శాయంపేట, జూలై 28 : తనపై కావాలనే కొందరు విమర్శలు చేస్తున్నారు. అంతేకాకుండా తన పదవికి రాజీనామా చేయాలంటున్నారు, ఇది సరికాదని ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి అన్నారు. మండల కేంద్రంలోని రైతువేదికలో బుధవారం పలువురు లబ్ధిదారులకు రూరల్ జడ్పీ చైర్ పర్సన్ గండ్ర జ్యోతితో కలిసి రేషన్కార్డులు పంపిణీ చేశారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కరోనా కష్టకాలంలోనూ ఉచిత విద్యుత్తో పాటు పథకాలు అమలు చేస్తున్న ఘనత సీఎం కేసీఆర్దే అన్నారు. అలాంటి సంక్షేమ ప్రభుత్వంలో ఉన్న తనను కావాలనే కొందరు వ్యక్తులు రాజీనామా చేయాలనడం సరికాదన్నారు. దళితబంధు పథకం మొదట హుజూరాబాద్లో తర్వాత భూపాలపల్లిలో అమలు చేయనున్నట్లు తెలిపారు. చారిత్రక ప్రాధాన్యతను అనుసరించి వరంగల్, హన్మకొండ జిల్లాలను ఏర్పాటు చేయనున్నట్లు ఆయన పేర్కొన్నారు. శాయంపేట మండలాన్ని హన్మకొండ జిల్లాలో కలపాలని ప్రతిపక్షాలు ఆందోళనలు చేస్తున్నాయన్నారు. అయితే ప్రజల మనోభావాలకు అనుగుణంగా నిర్ణయం ఉంటుందన్నారు.
ఆత్మకూరు నుంచి శాయంపేట వరకు రోడ్డు విస్తరణ, డబుల్ రోడ్డు పనులకు నిధులు మంజూరయ్యాయని, త్వరలో పనులు ప్రారంభించనున్నట్లు తెలిపారు. జడ్పీ చైర్పర్సన్ జ్యోతి మాట్లాడుతూ.. రాష్ట్రంలో నాలుగు కోట్ల ప్రజలు ఉంటే కేంద్రం 53 వేల రేషన్కార్డులే ఇచ్చింది. కానీ, తెలంగాణ ప్రభుత్వం 93 లక్షల కార్డులు మంజూరు చేసిందని తెలిపారు. నల్లచట్టాలను సమర్థించే బీజేపీ నాయకులకు మాట్లా డే హక్కు లేదన్నారు. కార్యక్రమంలో సివిల్ సప్లయ్ డీఎం భాస్కర్రావు, ఎంపీపీ తిరుపతిరెడ్డి, తహసీల్దార్ హరికృష్ణ, ఎంపీడీవో కృష్ణమూర్తి, రైతుబంధు అధ్యక్షుడు ఆదిరెడ్డి, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు మనోహర్రెడ్డి, సర్పంచ్లు, ఎంపీటీసీలు, నాయకులు పాల్గొన్నారు.
ఎమ్మెల్యే గండ్రను కలిసిన అఖిల పక్షం నేతలు
మండల అఖిల పక్ష నాయకులు ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణారెడ్డి, జడ్పీ చైర్పర్సన్ గండ్ర జ్యోతిని కలిసి శాయంపేట మండలాన్ని పరకాల రెవెన్యూ డివిజన్లో కొనసాగించడంతో పాటు హన్మకొండ జిల్లాలో కలపాలని కోరారు.