కరోనా మహమ్మారిని కేవలం మన శరీరంలోని సాధారణ విటమిన్లు నిలువరిస్తాయంటున్నారు వైద్య నిపుణులు. ఇందులో, భాగంగానే కరోనా ఫస్ట్ వేరియంట్ సమయంలో విటమిన్ ‘డీ’ లోపం గల వారిపైననే వైరస్ ప్రభావం తీవ్రంగా ఉంటుందని, స్వదేశంతో పాటు విదేశీ వైద్య నిపుణులు సైతం వాదించారు. ఈ విషయమై పలు కేసులను సైతం అప్పట్లో అధ్యయనం చేశారు. విటమిన్ ‘డీ’ లోపం ఉన్నవారే ఎక్కువగా వైరస్ బారిన పడటం, విటమిన్ స్థాయి అతి తక్కువగా ఉన్నవారే వైరస్కు సంబంధించి తీవ్రమైన లక్షణాలు ఎదుర్కొన్నట్లు వైద్యులు జరిపిన అధ్యయనాల్లో తేలింది. దీనిపై నిమ్స్, గాంధీ వైద్యులు సంయుక్తంగా విటమిన్ ‘డీ’పై ప్రత్యేక పరిశోధనలు జరిపారు. విటమిన్ ‘డీ’తో కరోనా రోగులకు ఉపశమనం కలిగించవచ్చని నిమ్స్ ఆర్ధోపెడిక్ విభాగం వైద్యనిపుణులు డాక్టర్ మహేష్రెడ్డి ఇటీవలే వెల్లడించారు.
వైరస్ సోకిన వారికి విటమిన్ ‘డీ’ని సిరప్ రూపంలో అందించి చికిత్స చేయడం ఒక ఎత్తైతే.., విటమిన్ ‘డీ’ తగినంత ఉన్నవారికి వైరస్ నుంచి ముప్పు తప్పినట్లే అంటున్నారు వైద్య నిపుణులు. అంటే, తగినంత స్థాయిలో విటమిన్ ‘డీ’ ఉంటే వైరస్ సోకే అవకాశాలు చాలా తక్కువ అని, ఒకవేళ వైరస్ సోకినా పెద్దగా లక్షణాలు ఉండవని చెబుతున్నారు. విటమిన్ ‘డీ’లో రోగ నిరోధక శక్తిని పెంచే గుణాలుంటాయి. అంటే.. ‘డీ’ విటమిన్ సమపాళ్లలో ఉంటే శరీరంలో తగిన ప్రతి రక్షకాలు ఉంటాయని వైద్య పరిశోధకులు అంటున్నారు. ప్రస్తుతం ఇస్తున్న కరోనా టీకా వల్ల కూడా శరీరంలో యాంటీబాడీలు ఉత్పన్నమై రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. ఈ రోగనిరోధక శక్తి అనేది స్వతహాగా విటమిన్ ‘డీ’తో కూడా పొందవచ్చంటున్నారు నిపుణులు. సాధారణంగా ప్రతి వ్యక్తిలో 30 నానోగ్రామ్/ఎంఎల్ నుంచి 100 నానోగ్రామ్ వరకు డీ-విటమిన్ ఉండాలి. కానీ, దాదాపు 90 నుంచి 94 శాతం మందిలో విటమిన్-‘డీ’ 30 నానోగ్రామ్ కంటే తక్కువనే ఉంటున్నట్లు ఇటీవలే నిమ్స్ వైద్యులు వెల్లడించారు. దీని వల్లనే చాలా మంది కరోనా వైరస్కు గురవుతున్నట్లు వైద్యులు చెబుతున్నారు.
వాతావరణ కాలుష్యం, జీవన విధానం వల్ల చాలా మందిలో విటమిన్ ‘డీ’ లోపం ఉంటుంది. మరో రకంగా చెప్పాలంటే ఈ సమస్య సర్వసాధారణమైపోయింది. ఒక వ్యక్తిలోని ప్రతి మిల్లీ లీటర్ల రక్తంలో కనీసం 30 నానోగ్రామ్ల ‘డీ’ విటమిన్ ఉండాల్సి ఉండగా, చాలా మందిలో 10 నానోగ్రామ్స్లోపు ఉంటున్నట్లు నిపుణులు చెబుతున్నారు. విటమిన్ ‘డీ’ అనేది సాధారణంగా కొన్ని రకాల ఆహార పదార్ధాలతో పాటు సూర్యరశ్మి ద్వారా పుష్కలంగా అందుతుంది. ఆహారపు అలవాట్లు, ఎక్కువగా ఏసీ కార్లలో తిరగడం, సూర్మరష్మిలోకి రాకపోవడం తదితర కారణాలతో ఈ సమస్య ఏర్పడుతుందంటున్నారు వైద్యులు. అయితే, విటమిన్ ‘డీ’ కనీసం 30 నానోగ్రామ్/ఎంఎల్ కంటే ఎక్కువగా ఉన్నవారికి కరోనా వైరస్ నుంచి ముప్పు తప్పినట్లేనని నిమ్స్ హాస్పిటల్ అసోసియేట్ ప్రొఫెసర్ ఆఫ్ ఆర్థోపెడిక్, డాక్టర్ మహేశ్ లక్కిరెడ్డి తెలిపారు.
కరోనా నిబంధనలను పాటించని వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని సైబరాబాద్ పోలీసు కమిషనర్ సజ్జనార్ హెచ్చరించారు. సైబరాబాద్, రాచకొండ పోలీసు కమిషనరేట్ పరిధిలో స్పెషల్ డ్రైవ్ను నిర్వహిస్తామన్నారు. మాస్కులు ధరించని వారికి చట్టప్రకారం రూ.వెయ్యి జరిమానా విధిస్తామన్నారు.