్యనారాయణ, హెచ్ఎం రాయస్వామి, రామచంద్రు, యాకూబ్రెడ్డి, శ్రీనివాసరావు పాల్గొన్నారు.