వరంగల్, జూలై 4(నమస్తే తెలంగాణ ప్రతినిధి) : తెలంగాణను దమ్మారా తడపాలని సంకల్పించిన రాష్ట్ర ప్రభుత్వం, ఆ మేరకు ‘కాళేశ్వరం’ ద్వారా విజయం సాధించింది. కరువు నేలలను సైతం మాగాణంలా మార్చింది. నాడు ‘వానలెప్పుడు పడుతయా?’ అని ఎదురుచూడాల్సిన పరిస్థితుల నుంచి నేడు మొగులు వైపు రైతులు చూడనవసరం లేకుండా చేసింది. వర్షాభావ పరిస్థితులు నెలకొన్నా కాళేశ్వరం నీళ్లను ప్రతి ఎకరాకూ పారించేందుకు చర్యలు చేపట్టింది. ప్రస్తుతం మహదేవపూర్ మండలంలోని కన్నెపల్లి (లక్ష్మీ) పంప్హౌస్ నుంచి ఆరు మోటర్ల ద్వారా నీటిని ఎత్తిపోస్తున్నది. గ్రావిటీ కాల్వ ద్వారా జలాలు అన్నారం (సరస్వతి) బరాజ్వైపు తరలుతున్నాయి. త్వరలోనే లోయర్ మానేరుకు చేరి అక్కడి నుంచి ఉమ్మడిజిల్లాకు నీటి విడుదల కానుండగా రైతుల్లో సాగు భరోసా కనిపిస్తున్నది.
‘మన నీళ్లు మనకే నినాదం’ సాకారమైంది. బీఆర్ఎస్ ప్రభుత్వ ప్రణాళికతో ఎక్కడ చూసినా నీళ్లే కనబడుతున్నాయి. తాగేందుకు నీళ్లు లేని పరిస్థితి నుంచి నడి ఎండకాలంలోనూ ఎక్కడ చూసినా నీళ్లే అనేలా మారింది. తెలంగాణ రాష్ట్ర సాకారం, సీఎం కేసీఆర్ విజన్తో ఇది సాధ్యమైంది. అభివృద్ధిలో కీలకమైన వ్యవసాయరంగాన్ని బలోపేతం చేసే చర్యల్లో భాగంగా బీఆర్ఎస్ ప్రభుత్వం సాగునీటి రంగానికి అధిక ప్రాధాన్యత ఇచ్చింది. కాళేశ్వరం ప్రాజెక్టును వేగంగా పూర్తి చేసి ప్రపంచానికి ఆదర్శంగా తెలంగాణ నిలిచింది. ఇప్పుడు ఏటా రెండు పంటలు సులభంగా సాగుచేసే పరిస్థితి వచ్చింది. కాళేశ్వరం ద్వారా లోయర్ మానేరు డ్యాం నుంచి వర్ధన్నపేట మండలం ఇల్లంద వరకు మొదటి దశలో 5,05,725 ఎకరాల ఆయకట్టుకు, రెండో దశ పరిధిలో ఇల్లంద తర్వాత నుంచి సూర్యాపేట జిల్లా తిరుమలగిరి వరకు 3,65,000 ఎకరాల ఆయకట్టుకు నీరందుతుంది. రెండు దశల్లో మొత్తం 8.70 లక్షల ఆయకట్టుకు సాగునీరు సరఫరా అవుతున్నది. కాగా వరంగల్ పాత జిల్లాలో మొత్తం 4,72,287 ఎకరాలకు కాళేశ్వరం నీళ్లు అందుతున్నాయి.
జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలం మేడిగడ్డ(లక్ష్మీ) బరాజ్కు సోమవారం రాత్రి వరకు 20వేల క్యూసెకుల ఇన్ఫ్లో రావడంతో నీటి నిల్వ 5.52 టీఎంసీలకు చేరింది. మంగళవారం నాటికి 6.154 టీఎంసీలకు పెరిగింది. దీంతో కన్నెపల్లి (లక్ష్మీ) పంప్హౌస్ నుంచి ఇదే మండలంలోని అన్నారం(సరస్వతి) బరాజ్కు ఆరు మోటర్ల ద్వారా ఎత్తిపోతలు నిర్విరామంగా కొనసాగుతున్నాయి. ప్రస్తుతం అన్నారం బరాజ్లో ఆరు టీఎంసీల నీటి నిల్వ ఉన్నది. అటు నుంచి వివిధ అనుబంధ ప్రాజెక్టుల ద్వారా లోయర్ మానేరుకు కాళేశ్వరం నీళ్లు చేరి త్వరలోనే అక్కడి నుంచి కాకతీయ కాలువ ద్వారా ఉమ్మడి జిల్లాకు పారనున్నాయి. ప్రస్తుతం వర్షాభావ పరిస్థితులు నెలకొని రైతులు ఆందోళన చెందుతున్న క్రమంలో రాష్ట్ర ప్రభుత్వం నీటిని పారిస్తూ భరోసా నింపుతోంది. ప్రతి ఎకరాకు కాళేశ్వరం నీటిని పారించి పంటలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని సంకల్పించి ఆ మేరకు కార్యాచరణను అమలుచేస్తున్నది. త్వరలోనే పొలాలకు నీళ్లు అందనుండగా రైతుల్లో ధీమా వ్యక్తమవుతున్నది.