వరంగల్రూరల్, ఆగస్టు 17(నమస్తేతెలంగాణ): రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన దళితబంధు చాలా గొప్ప పథకమని జిల్లా పరిషత్ సభ్యులు అన్నారు. ఈ పథకాన్ని అమల్లోకి తెచ్చిన ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావుకు ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఏకగ్రీవ తీర్మానాన్ని ఆమోదించారు. జడ్పీ చైర్పర్సన్ గండ్ర జ్యోతి అధ్యక్షతన మంగళవారం జడ్పీ సమావేశ మందిరంలో సర్వసభ్య సమావేశం జరిగింది. కలెక్టర్ ఎం హరిత, అదనపు కలెక్టర్ హరిసింగ్, జడ్పీ సీఈవో రాజారావు పాల్గొన్న ఈ సమావేశానికి నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి, జడ్పీలో టీఆర్ఎస్ ఫ్లోర్ లీడర్ పెద్ది స్వప్న, వైస్ చైర్మన్ ఆకుల శ్రీనివాస్, ఓడీసీఎంఎస్ చైర్మన్ రామస్వామినాయక్తోపాటు జిల్లాలోని జడ్పీటీసీలు, ఎంపీపీలు, అధికారులు హాజరయ్యారు.
దళితబంధు పథకంపై అపోహలొద్దు..
సీఎం కేసీఆర్ సోమవారం కరీంనగర్ జిల్లా హుజూరాబాద్లో దళితబంధు పథకాన్ని ప్రారంభించడంపై ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. ఇది బృహత్తర పథకమని, దీని అమలుపై అపొహలు, అనుమానాలు వద్దన్నారు. కేటగిరీల వారీగా అర్హులందరికీ దళితబంధు అమలు చేస్తామని, దళిత ఉద్యోగులకు సైతం ఇది వర్తిస్తుందని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారన్నారు. దళితబంధు పథకాన్ని ప్రారంభించిన సీఎం కేసీఆర్కు కృతజ్ఞతలు తెలుపుతతూ తీర్మానం చేయాలని ఎమ్మెల్యే పెద్ది సూచించారు. ఈ మేరకు వర్ధన్నపేట జడ్పీటీసీ భిక్షపతి తీర్మానాన్ని ప్రవేశపెట్టగా జడ్పీ వైస్ చైర్మన్ ఆకుల శ్రీనివాస్ బలపరిచారు. దీన్ని సమావేశం ఏకగ్రీవంగా ఆమోదించినట్లు జడ్పీ చైర్పర్సన్ గండ్ర జ్యోతి ప్రకటించారు. అనంతరం పెద్ది మాట్లాడుతూ లాభాలనిచ్చే ఆయిల్పామ్ సాగులో రైతులను ప్రోత్సహించాలన్నారు. ఉపాధిహామీ పథకం ద్వారా ఖానాపురం మండలం పాకాల చెరువు పరిధిలోని కాల్వ మరమ్మతులు చేపట్టాలన్నారు. ఇదే మండలంలో 1/70 యాక్టు పరిధిలోని మంగళవారిపేట సహా ఆరు జీపీల పరిధిలో అధికారులు వ్యవహరిస్తున్న తీరుతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. మినీ డెయిరీ యూనిట్ల లబ్ధిదారులకు బర్రెల కొనుగోలు కోసం ప్రభుత్వం అవకాశం ఇచ్చిన ఇతర రాష్ర్టాల వివరాలను అందజేయాలని, వారు కోరుకున్న రాష్ట్రంలో విడుతల వారీగా బర్రెలను కొనుగోలు చేయాలని తెలిపారు. పెద్ది స్వప్న మాట్లాడుతూ ఫీల్డ్ అసిస్టెంట్లను తిరిగి విధుల్లోకి తీసుకోవాలని, తద్వారా కార్యదర్శులపై పనిభారం తగ్గనుందన్నారు.
అధికారుల తీరుపై మండిపాటు
సమావేశంలో సభ్యులు వివిధ ప్రభుత్వ శాఖల అధికారుల తీరుపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. జిల్లాలో ఎస్సారెస్పీ, దేవాదుల ప్రాజెక్టు కాల్వల నిర్మాణంతో భూములు కోల్పోయిన రైతులు అధికారుల వైఖరి వల్ల నష్టపోతున్నారని తెలిపారు. ఉదాహరణకు కాల్వ నిర్మాణంతో రైతు ఒక సర్వే నంబర్లో తనకున్న రెండెకరాల భూమిలో ఎకరం కోల్పోతే మిగతా ఎకరానికి కూడా రైతుబంధు సాయం అందకుండా చేశారని ఎమ్మెల్యే పెద్ది సహా పలువురు జడ్పీటీసీలు, ఎంపీపీలు ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై కలెక్టర్ ఎం హరిత సమాధానం ఇస్తూ ధరణి పోర్టల్ ద్వారా ఇలాంటి సమస్యలు పరిష్కరించే ప్రయత్నం చేస్తున్నట్లు తెలిపారు.
పట్టించుకోని విద్యాశాఖ అధికారులు
గీసుగొండ మండలం కోనాయిమాకులలో ఓ రైతు పేర ఉన్న 2.17 ఎకరాల భూమిని రెవెన్యూ అధికారులు రికార్డులో నుంచి అక్రమంగా తొలగించారని ప్రజాప్రతినిధులు అన్నారు. విద్యాశాఖ అధికారులు, ఇంజినీర్ల పనితీరుపై రాయపర్తి, పరకాల ఎంపీపీలు అనిమిరెడ్డి, స్వర్ణలత, వర్ధన్నపేట, నడికూడ జడ్పీటీసీలు తీవ్ర అసంతృప్తి వెలిబుచ్చారు. పాఠశాలల్లో గదుల కొరత తీర్చేందుకు ప్రభుత్వం నిధులు మంజూరు చేస్తే ఏళ్లు గడిచినా ఇంజినీర్లు పని చేయడం లేదని, విద్యాశాఖ అధికారులు పట్టించుకోవడం లేదని ధ్వజమెత్తారు. కొన్ని పనులు మొదలుపెట్టకపోగా ప్రారంభించిన పనులను పూర్తి చేయడం లేదని విమర్శించారు. దీనిపై జడ్పీ చైర్పర్సన్ గండ్ర జ్యోతి మాట్లాడుతూ పాఠశాల గదుల నిర్మాణ పనులపై సంబంధిత అధికారులతో సమావేశం నిర్వహించాలని డీఈవో వాసంతిని ఆదేశించారు. వర్ధన్నపేట ఎంపీపీ అప్పారావు మాట్లాడుతూ చెన్నారం గ్రామంలో ఒక రైతుకు 12 ఎకరాల పట్టాభూమి ఉంటే అందులో నుంచి రెండెకరాలు తొలగించి రికార్డుల్లో ప్రభుత్వ భూమిగా పేర్కొన్నారని తెలిపారు.
ఎంపీవోలపై ధ్వజం
వివిధ మండలాల్లోని ఎంపీవోల పనితీరుపై ఎంపీపీలు ధ్వజమెత్తారు. ఎంపీవోలు నిర్లక్ష్యం వహిస్తున్నారని, గ్రామ పంచాయతీలకు బ్లీచింగ్ పౌడర్ సరఫరా చేసే కాంట్రాక్టు పనులను కూడా వారే చేస్తున్నారని పరకాల, చెన్నారావుపేట ఎంపీపీలు స్వర్ణలత, విజేందర్ ఆరోపించారు. పరకాల ఎంపీవోని బదిలీ చేయాలని మండల పరిషత్ సర్వసభ్య సమావేశం ఏకగ్రీవ తీర్మానం చేసి పంపినా ఫలితం లేదని, పైగా సదరు ఎంపీవో స్థానికంగా రాజకీయం చేస్తున్నాడని స్వర్ణలత ఆందోళన వ్యక్తం చేశారు. చెన్నారావుపేట ఎంపీవో విధులకు హాజరు కావడం లేదని, నిధుల దుర్వినియోగానికి పాల్పడుతున్నాడని విజేందర్ ఆరోపించారు. స్పందించిన కలెక్టర్ హరిత.. ఎంపీవోలు అక్రమాలకు పాల్పడినట్లు ఆధారాలు ఉంటే ఫిర్యాదు చేయాలని, అదనపు కలెక్టర్ విచారణ జరుపుతారని తెలిపారు. ఆదివారం హన్మకొండ కేడీసీ గ్రౌండ్లో జరిగిన స్వాతంత్య్ర దినోత్సవానికి హాజరైన తమను పోలీసులు వేదిక వద్దకు అనుమతించకుండా అడ్డుకున్నారని, కనీసం ప్రజాప్రతినిధులమనే గౌరవం కూడా ఇవ్వలేదని జడ్పీలో ఫ్లోర్ లీడర్ పెద్ది స్వప్న, చెన్నారావుపేట జడ్పీటీసీ పత్తినాయక్ తదితర జడ్పీటీసీలు చెప్పారు. ముఖ్యంగా పోలీసులు అడ్డుకోవడంపై నిరసన వ్యక్తం చేయగా, కలెక్టర్ మాట్లాడుతూ మరోసారి పునరావృతం కాకుండా పోలీస్ కమిషనర్ దృష్టికి తీసుకెళ్తానని చెప్పారు. జడ్పీ వైస్ చైర్మన్ శ్రీనివాస్ మాట్లాడుతూ దుగ్గొండి మండలం బిక్కోజిపల్లి గ్రామంలో ఎస్సారెస్పీ కాల్వ నిర్మాణంతో భూమి కోల్పోయి నష్టపరిహారం పొందిన ఓ రైతు అదే భూమిలో వైకుంఠధామం నిర్మాణం చేపడితే అడ్డుకుంటుండడంపై చర్యలు తీసుకోవాలన్నారు. సదరం క్యాంపుల ద్వారా పొందిన దివ్యాంగుల ధ్రువీకరణ పత్రాల గడువు ముగిసినందున తిరిగి వారికి సర్టిఫికెట్లు ఇప్పించాలని గీసుగొండ ఎంపీపీ సౌజన్య కోరారు.
జడ్పీ వరకు 16 మండలాలు
వరంగల్ రూరల్, వరంగల్ అర్బన్ జిల్లాల పేర్లు మారిన నేపథ్యంలో పర్వతగిరి జడ్పీటీసీ సింగులాల్ సహా కొందరు సభ్యులు వరంగల్ రూరల్ పేరుతో ఉన్న జిల్లా పరిషత్పై స్పష్టత ఇవ్వాలని కోరారు. దీనిపై కలెక్టర్ హరిత మాట్లాడుతూ 2019 జూలై 5న 16 మండలాలతో వరంగల్ రూరల్ జిల్లా పరిషత్ ఉత్తర్వులు వెలువడినట్లు చెప్పారు. కొద్దిరోజుల క్రితం జిల్లాల పేర్ల మార్పుతో ఈ 16 మండలాల్లోని ఐదు మండలాలను హనుమకొండ జిల్లాలో కలుపుతూ వరంగల్ జిల్లా 13 మండలాలతో ఏర్పడినట్లు 74వ జీవో వెలువడిందని ఆమె తెలిపారు. తాజా జీవో ప్రకారం జడ్పీ చైర్పర్సన్గా గండ్ర జ్యోతి కొనసాగుతారని, హనుమకొండ జిల్లాలో కలిసిన ఐదు మండలాలకు సంబంధించి వరంగల్ కలెక్టర్గా తాను వాటి సమావేశాలకు హాజరవుతానని చెప్పారు. డీఎంహెచ్వో మధుసూదన్ మాట్లాడుతూ కరోనా సెకండ్ వేవ్ ఇంకా పోలేదని, వైరస్ ఉధృతి పూర్తిగా తగ్గనందున ప్రతి ఒకరూ మాస్కు ధరించాలని, ఇప్పటికే టీకా రెండు డోసులు వేసుకున్న వారు మూడో డోస్ వేసుకోవద్దన్నారు. కరోనా మహమ్మారితో జిల్లాలో మూడుసార్లు జ్వర సర్వే నిర్వహించినట్లు చెప్పారు. డీఆర్డీవో సంపత్రావు, డీపీవో ప్రభాకర్, జిల్లా ఉద్యాన అధికారి శ్రీనివాసరావు, పశుసంవర్ధక, మత్సశాఖ జిల్లా అధికారులు బాలకృష్ణ, నరేశ్కుమార్, ఆర్అండ్బీ ఈఈ జితేందర్రెడ్డితో పాటు జిల్లాలోని అన్ని శాఖల జిల్లా అధికారులు సమావేశంలో పాల్గొన్నారు.