ఒకప్పుడు తన ఒడిలో ఎందరికో పాఠాలు చెప్పి ఉన్నతులుగా తీర్చిదిద్దిన ఆ సరస్వతీ నిలయం కార్పొరేట్ దెబ్బకు కళ తప్పింది. ఇంగ్లిష్పై ఆసక్తితో చాలామంది తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రైవేటుకు పంపడంతో ఆ స్కూల్ బోసిపోయింది. విద్యార్థుల సంఖ్య తగ్గి మూతబడే పరిస్థితికి వచ్చిన ఆ బడిని ఇంగ్లిషు మీడియం నిలబెట్టింది. ఆంగ్ల బోధనే అస్త్రంగా మార్చుకుని ప్రధానోపాధ్యాయుడు, ఉపాధ్యాయులు పట్టుబట్టి అనుమతి సాధించి బడిని బతికించారు. ఇప్పుడు ఆ పాఠశాలలో విద్యార్థుల సంఖ్య పెరిగి విజ్ఞాన నిలయంగా మారి అవార్డులు కూడా పొందింది. అదే హనుమకొండ జిల్లా శాయంపేట మండలకేంద్రంలోని బాలుర ఉన్నత పాఠశాల.
ఇంగ్లిష్ మీడియంతోనే బడి నిలబడింది
ఒకటో తరగతి నుంచే ఇంగ్లిష్ మీడియం ప్రారంభిస్తామని ప్రభుత్వం ప్రకటించడం మంచి నిర్ణయం. శాయంపేట బాలుర హైస్కూల్లో 2015లో విద్యార్థులు తగ్గిపోయారు. ఇంగ్లిష్ మీడియంపై ఆసక్తితో చాలామంది తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రైవేటు పాఠశాలలకు పంపారు. ఎలాగైనా బడిని బతికించాలని నిర్ణయించి, ఉన్న వనరులను ఉపయోగించుకుని మేమే ఇంగ్లిష్మీడియంలో బోధిస్తామని విల్లింగ్ ఇచ్చి అనుమతులు సాధించినం. అప్పటి ఆర్జేడీ, ఇన్చార్జి డీఈవోగా ఉండడంతో సులువుగా అనుమతి వచ్చింది. పిల్లలకు ఇంగ్లిష్ మీడియంలో పుస్తకాలను అందించి బోధన ప్రారంభించాం. ప్రస్తుతం 60 మంది విద్యార్థులు ఉన్నారు. రానున్న రోజుల్లో విద్యార్థుల సంఖ్య పెరిగి పూర్వవైభవం వస్తుంది. మన ఊరు- మనబడి, ఆంగ్లమాధ్యమంతో గ్రామీణ ప్రాంతాల్లోని ప్రభుత్వ పాఠశాలలకు మహర్దశ పడుతుంది. విద్యారంగంలో ఇది గొప్ప మైలురాయిగా నిలుస్తుంది. ముఖ్యమంత్రి నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాం.