‘ఊరు చుట్టూ వరద సునామీలా వచ్చి చుట్టుముట్టింది. పిల్లలను తీసుకపోవడంలో అరగంట ఆలస్యం అయితే మునిగిన పాఠశాలలో మేమూ ఉండే వాళ్లం. ఆ భయానక సంఘటన తలుచుకుంటే ఒళ్లు జలదరించిపోతుంది. గుండె ధైర్యం చేశా. ఉదయం కాబట్టి సరిపోయింది. అదే వేగంతో వరద రాత్రివేళ వస్తే ఏంటి పరిస్థితి. ఇక వరదలోనే సజీవ సమాధి అయ్యేవాళ్లం. అదృష్టం బాగుండి పిల్లలు, నేను బయటపడ్డాం’ అని ములుగు జిల్లా ఏటూరునాగారం మండలం కొండాయి గిరిజన ఆశ్రమ పాఠశాల పాయం మీనయ్య అప్పటి ప్రత్యక్ష అనుభవాన్ని పంచుకున్నారు. గత నెల 27న వచ్చిన వరదల సమయంలో ఆయన అప్రమత్తమై చూపిన తెగువ, ధైర్యసాహసాలు 40మంది పిల్లలను కాపాడాయి. ఈ సందర్భంగా వరదలను ఎదుర్కొన్న తీరును ఆయన ‘నమస్తే తెలంగాణ’కు వివరించారు.
– ఏటూరునాగారం, ఆగస్టు 9
ఉదయం ఎనిమిది గంటలు అవుతోంది. అప్పటికే వరద నెమ్మదిగా ఊరు చివరలోని ఎస్సీకాలనీలోకి చేరుతోంది. అయితే ఊరిలోకి వరద వస్తుందా అనుకున్నా. ఉదయమే దొడ్ల వాగు దగ్గరికి వెళ్లి పరిస్థితిని గమనించా. వరద పెరుగుతున్నట్లు కన్పించింది. పాఠశాలకు వచ్చి ఉదయం 8గంటల విద్యార్థులకు టిఫిన్ పెట్టించా. కొద్దిసేపటికే వరద ఎక్కువైంది. ఇక ఆలస్యం చేయడం మంచిది కాదని పాఠశాలలో ఉన్న 40పిల్లలను బయటకు తీసుపోవాలని నిర్ణయించుకున్నా. పాఠశాలలో ఉన్న ఇద్దరు వర్కర్లను పురమాయించా. పాఠశాల గదులకు తాళాలు వేయకుండా హుటాహుటినా విద్యార్థులను నడిపించుకుంటూ అర కిలోమీటర్ దూరంలో మల్యాలలోని మా ఇంటికి తీసుకెళ్లా. అదే సమయంలో వరద పెరిగింది. మోకాళ్ల లోతు వరకు వరద వచ్చింది. పిల్లలను జాగ్రత్తగా ఇంటికి చేర్చాను.
ఇక పాఠశాల గదులకు తాళాలు వేసేందుకు మళ్లీ వర్కర్లతో కలిసి వెనుదిరిగా, ఈలోగా వరద ఇంకా ఎక్కువైంది. మల్యాల-కొండాయి దారిలో ఉన్న రోడ్డుపై కొత్తగా వేసిన పైపు కల్వర్టు వద్ద వేగం పెరిగింది. దాటి వెళ్లలేకపోయాను. వర్కర్లు వేగంగా వెళ్లి గదులకు తాళం వేసి వచ్చారు. ఇక ఎలాగోలా ఇంటికి చేరుకున్నా. మధ్యాహ్నం అయింది. పిల్లలకు అన్నం పెట్టే సమయమైంది. నా భార్య ఆరోగ్యం బాగా లేక వరంగల్లో హాస్పిటల్లో ఉంది. అయితే మధ్యాహ్నం భోజనం అందించే వర్కర్తో ఇంట్లో ఉన్న బియ్యం, కూరగాయలతో వంట చేయించి పెట్టించిన. పిల్లలు బయటకు రాకుండా జాగ్రత్తపడ్డాను. ఈలోగా కొండాయి అంతా గందరగోళంగా మారింది. హాహాకారాలు మొదలయ్యాయి. కొట్టుకుపోయే వారు కొట్టుకుపోతున్నారు. అందులోంచి కొందరు ధైర్యం చేసి బయటపడుతున్నారు. వాగు వరద ఉప్పెనలా వచ్చి ముంచెత్తింది.
ఏటూరునాగారం : ఆదివాసీ దినోత్సవం సందర్భంగా బుధవారం హైదరాబాద్లోని గిరిజన భవన్లో కొండాయి హెచ్ఎం మీనయ్యను గిరిజన సంక్షేమశాఖ మంత్రి సత్యవతి రాథోడ్, గిరిజన సంక్షేమశాఖ కమిషనర్ క్రిస్టినా జడ్ చోంగ్తూ ఘనంగా సన్మానించారు. జ్ఞాపిక అందచేసి అభినందించారు. గత నెల 27న కొండాయిలో వరదలు సంభవించగా పాఠశాలలో ఉన్న విద్యార్థులు వరద ముంపు బారిన పడకుండా తన ఇంటికి తీసుకెళ్లి కాపాడినందుకు ఆయనకు రాష్ట్ర ప్రభుత్వం అవార్డు ప్రకటించింది. మీనయ్యను ఘనంగా సన్మానించాలని మంత్రి కేటీఆర్ ఆదేశించిన నేపథ్యంలో ప్రభుత్వం తరపున మంత్రి సత్యవతి సన్మానించారు.
తెలంగాణ ప్రభుత్వం నాకు అవార్డు ప్రకటించడం ఆనందంగా ఉంది. మంత్రి కేటీఆర్ ట్విట్టర్లో అభినందించడాన్ని ముందుగా నమ్మలేకపోయాను. పిల్లలను కాపాడుకోగలిగాను అనే సంతృప్తి కలిగింది. ఇక కొంచెం బాధ్యత కూడా పెరిగింది. నా జీవితంలో ఇలాంటి అవార్డు లభిస్తుందని ఊహించలేదు. ఆగస్టు 15న అవార్డు అందిస్తారనే విషయం పత్రికల్లో చూశాను. ప్రభుత్వం స్పందించిన తీరుకు కృతజ్ఞతలు.
ఆ రోజు రాత్రి విద్యార్థులందరికీ దుప్పట్లు ఇచ్చి పడుకోబెట్టాను. 28న ఉదయం వరద తగ్గింది. ఉదయం లేవగానే పిల్లలకు ముఖాలు కడిగించి మళ్లీ టిఫిన్ పెట్టించి, మధ్యాహ్న భోజనానికి ఏర్పాటుచేశాను. అక్కడినుంచి పాఠశాలకు వెళ్లాను. నా కంటే ఎక్కువ ఎత్తులో వరద పాఠశాలను ముంచేసింది. మొదటి స్లాబు వరకు వచ్చిన కిటికీలకు అంటిన మట్టి చెబుతోంది. అప్పుడనుకున్నా ఇక్కడ ఉంటే మేమంతా ఆగమయ్యేటోళ్లమని. పాఠశాల ఫర్నిచర్, రికార్డులు, కూరగాయలు, బియ్యం, ఇతర నిత్యావసర వస్తువులు, పిల్లల దుస్తులు, బ్యాగులు, పుస్తకాలు, కంప్యూటర్లు అన్నీ మునిగి పోయాయి. గదులన్నీ కూడా బురదతో నిండాయి. పరిస్థితి తీవ్రతను గుర్తించాను. వెంటనే ఇక్కడికి వచ్చే వాతావరణం కన్పించలేదు. పిల్లల్లో వాగు అవతలి వైపున దొడ్ల, కొత్తూరు, మల్యాల గ్రామాలకు చెందిన వారు కూడా ఉన్నారు. ధైర్యం చెప్పాను. విద్యార్థుల తల్లిదండ్రులకు తమ పిల్లల సమాచారం తెలియకుండా పోయింది. ఇక 29న ఉదయం పిల్లల తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చాను. వారు వాగు దగ్గరికి వచ్చారు. వారి పిల్లలు జాగ్రత్తగా ఉన్నారనే విషయం తెలుసుకుని ఊపిరి పీల్చుకున్నారు. నెమ్మదిగా పిల్లలను వారి తల్లిదండ్రులకు అప్పగించా. ఇక కొద్దిగా ధైర్యం వచ్చింది.
1986లో జంపన్నవాగు వరద ఎక్కువగా వచ్చి కొండాయి ఊరును ముంచెత్తింది. నేను అప్పుడు ఇంటర్ చదువుతున్నా. సెలవులు ఉంటే ఇంటికి వచ్చాను. అప్పుడు వచ్చిన వరద ఊరిని ముంచేసింది. అప్పుడు గ్రామస్తులంతా సర్వం కోల్పోయారు. ఊరితో పాటు బడి కూడా మునిగింది. నేను ఇదే పాఠశాలలో ఐదో తరగతి వరకు చదువుకున్నాను. మొన్న వచ్చిన వరదలతో 1986 నాటి సంఘటన గుర్తుకొచ్చింది. అప్పటికంటే ఈసారి వరద ఎక్కువ స్పీడుగా ఉంది. ఊరు పక్క నుంచి వెనక్కి పోయి మల్యాల-కొండాయి మధ్య నుంచి వరద చుట్టుముట్టింది. దీంతో వరద దెబ్బ కొండాయికి ఎక్కువగా తాకింది.