న్యూఢిల్లీ: తల్లిదండ్రులు తమ కూతుళ్ల దీర్ఘకాలిక అవసరాల కోసం పొదుపు పెట్టుబడి పథకాన్ని ఎంచుకునేటప్పుడు తరుచుగా కన్ఫ్యూజ్ అవుతుంటారు. ప్రత్యేకించి పబ్లిక్ ప్రావిడెండ్ ఫండ్, సుకన్య సమ్రుద్ధి యోజన పథకాల్లో దేంట్లో పెట్టుబడి పెట్టాలన్న విషయమై ఇతమిద్ధంగా తేల్చుకోలేని పరిస్థితులు ఉన్నాయి. కూతురు విద్య, పెండ్లి అనేవి చాలా మంది తల్లిదండ్రుల ప్రధాన లక్ష్యాల్లో ఒకటిగా ఉంటాయి. ఈ రెండు పొదుపు పథకాల్లో సరైందేదేన్న విషయమై అంచనాకు రావడం చాలా ముఖ్యం.. అత్యవసరం కూడా. బెస్ట్ రిటర్న్స్, ఇతర బెనిఫిట్ల విషయంలో ఏది ఉత్తమం అన్నదీ ఎంచుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఆయా పథకాల్లో ప్రయోజనాలేమిటో ఒకసారి పరిశీలిద్దాం..
ఇలా పబ్లిక్ ప్రావిడెండ్ ఫండ్ (పీపీఎఫ్)
ఆదాయం పన్ను (ఐటీ) మినహాయింపులకు దీర్ఘకాలిక పెట్టుబడి మార్గంగా ప్రజాదరణ పొందిన పొదుపు స్కీమ్ పీపీఎఫ్. టాక్స్ బెనిఫిట్లతోపాటు అధిక వడ్డీరేట్ ఆఫర్ చేస్తుంది. ఒకే కాలంలో ఇతర ఫిక్స్డ్ ఆదాయాల కంటే పీపీఎఫ్లో ఎక్కువ వడ్డీరేట్ లభిస్తుంది. పీపీఎఫ్పై వచ్చే వడ్డీ, ఇతర రిటర్న్స్ పైనా ఆదాయం పన్ను వర్తించదు. గరిష్ఠంగా 12 వాయిదాల్లో గానీ, ఒకేసారి భారీ మొత్తంలో పెట్టుబడి స్కీమ్ పీపీఎఫ్. ఒక ఆర్థిక సంవత్సరంలో కనీసం రూ.500 నుంచి గరిష్ఠంగా రూ.1.5 లక్షల వరకు ఇన్వెస్ట్ చేసేందుకు అనుమతినిస్తారు. పీపీఎఫ్ గడువు పదిహేనేండ్లు. ప్రస్తుత వడ్డీరేటు 7.1 శాతం లభిస్తుంది.
సుకన్య సమృద్ధి యోజన (ఎస్ఎస్వై) ఇలా..
2015లో ప్రధాని నరేంద్రమోదీ సుకన్య సమృద్ధి యోజన (ఎస్ఎస్వై) పథకాన్ని ప్రారంభించారు. ప్రత్యేకించి బాలికల పొదుపు పథకంగా.. దీర్ఘకాలిక పెట్టుబడి మార్గంగా అత్యంత ప్రజాదరణ పొందిన స్కీమ్గా ఎస్ఎస్వై నిలిచింది. సాధారణంగా ఎస్ఎస్వై బాలిక పుట్టినప్పటి నుంచి 10 ఏండ్ల వరకు ఈ పథకంలో చేరొచ్చు. అయితే ఆ బాలిక తప్పనిసరిగా భారతీయురాలై ఉండాలి. 18 ఏండ్లు దాటిన తర్వాత సదరు బాలిక ఖాతాదారు అవుతుంది. ఆమె కనీసం రూ.250 నుంచి గరిష్ఠంగా రూ.1.5 లక్షల వరకు ఒక ఏడాదిలో ఇన్వెస్ట్ చేయొచ్చు. తొలుత కనీస పెట్టుబడిగా రూ.1000 నిర్ణయించిన కేంద్రం.. తర్వాత 2018లో రూ.250కి కుదించింది. ఈ పథకంపై వచ్చే వడ్డీ, మెచ్యూరిటీ మొత్తంపైనా పన్ను మినహాయింపు ఉంది. ప్రారంభంలో ఈ పథకంలో పెట్టుబడిపై 8.4 శాతం వడ్డీరేట్ ఆఫర్ చేయగా, ఇప్పుడు దాన్ని 7.6 శాతానికి కుదించారు.
సుకన్య సమృద్ధి యోజన వర్సెస్ పీపీఎఫ్
సుకన్య, పీపీఎఫ్లతో పోలిస్తే పీపీఎఫ్ కంటే సుకన్యకు ఎక్కువ వడ్డీరేటు లభిస్తుంది. పీపీఎఫ్తో పోలిస్తే భవిష్యత్లో వడ్డీరేటు మరింత పెరుగొచ్చు. బాలిక భవితవ్యాన్ని పరిగణనలోకి తీసుకుని డెట్ ఫండ్లోనూ ఇన్వెస్ట్ చేయొచ్చు. పీపీఎఫ్ ఇన్వెస్ట్ మెంట్ ఆప్షన్ కూడా మంచిదే. బాలిక 21 ఏండ్లు దాటిన తర్వాత సుకన్య పథకం క్లోజ్ అవుతుంది. పీపీఎఫ్ 15 ఏండ్లకు మెచ్యూర్ అయినా, మరో ఐదేండ్లు కొనసాగొచ్చు.
తల్లిదండ్రులు ఏదో ఒక స్కీమ్లో పెట్టుబడులు పెట్టడానికి తరుచుగా ప్రయత్నిస్తుంటారు. కానీ నిపుణులు మాత్రం ఒకే స్కీమ్లో పెట్టుబడులు పెట్టొద్దని సూచిస్తున్నారు. చిన్న మొత్తాలు పీపీఎఫ్లోనూ ఇన్వెస్ట్ చేయాలని చెబుతున్నారు. బాలికకు జీవితం అంతా ఫ్లెక్లిబుల్గా, ద్రవ్య లభ్యతకు పీపీఎఫ్ ఆఫర్ చేస్తుంది. కనుక రెండింటిలోనూ పొదుపు చేయాలని సూచిస్తున్నారు. సుకన్య స్కీమ్లో 15 ఏండ్లు దాటాక పెట్టుబడులు అనుమతించరు. అయితే, 21 ఏండ్ల తర్వాత మెచ్యూర్ అవుతుంది. 18 ఏండ్ల తర్వాత కొన్ని పరిస్థితులను బట్టి విత్డ్రా చేసుకోవచ్చు. ఈ రెండు పథకాలకూ ఆదాయం పన్ను చట్టం 80సీ సెక్షన్ కింద మినహాయింపు లభిస్తుంది.