వరంగల్, నవంబర్ 22 : వంటపని కోసం వచ్చి చోరీలకు పాల్పడుతున్న యువకుడిని సీసీఎస్, హనుమకొండ పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడి నుంచి రూ.2.50 లక్షల విలువ గల ద్విచక్ర వాహనంతోపాటు ల్యాప్టాప్ను స్వాధీనం చేసుకున్నారు. నిందితుడి అరెస్టు వివరాలను సిటీ పోలీస్ కమిషనర్ తరుణ్జోషి మంగళవారం పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో వెల్లడించారు.
ఉత్తరప్రదేశ్ రాష్ట్రం గాజీపూర్ జిల్లాకు చెందిన షేక్ ఫయాజ్(23) ఉపాధి కోసం హైదరాబాద్కు వచ్చాడు. హనుమకొండలోని ఓ హోటల్ నిర్వాహకుడికి వాట్సాప్తో పరిచయమయ్యాడు. హోటల్లో వంటపని చేసేందుకు ఉద్యోగంలో చేరాడని తెలిపారు. అక్టోబర్లో పనిలో చేరిన షేక్ ఫయాజ్ హనుకొండ బస్ స్టేషన్ సమీపంలోని హోటల్ యజమానికి చెందిన గదిలో మరో ఇద్దరు గుమస్తాలతో కలిసి కిరాయికి ఉంటున్నాడు.
గదిలో ఉంటున్న ఒకరి వద్ద ఖరీదైన ద్విచక్రవాహనంతో పాటు ల్యాప్టాప్ను ఫయాజ్ గమనించాడు. ఇద్దరు నిద్రపోయిన సమయంలో ద్విచక్ర వాహనం, ల్యాప్టాప్ చోరీ చేసి పారిపోయాడని సీపీ వివరించారు. బాధితుల ఫిర్యాదు మేరకు దర్యాప్తు చేపట్టిన హనుమకొండ పోలీసులు నిందితుడు ల్యాప్టాప్ను అమ్మే ప్రయత్నం చేస్తుండగా మంగళవారం అదుపులోకి తీసుకున్నారు. నిందితుడిని విచారించగా నేరాన్ని అంగీకరించారని తెలిపారు. కేసులో ప్రతిభ కనబర్చిన క్రైం అండ్ ఆపరేషన్ అదనపు డీసీపీ పుష్పారెడ్డి, ఏసీపీ డేవిడ్ రాజ్, సీసీఎస్ ఇన్స్పెక్టర్ రమేశ్కుమార్, శ్రీనివాస్రావు, హనుమకొండ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్జీని సీపీ అభినందించారు.