కరోనా మహమ్మారి కరాళనృత్యం చేస్తూ ప్రాణాలను హరిస్తున్న వేళ ప్రజారోగ్య వ్యవస్థను పటిష్టం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సమాయత్తమైంది. ఏడాది కాలంగా వైరస్పై అవిశ్రాంతంగా పోరాడుతున్న వైద్యసిబ్బంది పని భారం తగ్గించాలని నిర్ణయించింది. అందుకు యాభైవేల మంది యువ డాక్టర్లను తాత్కాలిక పద్ధతిన నియమిస్తున్నది. డాక్టర్లే కాకుండా అవసరమైన సంఖ్యలో ఫార్మాసిస్టులు, ల్యాబ్ టెక్నీషియన్లు, నర్సులు, ఆయాలను అందుబాటులోకి తెస్తున్నది. దీంతో రాత్రింబగళ్లు అలుపెరుగకుండా సంవత్సరకాలంగా సేవలందిస్తున్న వారి పనిభారం తగ్గించవచ్చు. రోగులకు మెరుగైన సేవలు అందటానికి అవకాశం ఉంటుంది. ఆపత్కాలంలో ముందుకు వచ్చి సేవలందించే వారికి, తర్వాత కాలంలో నియామకాల్లో ప్రాధాన్యం ఉంటుందని ప్రకటించటం కూడా సముచితంగా ఉన్నది.
ఆపదను ఆవకాశంగా మార్చుకోవడం ఉత్తమమైన మార్గం. కరోనాను ఎదుర్కొనే క్రమంలో రాష్ట్ర ప్రభుత్వం దీర్ఘకాలిక దృష్టితో వైద్య వ్యవస్థను పటిష్టం చేయడం గమనార్హం. ప్రజారోగ్య వైద్య వ్యవస్థలో పీహెచ్సీ మొదలు సూపర్ స్పెషాలిటీ హాస్పిటళ్ల దాకా అన్ని స్థాయిలను మెరుగుపరుచడంపై ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టిసారించారు. ఆదిలాబాద్, వరంగల్లో సూపర్ స్పెషాలిటీ హాస్పిటళ్ల ఏర్పాటుకు తగిన నిధులు కూడా విడుదల చేశారు. కానీ మొదటి దశ కన్నా సెకండ్ వేవ్ భీతిగొల్పుతున్నది. రోజుకు నాలుగు లక్షలకు పైగా కేసులు, నాలుగు వేల మరణాలు సంభవిస్తున్నాయి. మూడో వేవ్ వచ్చే ప్రమాదమున్నదని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. అంటే కరోనాతో ఎంతకాలం పోరాటం చేయాల్సి వస్తుందో, అది ఎప్పుడు అంతరించి పోతుందో తెలియని పరిస్థితి. అందువల్ల రాబోయే రోజుల్లో వైద్య సేవలు అందించడానికి సిబ్బంది కొరత ఏర్పడ కూడదని ప్రభుత్వం భావిస్తున్నది. ప్రభుత్వంతో పాటు అన్ని వర్గాల ప్రజలు బాధ్యతతో వ్యవహరించాలని కోరుతున్నది.
కొవిడ్ మహమ్మారిని ఎదుర్కొనడంలో వైద్య సిబ్బందిని రాష్ట్ర ప్రభుత్వం అగ్రగామి యోధులుగా గుర్తించి ప్రోత్సహించింది. డాక్టర్లతో పాటు ఇతర వైద్య సిబ్బంది చేస్తున్న సేవలు ప్రశంసనీయమైనవి. ఈ క్రమంలో కొందరు కరోనా కాటుకు బలయ్యారు. మరోవైపు కరోనా పేట్రేగుతుండటంతో పరిస్థితి రోజురోజుకూ మరింత విషమంగా మారుతున్నది. ఈ దశలో కరోనాపై పోరాడటం అందరి బాధ్యత. కానీ ఈ పోరులో వైద్యుల పాత్ర కీలకమైంది. వైద్య వృత్తిలోనే సేవాభావం మిళితమై ఉంది. ప్రాచీన కాలం నుంచి సమాజంలో వైద్యులకు ఎంతో గౌరవం ఉన్నది. ప్రస్తుతం నెలకొన్న విషమ పరిస్థితుల్లో వైద్యులు తమ ప్రాముఖ్యతను గుర్తించాలి. ప్రభుత్వ ఉద్యోగంలో ఉన్నా, లేకున్నా కరోనాపై చేస్తున్న పోరాటంలో సమాజానికి అండగా నిలవాలి.