సుబేదారి/న్యూశాయంపేట, మే 19 : హనుమకొండ జిల్లా కేంద్రం న్యూశాయంపేట జంక్షన్ నుంచి పద్మాక్షిగుట్ట రోడ్డువైపు వెళ్లే ‘కుడా’ స్థలంలో సర్వే నంబర్ 23లో కొందరు రెండు రోజుల క్రితం హనుమాన్ విగ్రహం ఏర్పాటు చేశారు. గమనించిన సంబంధిత అధికారులు ఎన్డీఆర్ఎఫ్ బృందాలతో సోమవారం అర్ధరాత్రి విగ్రహాన్ని తొలగించారు. దీంతో ఉద్రిక్త పరిస్థితి నెలకొన్నది. అధికారుల వైఖరికి నిరసనగా స్థానికులు న్యూశాయంపేట జంక్షన్ వద్ద మంగళవారం ఆందోళన చేపట్టారు. ప్రధాన రహదారిపై గంటపాటు రాస్తారోకో చేయడంతో ట్రాఫిక్ స్తంభించింది. సుబేదారి పోలీసులు చేరుకొని ఆందోళనకారులను అరెస్ట్ చేసే ప్రయత్నంలో తోపులాట జరిగింది.
చివరికి ఆందోళనకారులను పోలీసులు బలవంతంగా వాహనాల్లో ఎక్కించి సుబేదారి పోలీసు స్టేషన్కు తరలించారు. ట్రాఫిక్కు అంతరాయం కలిగించిన 21 మందిపై కేసులు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. కాగా, కుడా స్థలంలో ఆకస్మాత్తుగా హనుమాన్ విగ్రహాన్ని ఏర్పాటు చేసింది ఎవరెవరనే విషయమై పోలీసులు ఆరా తీస్తున్నారు. సంబంధిత వ్యక్తులను గుర్తించి కేసు నమోదు చేయడానికి పోలీసులు రంగంలోకి దిగారు. పద్మాక్షి గుట్ట రోడ్డులోని సర్వే నంబర్ 23 కుడా స్థలాన్ని అధికారులు ఇటీవల భద్రకాళీ చెరువు మట్టితో చదును చేశారు. ఇదే స్థలంలో న్యూశాయంపేటకు చెందిన కొందరు రెండు రోజుల క్రితం హనుమాన్ విగ్రహాన్ని ఏర్పాటు చేయగా అధికారులు తొలగించడంతో స్థానికంగా ఉద్రిక్తత నెలకొంది.