న్యూఢిల్లీ: భారత ప్రధాని నరేంద్ర మోదీకి వెస్టిండీస్ స్టార్ ఆల్రౌండర్ ఆండ్రూ రస్సెల్ ధన్యవాదాలు తెలిపారు. జమైకాకు భారత్ నుంచి కరోనా వ్యాక్సిన్లు పంపించినందుకు రస్సెల్ ప్రధానికి థాంక్స్ చెప్పారు. వ్యాక్సిన్ మైత్రిపై రస్సెల్ ప్రశంసలు కురిపించినట్లు ఆదేశంలోని భారత్ హైకమిషన్ పేర్కొంది.
‘ముందుగా ప్రధాని మోదీ, భారత హైకమిషన్కు కృతజ్ఞతలు చెప్పాలనుకుంటున్నా. కరోనా వ్యాక్సిన్లు ఇక్కడికి వచ్చాయి. మేమంతా చాలా సంతోషంగా ఉన్నాం. ప్రపంచమంతా మళ్లీ సాధారణ స్థితికి వస్తోంది. జమైకా ప్రజలు దీన్ని నిజంగా అభినందిస్తున్నారు. భారత్, జమైకా ఇప్పుడు సోదర దేశాలు. అందరూ శాంతియుతంగా, సురక్షితంగా ఉండండి’ అంటూ రస్సెల్ ఓ వీడియో సందేశంలో పేర్కొన్నాడు. ఆ వీడియోను జమైకాలోని భారత హైకమిషన్ తన ట్విటర్లో పోస్ట్ చేసింది. ఈ నెల ఆరంభంలో 50వేల కరోనా వ్యాక్సిన్ డోసులను భారత ప్రభుత్వం జమైకాకు పంపించినందుకు ఆదేశ ప్రధాని ఆండ్రూ హోల్నెస్ ధన్యవాదాలు తెలిపారు.