దేశాయిపేటలో నిన్నమొన్నటిదాకా సాదాసీదాగా ఉన్న ‘కైలాసగిరి’ ఇప్పుడు అత్యద్భుతంగా మారింది. పచ్చని చెట్లు, గుట్టలు, ఆహ్లాదకర వాతావరణంలో ఈ దివ్యక్షేత్రం అధ్యాత్మిక కేంద్రంగా రూపుదిద్దుకున్నది. గుట్టపై పార్వతీ పరమేశ్వరుల విగ్రహాలతో పాటు వారి చుట్టూ వలయాకారంలో ఏర్పాటు చేసిన వందలాది విగ్రహాలు ఆకట్టుకుంటున్నాయి. గుట్టల ప్రాంతాన్ని తొలచి రోడ్డు వేయడంతో ఇక్కడికి రోజురోజుకూ పర్యాటకులు, భక్తుల తాకిడి పెరుగుతున్నది.
పోచమ్మమైదాన్, ఫిబ్రవరి 11: వరంగల్ దేశాయిపేట ప్రాంతం పర్యాటకంగా మారింది. గతేడాది సాదాసీదాగా తయారు చేసిన ’కైలాసగిరి క్షేత్రం’ నేడు అద్భుతంగా తయారయింది. ఎక్కడో సుదూరంగా ఉన్న గిరిక్షేత్రాన్ని చూడలేని భక్తులు ఇక్కడికి తరలివచ్చి కనులారా చూసేందుకు ఏర్పాట్లు చేశారు. పచ్చని చెట్లు, గుట్టలు, ఆహ్లాదకరమైన వాతావరణం ఉట్టిపడేలా రూపుదిద్దుకుంటున్న దివ్యక్షేత్రం మహిమాన్వీతంగా ప్రణమిల్లనుంది. వరంగల్ తూర్పు ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ సహకారంతోపాటు స్వచ్ఛందంగా ముందుకొస్తున్న దాతలు, ప్రజాప్రతినిధులు, స్థానికులు కలిసి ఏర్పాటు చేస్తున్న ఈ ప్రాంతం రానున్న కాలంలో భక్తిపారవశ్యంతో వెలుగనుంది. శివరాత్రి పర్వదినం కాకుండా అన్ని పండుగలు, సాధారణ రోజుల్లో సైతం చూసేందుకు తగిన ఏర్పాట్లు చేయడానికి ప్రభుత్వం సహాయ, సహకారాలు అందించాలని స్థానికులు విజ్ఞప్తి చేస్తున్నారు. ఆలయాల అభివృద్ధికి తోడ్పాడు అందిస్తున్న తెలంగాణ ప్రభుత్వం కైలాసగిరి క్షేత్రంపై దృష్టి సారించి మరింత దివ్వక్షేత్రంగా తయారు చేయాలని కోరుతున్నారు.
దేశాయిపేట ప్రాంతానికి సమీపాన ఉన్న సాయిబాబా ఆలయం ఇప్పటికే అంచెలంచెలుగా అభివృద్ధి చెందుతూ భక్తులు ఆదరాభిమానాలు చూరగొంటున్నది. పక్కనే విశాలమైన స్థలంలో కైలాసగిరి క్షేత్రం ఏర్పాటుకు గతేడాది అంకురార్పణ చేసి, 28 అడుగుల ఎత్తైన తెల్లని రంగుతో పార్వతీ పరమేశ్వరుల విగ్రహాలను తయారు చేయించారు. అలాగే, వినాయకుడు, వీరాంజనేయుడితోపాటు మరికొన్ని విగ్రహాలను ఏర్పాటు చేశారు. గతేడాది మహాశివరాత్రి సందర్భంగా తొలిసారిగా విద్యుద్దీపాల వెలుగుల మధ్య భక్తుల పూజలు ఆరంభమయ్యాయి. ప్రత్యేకంగా శివకల్యానం జరిపించారు. ముఖ్యంగా ఇక్కడ ఆహ్లాదరకమైన వాతావరణంలో ఉన్న పార్వతీ పరమేశ్వరులను భక్తులు తనివితీరా దర్శించుకుని భక్తిని చాటుకున్నారు. అలాగే, భక్తిపూర్వకమైన సాంస్కృతిక కార్యక్రమాలు, ఇతర ప్రదర్శనలను వీక్షించి, మంచి అనుభూతిని పొందారు.
కైలాసగిరి ప్రాంతంలోని దేవదేవుల ఆశీస్సులు అందుకుంటున్న భక్తులతోపాటు మరికొంతమంది దాతలు ముందుకొస్తుండడంతో ఈ ప్రాంతం మరింత రూపుదిద్దుకుంటుంది. తెలుగు రాష్ర్టాల్లో ఉన్న ఆలయాల్లో కొలువైన విగ్రహాలన్నీ ఇక్కడే ఉన్నాయా అని తలపించేలా ఏర్పాట్లు చేశారు. ఇక్కడ చాలా వరకు గుట్టల ప్రాంతం కావడంతో వాటిని తొలచి రోడ్డుగా మార్చారు. అలాగే, ఎత్తైన ప్రాంతాల్లో ఉన్న దేవుళ్లను దర్శించుకునేందుకు మెట్లమార్గం, కొందరి దేవుళ్ల కోసం గుహలు ఏర్పాటు చేశారు. ముఖ్యంగా చుట్టూ వలయాకరంగా అష్టదిక్పాలకులతో (యక్షులు)పాటు 108 విగ్రహాలను ఏర్పాటు చేశారు. 30 ఫీట్ల కాలభైరవుడు, 21 ఫీట్ల ఆంజనేయస్వామి, ఆకట్టుకునేలా ఏడు గుర్రాలతో కూడిన సూర్యభగవానుడు, భక్తులకు ఆకర్షించే విధంగా గుట్టటపై రాముడు అభిషేకం చేస్తున్న శివలింగం ప్రతిష్ఠించారు. అలాగే, సీతారామలక్ష్మణ, భరత, శత్రఘ్నులు, సింహంపై ఆసీనుడైన ఉన్న అయ్యప్పస్వామి, లక్ష్మి, సరస్వతి, ప్రసన్నలక్ష్మి రాధాకృష్ణులు, గోపికల విగ్రహాలు భక్తుల పూజలను అందుకునేందుకు సిద్ధంగా ఉన్నాయి. ఇప్పటికే రోజూ ప్రసన్న లక్ష్మికి పూజలు చేస్తున్నారు. రానున్నకాలంలో ఒక గుహలో శ్రీలక్ష్మీనరసింహస్వామి, అమ్మవార్ల విగ్రహాలను ఏర్పాటు చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. అంతేకాకుడా ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతంలో ఉన్న దేవుళ్లను దర్శించుకునేలా నీటితో కూడిన కొలను ఏర్పాట్లు జరుగుతున్నాయి. మహా శివరాత్రి నాటికి అన్ని దేవతావిగ్రహాలు రంగులతో తేదీప్యమానంగా వెలుగనున్నాయి. రోజూ వందలాది మంది భక్తులు ఇక్కడి విచ్చేసి దేవుళ్లను దర్శించుకుని వెళ్తూ ఆహ్లాదకరమైన వాతావరణ అనుభూతిని పొందుతున్నారు.