కర్ణాటకలో ఆక్సిజన్ కొరతతో 24 మంది మృతి
బెంగళూరు, మే 3: ప్రాణవాయువు కొరతతో దేశంలోని మరో దవాఖానలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. మహారాష్ట్రలోని నాసిక్, ఢిల్లీలోని బాత్రా, ఏపీలోని విజయనగరం దవాఖానాల్లో ఆక్సిజన్ కొరతతో కరోనా రోగులు ప్రాణాలు కోల్పోయిన ఘటనలు మర్చిపోకముందే కర్ణాటకలో మృత్యు ఘోష కలచివేసింది. కర్ణాటకలోని చామరాజనగర్ జిల్లా దవాఖానలో ఆక్సిజన్ కొరతతో 24 గంటల్లో 23 మంది కరోనా రోగులతో పాటు మరో రోగి మరణించారు. మృతుల బంధువులు దవాఖానా ముందు ఆందోళనకు దిగారు. ఈ ఘటనపై సీనియర్ ఐఏఎస్ అధికారితో విచారణకు ఆదేశించినట్టు కర్ణాటక సీఎం బీఎస్ యెడియూరప్ప తెలిపారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. అయితే కరోనా రోగుల మరణాలకు ఆక్సిజన్ కొరత కారణమనడం సరికాదని చామరాజనగర్ జిల్లా ఇన్చార్జి మంత్రి పేర్కొన్నారు.