పెళ్లి పత్రిక అంటే మామూలుగా ఓ కార్డుపై అచ్చేసిన అక్షరాలు మాత్రమే అని ఇప్పటివరకూ మనకు తెలుసు. కానీ, భూమిలో నాటితే మొక్కయ్యే కార్డును మీరెప్పుడైనా చూశారా? నిర్మల్ జిల్లాలోని బాగుల్వాడకు చెందిన ప్రవీన్ అనే వ్యక్తి అలాంటి పెళ్లి కార్డు పంచుతూ అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తాడు. పర్యావరణహిత కార్డులతో అందరూ మొక్కలు నాటాల్సిన ఆవశ్యకతను తెలియజేస్తున్నాడు. ఈ పెళ్లిపత్రిక ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది.
ఈ ఎకో ఫ్రెండ్లీ పెళ్లి పత్రికను తమిళనాడు రాష్ట్రంలోని కోయంబత్తూరులో తయారుచేయించాడు. తులసి, బంతిపువ్వు, పాలకూర, ఇతర కూరగాయల విత్తనాలతో ఈ కార్డును తయారుచేశారు. ఈ కార్డును గంటసేపు నీటిలో నానబెడితే విత్తనంగా మారిపోతుంది. దీనిని కుండీలో విత్తుకుంటే మొక్కవుతుంది. తన పెళ్లి అందరికీ గుర్తుండిపోయేలా, అందరిలో పర్యావరణ స్పృహ కలిగించేలా ఈ ఆలోచన చేసినట్లు ప్రవీన్ తెలిపాడు. అంతేకాదు.. దేశభక్తి చాటేలా కార్డుపై భగత్సింగ్, చత్రపతి శివాజీ, కుమ్రం భీం, స్వామివివేకానంద చిత్రాలను ప్రింట్ చేయించాడు. ఒక్కో కార్డుకు రూ.50 ఖర్చైందని ప్రవీన్ పేర్కొన్నాడు.