ఆ గ్రామంలో వీధులన్నీ సీసీ రోడ్లతో పరిశుభ్రంగా దర్శనమిస్తున్నాయి. ప్రతి ఇంటికీ తాగునీరు అందుతున్నది. హరితహారం మొక్కలు ఏపుగా పెరిగి ఆహ్లాదాన్ని పంచుతున్నాయి. వైకుంఠధామం, డంపింగ్యార్డు, కంపోస్టు షెడ్డు నిర్మాణం పూర్తయ్యాయి. గ్రామపంచాయతీగా ఏర్పాటైన రెండేళ్లలోనే అభివృద్ధిలో దూసుకు పోతున్నది హాలియాకు సమీపంలో ఉన్న మదారిగూడెం.
2018లో నూతన గ్రామపంచాయతీగా అవతరించింది మదారిగూడెం. గ్రామానికి మొదటి సర్పంచ్గా ఎన్నికైన కుందారపు సైదులు పాలకవర్గం, కార్యదర్శి సహకారంతో రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న నిధులను సక్రమంగా ఖర్చు చేస్తూ అభివృద్ధిలో ముందుంచుతున్నారు. రెండేండ్లుగా గ్రామపంచాయతీకి రాష్ట్ర ప్రభుత్వం రూ.33 లక్షలు కేటాయించింది. రూ.10 లక్షలతో ట్రాక్టర్, ట్రాలీ, ట్యాంకర్ కొనుగోలు చేశారు. రూ.4 లక్షలతో 30, 10 రోజుల ప్రణాళిక అమలు చేశారు. లక్ష రూపాయలతో హరితహారం మొక్కలు పెంచుతున్నారు. రూ.3 లక్షలతో పల్లె ప్రకృతివనం, రూ.11.60 లక్షలతో వైకుంఠధామం, రూ.2.5 లక్షలతో కంపోస్టు షెడ్డు నిర్మించారు. లక్ష రూపాయలతో వీధిలైట్ల ఏర్పాటు, రూ.5 లక్షలతో డ్రైనేజీల నిర్మాణం, రూ.1.5లక్షలతో తాగునీటి పైప్లైన్ ఏర్పాటు చేశారు.
రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన పల్లె ప్రగతి కార్యక్రమం ద్వారా గ్రామ రూపురేఖలు పూర్తిగా మారిపోయాయి. ముఖ్యంగా పచ్చదనం, పరిశుభ్రతకు అధిక ప్రాధాన్యత ఇచ్చారు. హరితహారం కింద విరివిగా మొక్కలు నాటడంతో పాటు వాటి సంరక్షణకు చర్యలు తీసుకుంటున్నారు. గ్రామ పంచాయతీ ట్రాక్టర్ సాయంతో ప్రతిరోజూ ఇండ్ల నుంచి చెత్తను సేకరించి డంపింగ్ యార్డుకు తరలిస్తున్నారు. ప్రతి వీధిలో మురుగు కాల్వలు ఏర్పాటు చేయడంతో పాటు రోజూ వాటిని శుభ్రం చేస్తున్నారు. ఫలితంగా వీధులన్నీ పరిశుభ్రంగా దర్శనమిస్తున్నాయి. దీంతో జిల్లా యంత్రాంగం మదారిగూడేన్ని ఉత్తమ పంచాయతీగా గుర్తించి జనవరి 26న సర్పంచ్, కార్యదర్శికి ప్రశంసాపత్రం అందించింది.
పల్లె ప్రగతి కార్యక్రమంలో భాగంగా గ్రామంలో కరెంట్ కష్టాలు దూరమయ్యాయి. కిందికి వేలాడుతున్న విద్యుత్ తీగలను సరి చేసేందుకు అదనంగా 20 స్తంభాలను ఏర్పాటు చేశారు. దీంతో పాటు శిథిలావస్థకు చేరిన వాటి స్థానంలో మరో 15 స్తంభాలను, వాటికి వీధిలైట్లు ఏర్పాటు చేశారు. కరెంటు కష్టాలు తీరడంతో ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.