చిన్నారులకు ఆన్లైన్ బోధన
విద్యాభివృద్ధికి ‘రీడ్ ఎలాంగ్’ యాప్
ఒకటి, రెండు తరగతులకు ప్రయోజనం
పదాలను ఎలా పలకాలో వివరిస్తున్న దియా(బొమ్మ)
ఆఫ్లైన్లోనూ యాప్ వినియోగం
భూపాలపల్లి రూరల్, ఆగస్టు 13: కరోనా నేపథ్యంలో ఒకటి, రెండు తరగతులకు కూడా ప్రభుత్వం ఆన్లైన్ విద్యాబోధనను ప్రారంభించింది. సాధారణంగా విద్యార్థులు ఆటపాటలంటే ఆసక్తి చూపిస్తారు. దీన్ని ఆధారంగా చేసుకొని రూపొందించిందే ‘రీడ్ ఎలాంగ్’ యాప్. దీన్ని వినియోగించుకునేలా చూడాలని ఉపాధ్యాయులకు రాష్ట్ర విద్యాశాఖ సూచించింది. ఈ యాప్ ద్వారా చిన్నారులు ఇంటి వద్దే ఉంటూ తెలుగు, ఆంగ్లంతో పాటు లెక్కల్ని సులువుగా నేర్చుకోవచ్చు. ఇందులో దియా(బొమ్మ) పదాలు, వాక్యాలు చదవడం వంటివి చేయిస్తుంది.
కరోనా మహమ్మారి నేపథ్యంలో 3 నుంచి ఆపై తరగతుల విద్యార్థులు టీశాట్, టీవీల్లో వచ్చే పాఠాలు వింటున్నారు. కానీ, గతేడాది మార్చి నెల నుంచి ఒకటి, రెండు తరగతు ల చిన్నారులు ఇంటి వద్దే ఉంటున్నారు. ఈ క్రమంలో విద్యా సంవత్స రం నష్టపోకుండా ప్రభుత్వం ఆగస్టు 1వ తేదీ నుంచి ఒకటి, రెండు తరగతి విద్యార్థులకు కూడా ఆన్లైన్ తరగతులను ప్రారంభించింది. సర్కారు ఆదేశాల మేరకు జిల్లా విద్యాశాఖ అధికారులు రీడ్ ఎలాంగ్ (బోలో) యాప్ను తెరపైకి తీసుకొచ్చారు. ఈ యాప్ ద్వారా ఒకటి, రెండు తరగతుల విద్యార్థులకు భాషా పఠనా నైపుణ్యాన్ని మెరుగుపరచ డానికి శ్రీకారం చుట్టారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో 323 ప్రాథమిక పాఠశాలలు ఉండగా, ఒకటో తరగతిలో 3573 మంది, రెండో తరగతిలో 5178 మంది విద్యార్థులు ఉన్నారు.
రీడ్ ఎలాంగ్(బోలో) యాప్
గూగుల్ ప్లేస్టోర్లోకి వెళ్లి రీడ్ ఎలాంగ్(బోలో) యాప్ను డౌన్లోడ్ చేసుకోవాలి. ఆ తర్వాత భాషను ఎంచుకొని కథల ప్రపంచంలోకి అడుగు పెట్టవచ్చు. తరగతి సామర్థ్యానికి సరిపోయే ఆటలు ఇందులో ఉన్నాయి. ఈ యాప్లోని రీడింగ్ సహాయకురాలు దియా(బొమ్మ) పదాలను ఎలా పలకాలో చెబుతుంది. చిన్నారులు చదవడం, రాయడం నేర్చుకోవడానికి సహాయపడుతుంది. విద్యార్థులు పఠన సమయంలో ఇబ్బంది ఎదురైనప్పుడు దియా సహాయం కోరితే వారి తప్పులను సరిచేస్తుంది. ఇందుకు విద్యార్థులకు ఆయా పదాలపై టచ్ చేయాల్సి ఉంటుంది. తద్వారా విద్యార్థులు సొంతంగా పఠనా నైపుణ్యాలను పెంచుకోగలుగుతారు. ఈ యాప్ ఇంటర్ నెట్ అవసరం లేకుండా ఆఫ్లైన్లో కూడా పని చేస్తుంది. ఒకటి, రెండు తరగతుల విద్యార్థులకు సంబంధించిన పాఠ్యపుస్తకాల్లోని కథలు ఈ యాప్లో నిక్షిప్తం చేశారు.
యాప్ వల్ల లాభాలు.
పఠనా నైపుణ్యంతోపాటు యాప్లో పద వినోదం, బెలూన్లను పేల్చడం వంటి ఆటల ద్వారా క్రీడా పద్ధతిలో నేర్చుకోవచ్చు. దియా సహాయంతో విద్యార్థులు పఠనా నైపుణ్యాన్ని మెరుగుపరుచుకోవచ్చు.
సద్వినియోగం చేసుకోవాలి
ఒకటి, రెండు తరగతుల విద్యార్థుల తల్లిదండ్రులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. పఠనా నైపుణ్యాన్ని మెరుగుపర్చుకోవడమే కాకుండా యాప్లో పద వినోదం, బెలూన్లను పేల్చడం వంటి ఆటల ద్వారా క్రీడా పద్ధతిలో నేర్చుకోవడానికి ఆస్కారం ఉంటుంది. పాఠాలు వినే క్రమంలో విద్యార్థులకు పదాలు పలకడం రాకపోతే కావాల్సిన పదంపై వేలితో నొక్కితే దియా అనే అమ్మాయి ఆ పదాన్ని పలుకుతుంది.