‘కరోనా వ్యాప్తి తీవ్రమవుతున్న ప్రస్తుత సమయంలో పరిసరాలను శుభ్రంగా ఉంచాలి. నగరంలో చెత్త డబ్బాల తరలింపు అనంతరం ఆ ప్రాంతాన్ని శుభ్రం చేయకపోవడంతో దుర్వాసన, దోమలు వ్యాపిస్తున్నాయి. నాలుగురోజుల్లో పేరుకుపోయిన చెత్తను తొలగించాలి. ప్రతిరోజూ ఉదయం మెడికల్ ఆఫీసర్, డిప్యూటీ కమిషనర్, పారిశుధ్య అధికారులు క్షేత్రస్థాయిలో తనిఖీలు నిర్వహిం చాలి. బిన్ఫ్రీ సిటీగా మార్చుతున్న నేపథ్యంలో ఇంటింటి చెత్త సేకరణ వేగవంతం కావాలి. అవసరమైతే అదనంగా స్వచ్ఛ ఆటోలు సమకూర్చుకోండి. మార్కెట్లు, బస్టాండ్లు, ఇతర ప్రాంతాల్లో చెత్త కనిపించొద్దు’ అని పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ బల్దియా అధికారులను ఆదేశించారు. శనివారం పురపాలకశాఖ ముఖ్యకార్యదర్శి అర్వింద్కుమార్తో కలిసి మంత్రి సమీక్ష నిర్వహించారు.
సాలీడ్ వేస్ట్ మేనేజ్మెంట్ నిబంధనలను అనుసరించి నగరంలో డస్ట్బిన్లను తొలగించడం జరిగిందని, అయితే, ఈ కేంద్రాల్లో ఏర్పడ్డ చెత్త తొలగింపు సంతృప్తికరంగా లేదని, సేకరణ వేగం పెంచాలని మంత్రి కేటీఆర్ అధికారులకు ఆదేశాలిచ్చారు. నగరంలో పేరుకుపోయిన చెత్తను రానున్న నాలుగు రోజుల్లోగా పూర్తి స్థాయిలో తొలగించాలని పురపాలక శాఖ మంత్రి కేటీ రామారావు జీహెచ్ఎంసీ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ప్రతి సర్కిల్లోని మెడికల్ ఆఫీసర్, డిప్యూటీ కమిషనర్, సంబంధిత పారిశుధ్య అధికారులు ప్రతి రోజూ ఉదయం క్షేత్రస్థాయిలో తనిఖీలు నిర్వహించి పూర్తిగా గార్బేజ్ను తొలగించేలా చర్యలు చేపట్టాలన్నారు. ఇందుకు గాను అవసరమైన ఆదనపు వాహనాలు, డంపర్లను సమకూర్చుకోవాలని మంత్రి ఆదేశించారు. పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి ఆర్వింద్ కుమార్తో శనివారం కలిసి మంత్రి కేటీఆర్ సమీక్ష సమావేశం నిర్వహించారు. పారిశుధ్య కార్యక్రమాల నిర్వహణపై రోజూ ఉదయం క్షేత్రస్థాయి తనిఖీలు నిర్వహించి పారిశుధ్య కార్యక్రమాల నిర్వహణ, పేరుకుపోయిన చెత్తను తొలగించడంతో పాటు డిస్-ఇన్ఫెక్షన్ స్ప్రేయింగ్ ముమ్మరంగా చేసేందుకు ప్రాధాన్యత ఇవ్వాలని మంత్రి ఆదేశించారు.
ఆదివారం నుంచి ఉదయం జోనల్, డిప్యూటీ కమిషనర్లు, ఏఎంహెచ్ఓలు క్షేత్రస్థాయిలో పర్యటించి గార్బేజ్ను తొలగించేలా చర్యలు చేపట్టాలని స్పష్టం చేశారు. ప్రధానంగా రద్దీ ప్రాంతాలైన మార్కెట్లు, బస్స్టేషన్లు, పార్కులు, వ్యాపార ప్రాంతాల్లో గార్బేజ్ కనిపించకూడదని పేర్కొన్నారు. బిన్ఫ్రీ సిటీగా చేపట్టిన చర్యల వల్ల ఇంటింటి నుంచి గార్బేజ్ సేకరణ మరింత పెరగాలని, ఇందుకు గాను అవసరమైన అదనపు స్వచ్ఛ ఆటోలను పొందేందుకు మహీంద్ర కంపెనీ యాజమాన్యాలతో సంప్రదించాలని జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేశ్ కుమార్కు మంత్రి కేటీఆర్ సూచించారు.
రహదారులు, వీధుల్లో చెత్త కనిపిస్తే ఏ మాత్రం సహించేది లేదని, ఇందుకు సంబంధిత ఏఎంహెచ్ఓలు, డిప్యూటీ కమిషనర్లకు బాధ్యులను చేయడం జరుగుతుందని ముఖ్య కార్యదర్శి అర్వింద్ కుమార్ హెచ్చరించారు. ప్రధానంగా గార్బేజ్ వల్నరబుల్ కేంద్రాలపై ప్రధాన దృషి సారించాలని చెప్పారు. డంపింగ్ యార్డులు, ఇంటర్ మీడియెట్ ట్రాన్స్ఫర్ స్టేషన్లలో గార్బేజ్ ఎత్తివేతలో ఏ విధమైన సమస్యలు తలెత్తకుండా వాటి స్థాయిని పెంచాలని అర్వింద్ కుమార్ సూచించారు. రానున్న నాగులు రోజులు ఉద్యమ రూపంలో గార్బేజ్ తొలగింపు కార్యక్రమాన్ని నిర్వహించాలన్నారు. కరోనా నేపథ్యంలో ఏర్పడ్డ పరిస్థితుల దృష్ట్యా నగరంలోని ప్రధాన కూడళ్లు, జన సాంద్రత ప్రాంతాలు, మార్కెట్లు, పార్కులు తదితర ప్రాంతాల్లో విస్తృతంగా డిస్-ఇన్ఫెక్షన్ స్ప్రేయింగ్ను చేపట్టాలని ఆయన ఆదేశించారు. ప్రజారోగ్య పరిరక్షణకు గానూ ఒక శాతం సోడియం హైపోక్లోరైడ్ ద్రావకంతో కూడిన స్ప్రేయింగ్ను క్రమం తప్పకుండా చేపట్టాలని చెప్పారు. మృతదేహాల వల్ల ఏ విధమైన సమస్యలు తలెత్తకుండా ఉండేందుకు గాను శ్మశాన వాటికల్లో తగు నీటి లభ్యత, సరైన లైటింగ్ తదితర సౌకర్యాలు ఉండేలా చర్యలు చేపట్టాలని అర్వింద్ కుమార్ జీహెచ్ఎంసీ అధికారులను ఆదేశించారు.