హనుమకొండ సబర్బన్ మార్చి 12 : ‘నాకు మహిళలంటే చాలా గౌరవం ఉంది. నలుగురు అక్కా చెల్లెళ్ల మధ్య పెరిగిన నాకు అందరినీ గౌరవంగా చూసుకునే సహనం ఉంది. ఇటీవల మహిళా దినోత్సవాన్ని కూ డా ఘనంగా నిర్వహించా’ అని స్టేషన్ఘన్పూర్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య అన్నా రు. ఆదివారం ధర్మసాగర్ మండలం జానకీపురం సర్పంచ్ కుర్సపల్లి నవ్య ఇంటికి ఎమ్మెల్యే స్వయంగా వెళ్లారు. ఈ సందర్భం గా సర్పంచ్ నవ్యతోపాటు ఆమె భర్త ప్రవీణ్తో కలిసి విలేకరుల సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ 146 గ్రామాలకు ప్రాతినిధ్యం వహిస్తున్న తాను అన్ని గ్రామాలను సమానంగా చూసుకుంటానన్నారు. కొంత కమ్యూనికేషన్ గ్యాప్ వల్ల చిన్నచిన్న సమస్యలు తలెత్తితే సరిదిద్దుకుంటానని చెప్పారు. అనుకోకుండా జరిగిన విషయాల్లో మహిళలు బాధపడితే వారికి క్షమాపణ చెప్తానన్నారు. రానున్న రోజుల్లో కూడా మహిళలకు ఏ కష్టం వచ్చినా ముందుండి ఆదుకుంటానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు.
ముఖ్యమంత్రి ప్రోద్బలంతో అనేక సంక్షేమ కార్యక్రమాల తో పాటు అభివృద్ధి పనులు చేస్తున్నానని తెలిపారు. దీన్ని జీర్ణించుకోలేని విపక్షాలు తనను బదనాం చేసేందుకు ప్రయత్నిస్తున్నాయని ఆరోపించారు. మహిళల కోసం పదవులకు రాజీనామా చేసిన అంబేద్కర్ను ఆదర్శంగా తీసుకుని పనిచేస్తున్నానన్నారు. జానకీపురం సర్పంచ్ భర్త తనకు అత్యంత సన్నిహితుడని, అతడిపై అభిమానంతోనే అతడి భార్య నవ్యకు సర్పంచ్ టికెట్ ఇచ్చానని ఎమ్మెల్యే రాజయ్య తెలిపారు. గ్రామాభివృద్ధి విషయంలో రాజీపడేది లేదన్నారు. ప్రాధాన్యత క్రమంలో అన్ని పనులు చేస్తామన్నారు. ఇప్పటికిప్పుడే జానకీపురం గ్రామానికి రూ.25లక్షలు మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు.
ఈ సందర్భంగా సర్పంచ్ నవ్య మాట్లాడుతూ ఏ సందర్భంలోనైనా మహిళలు అగౌరవానికి గురైతే తాను సహించేది లేదని స్పష్టం చేశారు. ఇది మా పార్టీ, మా కుటుంబ వ్యవహారమని ఆమె చెప్పారు. ఎమ్మెల్యే రాజయ్య అంటే తనకు గౌరవం ఉందని, అన్ని గ్రామాలతో పాటు తమ గ్రామానికి కూడా అభివృద్ధి కోసం నిధులు కేటాయించాలని ఆమె కోరారు. సమావేశంలో డీసీసీబీ డైరెక్టర్, ధర్మసాగర్ పీఏసీఎస్ చైర్మన్ గుండ్రెడ్డి రాజేశ్వర్రెడ్డి, ఘన్పూర్ ఏఎంసీ చైర్మన్ గుజ్జరి రాజు, వేలేరు జడ్పీటీసీ చాడ సరితారెడ్డి, పార్టీ మండల అధ్యక్షుడు మరిజె నర్సింహారావు, మునిగెల రాజు, సర్పంచ్ల ఫోరం మండల అధ్యక్షులు కర్ర సోమిరెడ్డి, కాయిత మాధవరెడ్డి తదితరులు పాల్గొన్నారు.