ములుగు, జయశంకర్ భూపాలపల్లిలో మాత్రం ఒక్కొక్కటే..
పల్లె ప్రగతి పనుల ఆధారంగా గుర్తింపు
40 మార్కుల ప్రాతిపదికన జాబితా
మెరుగైన పనితీరు ఉంటే ఉత్తమ జీపీలు
ఎక్కువ మెరుగైన జీపీలుంటే ఉత్తమ మండలాలు
చెత్త జీపీల జాబితాలో నిర్లక్ష్యపు ఊర్లు
వాటిపై ప్రత్యేక దృష్టి పెట్టాలని కలెక్టర్లకు ఆదేశాలు
వరంగల్, జూలై 4 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : స్వచ్ఛత, పచ్చదనం, మెరుగైన జీవన ప్రమాణాల కోసం రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పల్లె ప్రగతిని సద్వినియోగం చేసుకుంటూ అత్యధిక గ్రామాలు తమ రూపురేఖలనే మార్చుకుంటుంటే కొన్ని ఊర్లు అంతులేని నిర్లక్ష్యంతో ఇంకా దారిద్య్రంలోనే మగ్గుతున్నాయి. రెండు విడుతల కార్యక్రమం అనంతరం పంచాయతీల ప్రగతిపై దృష్టిపెట్టిన సర్కారు, పనితీరు బాగున్న గ్రామాలకు అవార్డులు ఇవ్వడంతో పాటు బాగాలేని వాటిని గుర్తించి గాడిన పెట్టాలని నిర్ణయించింది. ఈమేరకు అధికారయంత్రాంగం జిల్లాలవారీగా మూడు ఉత్తమ పంచాయతీలను, మూడు చెత్త ఊర్లను.. అలాగే మూడు ఉత్తమ మండలాలను, మూడు చెత్త మండలాలను గుర్తించింది. అభివృద్ధిలో వెనుకబడిన ఊర్లు, మండలాల్లో పనులను సత్వరమే పూర్తి చేసేందుకు స్వయంగా కలెక్టర్లే చొరవ చూపాలని ప్రభుత్వం ఆదేశించింది.
ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న పల్లె ప్రగతి.. ఊర్ల దారిద్య్రాన్ని రూపుమాపుతున్నది. సమగ్ర వికాసం వైపు నడిపిస్తున్నది. ప్రభుత్వం ఇచ్చే నిధులను గ్రామ అవసరాల ప్రాతిపదికగా ప్రణాళికతో ఖర్చు చేసే ఊర్లలో అద్భుతాలు ఆవిష్కృతమవుతున్నాయి. పారిశుధ్య నిర్వహణ ఇప్పుడు సాధారణ ప్రక్రియగా మారింది. ప్రతి ఊరు శుభ్రంగా మారడంతో పాటు పచ్చదనం వెల్లివిరుస్తున్నది. 2019 సెప్టెంబర్లో మొదలైన ‘పల్లె ప్రగతి’తో గ్రామాల స్వరూపమే మారిపోతున్నది. ప్రభుత్వ నిధులు, అంకితభావంతో పనిచేసే ప్రజాప్రతినిధులకు తోడు ప్రజలు స్వచ్ఛందంగా కలిసి వస్తుండడంతో ఊర్లు కొత్తశోభను సంతరించుకుంటున్నాయి. ఇలా అత్యధిక శాతం గ్రామాలు తమ అవసరాలను గుర్తించి, ప్రణాళికలు వేసుకుని పనులు చేసుకుంటున్నాయి. వైకుంఠధామాలు, పల్లె ప్రకృతి వనాలు, డంప్ యార్డులు, పారిశుధ్య నిర్వహణకు ట్రాక్టర్ల కొనుగోలు, హరితహారం చక్కగా అమలవుతున్నాయి. 90శాతానికి పైగా గ్రామాల్లో పనులు వేగంగా పూర్తయినా, కొన్ని ఊర్లలో మాత్రం భిన్నమైన పరిస్థితులు ఉన్నాయి. రాజకీయ ఆధిపత్యం, స్థానికంగా గ్రూపులు, అంకితభావం లేకపోవడం, అధికారుల పర్యవేక్షణ లేమితో అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శని అన్నట్లుగా కొన్ని ఊర్లు ‘ప్రగతి’కి దూరంగా మగ్గుతున్నాయి.
‘ప్రగతి’ అమలుతో గుర్తింపు
రెండు విడుతల పల్లె ప్రగతి అమలు అనంతరం ప్రభుత్వం గ్రామాల్లో పనితీరుపై ప్రత్యేక దృష్టి పెట్టింది. బాగున్న పంచాయతీలను గుర్తించి, అవార్డులు ఇవ్వడంతో పాటు బాగాలేని వాటిని గుర్తించాలని నిర్ణయించింది. పంచాయతీరాజ్ శాఖ ఆధ్యరంలోని అధికారుల బృందాలు గ్రామాలను పరిశీలించి, పారిశుధ్య మార్కులు నమోదు చేస్తున్నారు. వీటి ఆధారంగా రాష్ట్ర ప్రభుత్వం ఉత్తమ, చెత్త పంచాయతీలను గుర్తిస్తున్నది. ఎక్కువ ఉత్తమ పంచాయతీలు ఉన్న వాటిని ఉత్తమ మండలాలుగా పేర్కొంటున్నది. పల్లె ప్రగతిలో నిర్లక్ష్యంగా వ్యవహరించే ఎక్కువ జీపీలున్న వాటిని చెత్త మండలాలుగా గుర్తిస్తున్నది. ఇలా గుర్తించడంతోపాటు ఆయా జిల్లా యంత్రాలకు ఈ సమాచారాన్ని అందిస్తున్నది. చెత్త పంచాయతీల్లో వీలైనంత త్వరగా పెండింగ్ పనులు పూర్తి చేసి, ఆ జాబితా నుంచి మారేలా చేయాలని సూచిస్తున్నది. చెత్త గ్రామాలపై కలెక్టర్లు ప్రత్యేక దృష్టి పెట్టాలని ఆదేశించింది. రెండో విడుత పల్లె ప్రగతి అనంతరం చెత్త పంచాయతీలుగా ఉన్న వందల గ్రామాలు ఇప్పుడు ప్రగతి పనులు పూర్తి చేసుకున్నాయి. ఇప్పటికీ కొన్ని ఊర్లలో అభివృద్ధి ప్రయాణం మొదలుకావడంలేదు. ఇలాంటివన్నీ చెత్త పంచాయతీలుగానే ఉంటున్నాయి. ములుగు, భూ పాలపల్లి జిల్లాల్లో చెత్త గ్రామాల జాబితా తగ్గిపోయింది. పారిశుధ్య మార్కుల ఆధారంగా చూస్తే ఒక్కో గ్రామాలే అక్కడ చెత్త జీపీలుగా ఉన్నాయి. వరంగల్ అర్బన్, వరంగల్ రూరల్, మహబూబాబాద్, జనగామ జిల్లాల్లో మాత్రం ఉత్తమ, చెత్త పంచాయతీలు మూడు చొప్పున ఉన్నాయి. పల్లె ప్రగతి పనుల పురోగతి ఆధారంగా ప్రతి జిల్లాలో మూడు ఉత్తమ, మూడు చెత్త మండలాలను ప్రభుత్వం నిర్ణయించింది. భూపాలపల్లి, ములుగు జిల్లాల్లో మాత్రం చెత్త మండలాల జాబితాలో ఒక్కటి చొప్పునే ఉన్నాయి. మిగిలిన నాలుగు జిల్లాల్లో చెత్త మండలాల సంఖ్య మూడు చొప్పున ఉంది.
నాలుగో విడుతలో ప్రత్యేక దృష్టి
పల్లె ప్రగతితో గ్రామాల అభివృద్ధి వేగంగా సాధ్యమవుతుందనే అంచనాలతో రాష్ట్ర ప్రభు త్వం జూలై 1 నుంచి 10 వరకు నాలుగో విడుత కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నది. ఈ నేపథ్యంలో చెత్త పంచాయతీలు, చెత్త మండలాలపై ప్రత్యేకంగా దృష్టి పెట్టాలని కలెక్టర్లు, డీపీవోలను ఆదేశించింది. పారిశుధ్య నిర్వహణపై రాష్ట్ర ప్రభుత్వం సీరియస్గా ఉండడంతో సంబంధిత గ్రామాలపై అధికారుల పర్యవేక్షణ పెరిగింది. ప్రజలు, ప్రజాప్రతినిధులు, అధికారులు కలిసి ఊర్లను శుభ్రంగా ఉండేలా చూస్తున్నారు. ప్రభుత్వ పరంగా నిర్వహించే తనిఖీల సమాచారంతో పంచాయతీరాజ్ శాఖ గ్రామ పంచాయతీలకు పారిశుధ్య స్కోరు నమోదు చేస్తున్నది. పల్లె ప్రగతిలో అమలు చేసే ప్రధాన కార్యక్రమాల అమలు తీరు ఆధారంగా గరిష్టంగా 40 మార్కులుగా నిర్ణయించింది. ప్రతినెలా తనిఖీల సమాచారంతో ఎప్పటికప్పుడు ఉత్తమ పంచాయతీలను గుర్తిస్తున్నది. పనితీరు ఆధారంగా గుర్తింపు ఇస్తుండడంతో అన్ని పంచాయతీల్లోని పెండింగ్ పనుల్లో కదలిక వస్తున్నది. ఆయా పంచాయతీల ప్రత్యేక అధికారులుగా ఉన్న వారు ప్రతి రోజూ పర్యవేక్షిస్తున్నారు. పనులను మొదలుపెట్టించడంతో పాటు త్వరగా పూర్తయ్యేలా చూస్తున్నారు. వైకుంఠధామాలు, డంపింగ్ యార్డులు, ఇతర నిర్మాణాలు వేగంగా పూర్తవుతున్నాయి.