Viral News | దొంగలకు దొరికింది దోచుకెళ్లడం అలవాటు. అలా దోచుకెళ్లిన ఇంటి వైపు కన్నెత్తి చూడరు. ఎందుకంటే దొరికిపోతామేమో అన్న భయం. అయితే, ఓ దొంగ మాత్రం ఇందుకు భిన్నంగా ప్రవర్తించాడు. ఓ ల్యాప్టాప్ను దొంగిలించి ఏకంగా యజమానినే క్షమాపణలు కోరాడు. అంతటితో ఆగకుండా ఓ ఆఫర్ కూడా ప్రకటించాడు. వింటుంటే.. వింతగా ఉంది కదూ..? అయితే పూర్తి వివరాలు చదవండి ఏం జరిగిందో మీకే అర్థమవుతుంది.
జ్వేలీ అనే వ్యక్తి ల్యాప్టాప్ను ఓ దొంగ దొంగిలించాడు. అయితే, దొంగిలించిన అనంతరం ఆ దొంగ జ్వేలీని క్షమాపణలు కోరుతూ మెయిల్ చేశాడు. ‘‘నన్ను క్షమించండి. నిన్న మీ ల్యాప్టాప్ను ఎత్తుకెళ్లింది నేనే. కష్టాల్లో ఉన్నా.. కొంత డబ్బు అవసరం పడింది. తప్పనిసరి పరిస్థితుల్లో ఈ పని చేయాల్సి వచ్చింది. ల్యాప్టాప్లో మీరు దాచుకున్న రీసెర్చ్ ఫైల్స్ను ఈ మెయిల్ ద్వారా పంపిస్తున్నా. ఇంకా ముఖ్యమైన సమాచారం ఏమైనా ఉంటే సోమవారం మధ్యాహ్నంలోపు చెప్పండి పంపించేస్తా.. ఎందుకంటే ఆ తర్వాత ల్యాప్టాప్ నా వద్ద ఉండదు’’ అని చెప్పాడు.
ఇది చూసిన జ్వేలీ ఒక్కసారిగా షాక్ అయ్యాడు. ల్యాప్టాప్ పోయినందుకు బాధపడాలో.. రీసెర్చ్ ఫైల్స్ దొరికినందుకు ఆనందపడాలో అర్థం కాని పరిస్థితుల్లో ఉండిపోయాడు. ఈ విషయాన్ని జ్వేలీ ట్విట్టర్ ద్వారా తెలియజేశారు. దీంతోపాటు దొంగ పంపిన మెయిల్కు సంబంధించిన స్క్రీన్ షాట్స్ను కూడా షేర్ చేశారు. ‘‘నిన్న నా ల్యాప్టాప్ను ఎవరో దొంగిలించాడు. ఆ తర్వాత నా మెయిల్ ఐడీ నుంచి నాకు మెయిల్ ద్వారా ఈ విషయాన్ని తెలియజేశారు’’ అంటూ ట్వీట్ చేశాడు. ప్రస్తుతం ఈ ట్వీట్ నెట్టింట వైరల్ అవుతోంది. ఇది చూసిన నెటిజన్లు రకరకాల కామెంట్లు పెడుతున్నారు.