చార్ధామ్ తీర్థయాత్రకి హిందూ మతంలో విశేష ప్రాధాన్యత ఉంది. నాలుగు సుప్రసిద్ధ పుణ్యక్షేత్రాలతో కూడిన ఈ తీర్థయాత్రలో ఉత్తరాఖండ్లోని బద్రీనాథ్ క్షేత్రం ఒకటి. ఉత్తర భారతదేశాన హిమాలయాల చెంతనున్న ఆ క్షేత్రానికి అందరూ వెళ్లలేరు. కానీ, చూడాలన్న కోరిక ఎందరిలోనో ఉంటుంది. అంత దూరం వెళ్లలేని భక్తుల కోరిక తీర్చేలా బద్రీనాథుడు దక్షిణాదికి తరలివచ్చి హైదరాబాదు వద్ద కొలువయ్యాడు. దక్షిణ బద్రీనాథ్గా పేరొందిన ఈ ఆలయం హైదరాబాదుకి కేవలం 50 కిలోమీటర్ల దూరంలో ఉంది. సెలవులు, పండుగలు, వారాంతాల్లో భక్తులతో కిటకిటలాడే ఈ దివ్యక్షేత్రాన్ని మనమూ దర్శించుకుని తరిద్దాం పదండి…